PM Modi Speech in Arunachal Pradesh(Telugu breaking news): ప్రధాని నరేంద్రమోదీ నేడు అరుణాచల్ ప్రదేశ్ ఈటానగర్ లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. అతిపొడవైన సేలా టన్నెల్ ను ప్రారంభించి జాతికి అంకితమిచ్చారు. సేలా పాస్ మీదుగా తవాంగ్ కు సేలా టన్నెల్ కనెక్ట్ చేస్తుంది. రూ.825 కోట్ల వ్యయంతో ఈ టన్నెల్ ను నిర్మించారు. 2019లో ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు.
అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడుతూ.. దేశ ప్రజలే తన కుటుంబ సభ్యులని తెలిపారు. ఎన్నికల్లో విజయం కోసం కాదు.. దేశ ప్రజల కోసం, దేశ అభివృద్ధి కోసం పనిచేస్తానని పేర్కొన్నారు ప్రధాని మోదీ. యూపీఏ పాలనలో అభివృద్ధి కుంటుపడిందన్న ఆయన.. మరోసారి వచ్చేది బీజేపీ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు. ప్రతిపక్షాలకు వాళ్ల కుటుంబ రాజకీయ భవిష్యత్తే ముఖ్యమని, ప్రజల గురించి ఆలోచించరని విమర్శించారు. తాను మాత్రం వికసిత్ భారత్ కోసమే పనిచేస్తున్నానని తెలిపారు.
కాగా.. ఉదయం అస్సాంలో పర్యటించిన ప్రధాని మోదీ కజిరంగా నేషనల్ పార్క్ లో సఫారీ రైడ్ ను ఎంజాయ్ చేశారు. టైగర్ రిజర్వ్ ను పరిశీలించారు. పార్క్ లోపల ఏనుగుపై సవారీ చేశారు. అక్కడ పర్యటనలో భాగంగా 18 వేల కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులను ప్రారంభించారు.
Read more: లోక్సభ ఎన్నికల్లో ఏ పార్టీకి ఎన్ని సీట్లు ? తాజా సర్వేలో తేలిందేంటంటే..
మధ్యాహ్నం నుంచి జోర్హాట్ లో వివిధ అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించి, శంకుస్థాపనలు చేస్తారు. హోలోంగా పథర్ లో 84 అడుగుల ఎత్తయిన అహోంయోధుడు లచిత్ బోర్ఫుకాన్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. ఆ తర్వాత మెలెంట్ మెటెలి పోతార్ లో జరిగే బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద నిర్మించిన 5 లక్షల 50 వేలకు పైగా ఇళ్లకు గృహప్రవేశ వేడుకను నిర్వహిస్తారు.
రేపు ఉత్తరప్రదేశ్ లో పర్యటిస్తారు. అజాంగఢ్ లో పలు ప్రాజెక్టులను ప్రారంభించి.. జాతికి అంకితం చేస్తారు. 11న ఢిల్లీలో పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. ద్వారకా ఎక్స్ ప్రెస్ వే లోని హరియాణా సెక్షన్ ను ప్రారంభిస్తారు. 11న సాయంత్రం డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ ఆర్గనైజేషన్ కార్యక్రమంలో పాల్గొంటారు. మార్చి 12న గుజరాత్ లోని సబర్మతి, రాజస్థాన్ లోని పోఖ్రాన్ లలో పలు కార్యక్రమాల్లో ప్రధాని పాల్గొంటారు. మార్చి 13న గుజరాత్, అసోంలో 3 ముఖ్యమైన సెమీకండక్టర్ల ప్రాజెక్టులకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శంకుస్థాపన చేస్తారు.