Himachal pradesh : హిమాచల్ ప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 8 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. సాయంత్రం 5 గంటల వరకు ఓటింగ్ కొనసాగుతుంది. మొత్తం 68 నియోజకవర్గాల్లో ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. 412 మంది అభ్యర్థులు అసెంబ్లీ ఎన్నికల బరిలో ఉన్నారు. రాష్ట్రంలో 55, 92, 828 మంది ఓటర్లు ఉన్నారు. ఎన్నికల విధుల్లో 50 వేల మంది ప్రభుత్వ ఉద్యోగులు పాల్గొన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద భారీగా భద్రతా సిబ్బందిని మోహరించారు. ముఖ్యమంత్రి జైరాం ఠాకూర్, ఆయన కుటుంబ సభ్యులు ఓటు హక్కును వినియోగించుకున్నారు.
వరసగా రెండోసారి అధికారంలోకి వచ్చి హిమాచల్ ప్రదేశ్ లో కొత్త చరిత్ర సృష్టించాలని బీజేపీ లక్ష్యంగా పెట్టుకుంది. అధికార పక్షాన్ని ఓడించి విపక్ష పార్టీకి పట్టం కట్టే సంప్రదాయం ఈ రాష్ట్రంలో ఉంది. అదే సెంటిమెంట్ రిపీట్ అవుతుందని కాంగ్రెస్ నమ్ముతోంది. మరోవైపు ఆమ్ఆద్మీ పార్టీ హిమాచల్ ప్రదేశ్ లో బరిలో ఉంది. ఆప్ ను ఏ మేరకు ప్రజలు ఆదరిస్తారో చూడాలి మరి.
హిమాచల్ ప్రదేశ్ ఓటర్లు ఉత్సాహంగా ఓటేసి సరికొత్త చరిత్ర సృష్టించాలని ప్రధాని నరేంద్రమోదీ పిలుపునిచ్చారు. ప్రజలకు రాష్ట్ర పరిస్థితిపై అవగాహన ఉందని అందుకు తగ్గట్టుగా ఓటు హక్కు వినియోగించుకోవాలని కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ పిలుపునిచ్చారు.