తూర్పు ఢిల్లీ ఎంపీగా ఉన్న గౌతం గంభీర్ ఇటీవలే రాజకీయాలకు గుడ్ బై చెప్పాడు. ఆ క్రమంలో అతని ప్లేస్ లో షమీ ఎంటర్ అవుతున్నాడా? అనే అనుమానాలు వినిపిస్తున్నాయి. మరిప్పటికే యువరాజ్ సింగ్ రాజకీయాల్లోకి రావడానికి ఆసక్తిగా ఉన్నాడు కదా, తనని వదిలేసి చక్కగా ఆడుతున్న షమీని ఎందుకు లాగడం అని కొందరు ప్రశ్నిస్తున్నారు.
వచ్చే ఎన్నికల్లో వెస్ట్ బెంగాల్ లోని బసిర్ హత్ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నట్టు చెబుతున్నారు. ఇప్పటికే బీజేపీ అధిష్టానం.. లోక్ సభలో పోటీచేయమని షమీ ని కోరినట్టు వార్తలు వస్తున్నాయి. అక్కడ మైనార్టీలు ఎక్కువగా ఉంటారు. అందుకనే వారిని ఆకర్షించడానికి బీజేపీ ఈ ఎత్తుగడ వేసినట్టు చెబుతున్నారు. ప్రస్తుతం ఇక్కడ త్రణమూల్ కాంగ్రెస్ నుంచి నుసృత్ జహాన్ ఎంపీగా ఉన్నారు.
ఇటీవల దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సందేశ్ ఖాళీ ప్రాంతం ఈ నియోజకవర్గంలోనే ఉంది. ఈ గొడవ ఇలా ఉండగా షమీ ఆపరేషన్ పై నెట్టింట అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఆపరేషన్ కి ఎక్కువ కాలం రెస్ట్ కావల్సి ఉండగా తను ఐపీఎల్ సీజన్ మొత్తానికి దూరమైపోతున్నాడు. ప్రధాని మోదీ కూడా తను త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అంతేకాదు ప్రపంచకప్ లో ఓటమి బారిన పడినప్పుడు మోదీ వెళ్లి ప్రత్యేకంగా షమీని అభినందించారు.
బీజేపీ ప్రచారంలో ఎప్పుడూ సెలబ్రిటీలను వాడుతుంటుంది. 2023 వరల్డ్ కప్ లో మహ్మద్ షమీకి బ్రహ్మాండమైన ఆదరణ వచ్చింది. తనని పార్టీలోకి తీసుకుని ప్రచారంలో తిప్పాలనే ఆలోచనలో బీజేపీ అధిష్టానం ఉందని అంటున్నారు. ఒకవేళ షమీ జాతీయ క్రికెట్ కి ఆడకపోయినా పరోక్షంగా జాతీయ జట్టుకి తన సేవలెంతో ఉపయోగపడతాయి. ఏదేమైనా ఈ విషయంపై షమీ స్పందించాల్సి ఉంది.