Jagan: ఏపీలో వైఎస్ఆర్ సీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కేంద్రంతో మంచి సంబంధాలే కొనసాగిస్తున్నారు సీఎం జగన్. రాష్ట్రంలో కొందరు బీజేపీ నేతలు వైఎస్ జగన్ ప్రభుత్వంపై ఆరోపణలు, విమర్శలు చేసినా ఆ నేతలకే వైఎస్ఆర్ సీపీ నేతలు కౌంటర్ ఇస్తున్నారు తప్ప కేంద్రంపై ఎలాంటి విమర్శలు చేయడంలేదు.
కేంద్రం పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన అనేక బిల్లులకు వైఎస్ఎస్ సీపీ మద్దతు ఇచ్చింది. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికలల్లో మద్దతు ఇచ్చింది. విభజన హామీలు, ఏపీకి ప్రత్యేక హోదా, విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు విషయంలోనూ రాజీధోరణిలోనే వ్యవహరించారు సీఎం జగన్. ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా , ఇతర కేంద్రమంత్రులను అనేకసార్లు కలిసి వినతి పత్రాలు అందించారు. కొన్నిసార్లు లేఖలు రాశారు సీఎం జగన్. అంతే తప్ప కేంద్ర హామీలు అమలు చేయడంలేదని నిందించలేదు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్రంతో ఢీ అంటే ఢీ అనలేదు. పోలవరం ప్రాజెక్టు నిధులు కోసం అదే ధోరణితో వైఎస్ జగన్ ప్రభుత్వం వ్యవహరించింది. 22 మంది ఎంపీలు ఉన్నారు కేంద్రాన్ని నిలదీయండి అని టీడీపీ ఎంత రెచ్చగొట్టినా ఆ ట్రాప్ లో వైఎస్ఆర్ సీపీ పడలేదు. కేంద్రంతో స్నేహసంబంధాలనే కొనసాగించారు సీఎం వైఎస్ జగన్.
విశాఖలోని ఏయూ ఇంజినీరింగ్ కళాశాల మైదానంలో నిర్వహించి బహిరంగ సభలో జగన్ మరోసారి కేంద్రంతో బంధంపై మాటల ద్వారా క్లారిటీ ఇచ్చారు. అదే విషయాన్ని విశాఖలో మోదీ సమక్షంలోనే స్పష్టం చేశారు. కేంద్రంతో తమ బంధం రాజకీయాలకు అతీతమని తేల్చేశారు. రాష్ట్ర ప్రయోజనాలు తప్ప మరో అజెండా ఉండదన్నారు. అంటే ఆ పార్టీతో వైరం ఉండదు. అదే సమయంలో పొత్తు ఉండదు. జగన్ చెప్పిన మాటల్లో అంతరార్థం ఇదే అని స్పష్టమవుతోంది.
గతంలో మాదిరిగానే కేంద్రానికి, ప్రధాని మోదీకి జగన్ కొన్ని విజ్ఞప్తులు చేశారు. విభజన గాయాల నుంచి ఆంధ్రప్రదేశ్ ఇంకా పూర్తిగా కోలుకోలేదన్నారు. సహృదయంతో చేసే ప్రతి సాయం రాష్ట్ర పునర్నిర్మాణానికి ఉపయోగపడుతుందన్నారు. రూ. 10వేల కోట్లు విలువైన అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేసినందుకు ప్రధానికి ధన్యవాదాలు తెలిపారు.
అభివృద్ధి, పరిపాలన వికేంద్రీకరణ, పారదర్శకతకు రాష్ట్రంలో ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు సీఎం జగన్. ఇంటింటా ఆత్మవిశ్వాసం నింపేందుకు ప్రతి రూపాయి సద్వినియోగం చేస్తున్నామన్నారు. పెద్ద మనస్సుతో ప్రధాని మోదీ చూపే ప్రేమ ప్రజలంతా గుర్తుపెట్టుకుంటారని తెలిపారు. విశాఖ స్టీల్ ప్లాంట్ నుంచి రైల్వే జోన్ వరకు పలు అంశాలపై ఇప్పటికే విజ్ఞప్తి చేశామన్నారు. ఏపీకి సహాయ సహకారాలు అందించాలని ప్రధానిని సీఎం జగన్ కోరారు.
ఇన్నాళ్లూ చేతల ద్వారా తన ఉద్దేశాన్ని చెప్పిన ఏపీ సీఎం వైఎస్ జగన్…ఇప్పుడు మరింత స్పష్టంగా తన అజెండా ఏంటో స్పష్టంగా చెప్పారు. కేంద్రం ప్రభుత్వానికి ఎప్పుటికీ తమ మద్దుతు ఉంటుందని తేల్చేశారు. రాజకీయ బంధాలు ఉండవుకానీ పాలనా బంధాలు ఉంటాయని జగన్ మాటల ద్వారా స్పష్టం చేశారు.