Turmeric Record Price in Nizamabad(Telangana news today): పసుపు రైతులకు మంచిరోజులొచ్చాయి. కొద్దిరోజులుగా పసుపు పంటకు గిట్టుబాటు ధర పెరుగుతుంది. నిజామాబాద్ మార్కెట్ యార్డులో గరిష్ఠంగా.. క్వింటా పసుపు ధర రూ.17,011 పలికింది. ఇప్పటి వరకూ ఉన్న ధరల్లో ఇదే ఆల్ టైమ్ రికార్డు అంటున్నారు. 2011లో క్వింటా పసుపు ధర రూ.16,166 పలుకగా.. ఇప్పటి వరకూ అదే రికార్డు ధరగా ఉంది. తాజాగా 17 వేలకు చేరడంతో ఆ రికార్డు బ్రేక్ అయింది.
నిజామాబాద్ పసుపు మార్కెట్ యార్డుకు.. నిజామాబాద్, ఆర్మూర్, జగిత్యాల ప్రాంతాల నుంచి పసుపు రైతులు నిజామాబాద్ మార్కెట్ యార్డులోనే పసుపు అమ్మకాలు జరుపుతుంటారు. ఇప్పుడు రికార్డు స్థాయిలో ధర పలుకుతుండటంతో పసుపు రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 13 ఏళ్ల తర్వాత పసుపుకు రికార్డు ధర వచ్చిందంటున్నారు. ఇన్నాళ్లు పసుపు పండించి నష్టపోయిన వారంతా ఆనందంతో ఉబ్బితబ్బిబ్బవుతున్నారు.
Read More : TSERCలో ఉద్యోగాల భర్తీ.. నోటిఫికేషన్ విడుదల
పసుపుకు ఈ స్థాయిలో ధర రావడంపై ఎంపీ ధర్మపురి అర్వింద్ స్పందించారు. నిజామాబాద్ కు కేంద్రం పసుపుబోర్డు ఏర్పాటు చేయడంతోనే ఇది సాధ్యమైందన్నారు. పూర్తిస్థాయిలో బోర్డును ఏర్పాటు చేశాక.. మరింత రికార్డు ధర వస్తుందని, ఈ రికార్డును తామే తిరగరాస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. 2018-19లో పసుపు ఎగుమతులు లక్ష 33 వేల 600 టన్నులు ఉంటే.. ఇప్పుడు అది లక్ష 70 వేల 25 టన్నులకు పెరిగిందన్నారు. ఐదేళ్లలో పసుపు ఎగుమతులు 35 వేల టన్నుల మేర పెరిగిందని వివరించారు. పసుపు ఎగుమతి పెరిగి.. దిగుమతి తగ్గడం శుభపరిణామని తెలిపారు. ఆసియాలోనే నిజామాబాద్ పసుపుకు డిమాండ్ ఉందన్నారు.