Sri Laxmi Chennakeshava Swamy Devasthanam: ఆంధ్రప్రదేశ్లోని ప్రఖ్యాత దేవాలయాల్లో మాచర్ల చెన్నకేశవ ఆలయం ప్రధానమైనది. ఎన్నో చారిత్రక ఘట్టాలకు ఈ ఆలయం వేదికగా నిలిచింది. అద్భుతమైన నిర్మాణ శైలి, అబ్బురపరచే శిల్ప సంపదతో అలరారుతున్న ఈ ప్రాచీన ఆలయ విశేషాలు తెలుసుకుందాం.
గుంటూరు జిల్లాలోని మాచర్ల పట్టణంలో ఈ ఆలయం ఉంది. మాచర్లకు మహాదేవి చర్ల, విష్ణుపురం అనే పేర్లున్నాయి. బ్రహ్మనాయుడు తన స్వస్థలమైన ‘మాచాపురం’ పేరుతో ఈ పట్ణణాన్ని నిర్మించాడనీ చెబుతారు. చంద్రవంక నదీ తీరాన గల ఈ ఆలయంలో శ్రీ మహా విష్ణువు చెన్నకేశవుడిగా పూజలందుకుంటున్నాడు. ‘చెన్ను’ అనగా అందమైన అని అర్థం. దీనికి తగినట్లే ఇక్కడ స్వామి అద్భుతమైన సౌందర్యంతో దర్శనమిస్తాడు. కేశవ అనే పదానికి ఒత్తైన, మెత్తని కేశములు(వెంట్రుకలు) కలిగినవాడు అని అర్థం. కేశవ (క + అ+ ఈశ) అనగా బ్రహ్మ, విష్ణు, శివుని రూపాల కలిసిన పరమాత్మ అనీ చెబుతారు. ఇక్కడి మూర్తిని సాక్షాత్తూ కార్త వీర్యార్జునుడు ప్రతిష్ఠించాడని ఐతిహ్యం.
ఈ ఆలయంలో స్వామివారు నాలుగు చేతుల్లో పద్మం, శంఖం, చక్రం, గదను ధరించి లక్ష్మీ సమేతంగా దర్శనమిస్తాడు. స్థల పురాణం ప్రకారం, చెన్నుడు అనే భక్తుడు విష్ణు మూర్తికై తపస్సు చెయ్యగా, ఆ భక్తుని పేరు చిరస్థాయిగా నిలిచేందుకు స్వామి చెన్న కేశవుడిగా ఆవిర్భవించాడని చెబుతారు. క్రీ.శ 1113 లో శైవాలయంగా ప్రారంభమైన ఈ కోవెలను బ్రహ్మనాయుడు వైష్ణవ దేవాలయంగా మార్చి, పునరుద్ధరించాడని చెబుతారు. ఈ స్వామిని కొలిచిన తర్వాతే బ్రహ్మనాయుడికి బాలచంద్రుడు పుట్టాడని, నాటి నుంచి స్వామికి సంతాన చెన్నకేశవుడనే పేరు వచ్చింది. ఈ ఆలయం తొలినాళ్లలో శైవాలయంగా ఉండేదని, కాలక్రమంలో దీనిని వైష్ణవాలయంగా మార్చారనీ చెబుతారు.
Read More: ఫాల్గుణ అమావాస్య ఎప్పుడు? దాని ప్రాముఖ్యత తెలుసుకోండి..
స్వామివారి మూలవిరాట్టు మూడున్నర అడుగులుంటుంది. విశాలమైన నేత్రాలతో, తిరునామం ధరించి, శిరస్సు మీద కిరీటంతో దర్శనమిస్తాడు. స్వామి ముడివేసిన కేశాలు, కోరమీసం పల్నాటి పౌరుషానికి ప్రతీకగా అనిపిస్తాయి. వక్షస్థలంపై బంగారు కవచాన్ని ధరించి, మెడలో పూలమాలలతో, పావుకోళ్లు ధరించిన స్వామి రూపాన్ని చూడగానే భక్తులు ఒక తెలియని పారవశ్యానికి లోనవుతారు. స్వామివారి ఆలయానికి పక్కనే ఉండే లక్ష్మీదేవి ఆలయాన్ని క్రీ.శ 13వ శతాబ్దంలో నిర్మించారు.
నదులు పడమర నుంచి తూర్పుకు ప్రవహిస్తాయి. కానీ ఇక్కడి చంద్రవంక నది తూర్పు నుంచి పడమరకు ప్రవహిస్తూ దర్శనమిస్తుంది. స్వామి దర్శనం తర్వాత భక్తులు ఇక్కడి కప్పక స్తంభానికి మొక్కి ప్రదక్షిణం చేస్తారు. ఆలయ ధ్వజస్తంభ ప్రతిష్ఠ సమయంలో విరిగిపడిన కొంత భాగాన్ని కప్పక స్తంభంగా ధ్వజస్తంభం పక్కనే ప్రతిష్ఠించారు. ఆలయ ప్రాంగణంలోని 60 అడుగుల ఎత్తైన అందమైన పెద్ద రథం దర్శనమిస్తుంది. దీనిని క్రీ.శ 1879లో గోల్కొండ వ్యాపారి కంచనపల్లి నారాయణరావు అనే భక్తుడు అందించాడు. ఈ ఆలయం లోపలి సొరంగం నుంచి వెళితే ఎత్తిపోతల దత్తాత్రేయ ఆలయానికి చేరుకోవచ్చనీ, పూర్వం అనేకమంది మునులు ఈ మార్గంలో సంచరించేవారని చెబుతారు.
ఏటా చైత్రశుద్ద పౌర్ణమి రోజు స్వామి వారికి ఘనంగా ప్రజలందరి మధ్య కళ్యాణం జరుపుతారు. బ్రహ్మోత్సవాలు, రథోత్సవం రోజున జరిగే జాతరకు లక్షలాది భక్తులు స్వామిని దర్శించుకుంటారు.