Irumudi : మండల పూజకు వెళ్లే అయ్యప్ప భక్తులు కార్తీకంలోనూ, మకర విలక్కుకు వెళ్లే వారు మార్గశిరంలోనూ దీక్షను మొదలుపెడతారు. 41 రోజుల పాటు ఎంతో కఠిన నియమాలతో దీక్ష చేస్తారు. స్వామి శరణు వేడుతూ నియమ నిష్ఠలతో పూర్తిచేసి ఇరుముడి ధరించి శబరిమలై చేరుకుంటారు.
అయ్యప్ప దీక్ష. భక్తితో ఒక ముడి, శ్రద్ధతో మరోముడి వేసి ఇరుముడితో వడివడిగా శబరిమల చేరుకునే భక్తులు.. నలభై రోజుల దీక్షను నాలుగు కాలాలపాటు కొనసాగించే దక్షతను సాధిస్తారు. ఇరుముడి అంటే రెండు ముడులు కలది. ఆ రెండూ భక్తి, శ్రద్ధ. ఇరుముడికి కట్టే తాడు ప్రణవం. భక్తి, శ్రద్ధలను సాధనతో పొందగలిగితే.. స్వామి అనుగ్రహం లభిస్తుంది.
ఇరుముడి ఒక భాగంలో గురుస్వామి దేవుడికి సంబంధించిన సామగ్రి ఉంచుతారు. రెండో భాగంలో నీళ్లు తొలగించిన కొబ్బరికాయలో ఆవునెయ్యిని నింపి ఉంచుతారు. జీవాత్మ, పరమాత్మలను అనుసంధానం చేయడం ఈ ప్రక్రియ వెనుక ఆంతర్యం. ఈ నేతితో స్వామివారికి అభిషేకం చేస్తారు. ఇరుముడితో శబరిమల ఆలయంలోని పద్దెనిమిది మెట్లు ఎక్కి అయ్యప్పస్వామిని దర్శించుకుంటారు.
ఇరుముడి లేకుండా మెట్లు ఎక్కడానికి అర్హత ఉండదు. అయ్యప్పను దర్శించుకొని అలౌకికమైన ఆనందాన్ని పొందుతారు భక్తులు. తర్వాత దీక్షాపరులు పుణ్యక్షేత్రాల మీదుగా ఇంటికి చేరుకుంటారు. ఇంటికి వచ్చిన తర్వాత తల్లితో అయ్యప్ప మాల తీయించుకుంటారు. ఏదైనా ఆలయంలో పూజారి చేతుల మీదుగా కూడా దీక్ష విరమణ చేస్తారు. దీక్షనిచ్చిన గురుస్వామితో దీక్ష విరమణ చేయించవచ్చు. దీక్ష విరమణతో మళ్లీ పాత అలవాట్లకు లోబడితే అయ్యప్ప దీక్ష ధారణ సార్థకం కాదు. మాల విరమించినా.. నియమాలు లేకున్నా.. వ్యక్తిత్వంలో వచ్చిన మార్పును కొనసాగించాలి. జీవితాన్ని మహోన్నతంగా తీర్చిదిద్దుకోవాలి.