Congress First List Ahead of Lok Sabha Polls: లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణలో నలుగురు అభ్యర్థులతో కాంగ్రెస్ ఫస్ట్ లిస్ట్ విడుదల చేసింది. అందులో భాగంగా నల్గొండ నుంచి మాజీ మంత్రి జానారెడ్డి కొడుకు రఘువీర్ రెడ్డి బరిలో నిల్చోనున్నారు. ఇక జహీరాబాద్ నుంచి సురేష్ శెట్కర్, మహబూబ్నగర్ నుంచి వంశీచంద్ రెడ్డి, మహబూబాబాద్ నుంచి బలరాం నాయక్ పేర్లను ఏఐసీసీ సెక్రటరీ జనరల్ కేసీ వేణుగోపాల్ ప్రకటించారు.
ఇప్పటికే పాలమూరు సభలో సీఎం రేవంత్ రెడ్డి మహబూబ్నగర్ బరిలో వంశీచంద్ రెడ్డి ఉంటారని చెప్పకనే చెప్పారు. నల్లగొండ పార్లమెంట్ స్థానానికి ఫుల్ డిమండ్ ఉండగా చివరకు మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి తనయుడు కుందూరు రఘువీర్ రెడ్డికి కాంగ్రెస్ అధిష్టానం కేటాయించింది.
ఇక జహీరాబాద్ లోక్ సభ బరిలో మాజీ ఎంపీ సురేష్ శెట్కర్ను ప్రకటించింది. కాగా 2009లో కాంగ్రెస్ పార్టీ తరఫున జహీరాబాద్ ఎంపీగా గెలిచారు. 2014లో అదే స్థానం నుంచి ఎంపీగా పోటీ చేసిన సురేష్ శెట్కర్ బీబీ పాటిల్ చేతిలో ఓటమి చవిచూశారు.
Read More: 39 మంది అభ్యర్ధులతో కాంగ్రెస్ తొలి జాబితా.. వయనాడ్ నుంచి రాహుల్ పోటీ..
ఇక ఎస్టీ సీటు అయిన మహబూబాద్ బరిలో మాజీ కేంద్ర మంత్రి బలరాం నాయక్ ఉండనున్నారు. 2009లో మహబూబాబాద్ నుంచి విజయం సాధించిన ఆయన.. 2014, 2019 లోక్ సభ ఎన్నికల్లో ఓటమి చవిచూశారు. మరోసారి అతనికే అధిష్టానం ఆ స్థానాన్ని కేటాయించింది.