Tanguturi Prakasham Pantulu Inspirational Story: అది రాజమండ్రి రైల్వే స్టేషన్లోని ఏసీ వెయింటింగ్ హాల్. సమయం తెల్లవారుజామున 5.30 గంటలు. ఆ సమయంలో ఒక మహిళా అటెండెంట్ హాల్లో ఉన్నవారి టిక్కెట్లు చెక్ చేస్తోంది. అక్కడ ముతక బట్టలు కట్టుకున్న ఓ పెద్దాయన అక్కడి కుర్చీలో గాఢ నిద్రలో ఉండటం గమనించింది. ఆయనను మెల్లిగా తట్టి లేపి టికెట్ చూపించమని అడిగింది. ఆయన ఓసారి కళ్లు తెరచి చూసి ‘లేదమ్మా’ అన్నాడు. టికెట్ లేకుండా ఇక్కడ ఉండటం కుదరదని ఆ అటెండెంట్ కేకలు వేసింది. అయినా ఆ పెద్దాయన కుర్చీలోంచి లేవలేదు. ఆమె మాట్లాడే మాటలకు అలాగే చూస్తుండి పోయాడు.
ఇక లాభం లేదనుకుని, ఆమె హాల్లో నుంచి బయటికి వస్తుండగా, స్టేషన్ మాస్టర్ అటుగా వచ్చాడు. ఆమె ‘ఓ పెద్దాయన టికెట్ లేకుండానే ఏసీ హాల్లో దర్జాగా పడుకొన్నాడు. వెళ్లమంటే వెళ్లటం లేదు’ అని ఫిర్యాదు చేసింది. దీంతో స్టేషన్ మాస్టర్ కోపంగా ‘పద చూద్దాం’ అంటూ ఆమెతో బాటు ఏసీ వెయింటింగ్ హాల్లోకి వచ్చాడు. వచ్చీ రాగానే ఆ ముసలాయన్ని చూసిన స్టేషన్ మాస్టర్ ఒక్క క్షణం షాక్ తిని ‘అయ్యా.. మీరా?’ అంటూ రెండు చేతులూ జోడించి నమస్కరించి, ఆమె వైపు తిరిగి ‘ఈయనెవరో తెలుసా? ఆంధ్ర రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు గారు’ అంటూ మందలింపుగా చెప్పాడు.
Read More: 50 ఏళ్లకే బీసీలకు పింఛన్.. బీసీ డిక్లరేషన్ ప్రకటించిన టీడీపీ,జనసేన..
‘నేను రాజేశ్వరరావు గారి అబ్బాయినండీ. మీ శిష్యుడిని కూడా’ అని పరిచయం చేసుకున్నాడు. వెంటనే పంతులుగారు ‘ ఏరా.. నువ్వా. భోంచేశావా?’ అన్నాడు. పంతులు గారి ప్రశ్న స్టేషన్ మాస్టర్కి అర్థం కాలేదు. ‘టైం ఆరవుతోంది. ఇలా అడిగాడేమిటి’ అనుకున్న స్టేషన్ మాస్టర్ పంతులుగారు నిద్రమత్తులో మాట్లాడుతున్నాడేమో అనుకుని ‘ కాఫీ తాగే వేళలో భోజనమా’ అంటూ నసిగాడు. దానికి పంతులు గారు, కాస్త నిష్ఠూరంగా ‘ ఏరా.. మీ నాన్న నీకు నేర్పించిన సంస్కారం ఇదేనట్రా.. నేను నిన్ను భోజనం చేశావా అని అడిగితే నువ్వు కూడా నన్ను తిన్నావా లేదా అని అడగాలిగా’ అన్నారు.
అప్పుడు స్టేషన్ మాస్టర్కి ఆయన ఆకలిగా ఉన్నాడని అర్థమైంది. వెంటనే ఇంటికి ఫోన్ చేయించి, వంట చేయించి, స్వయంగా భోజనానికి ఇంటికి తీసుకుపోయాడు. పంతులుగారు రాజమండ్రి వచ్చారని తెలిసి గంటలోపే జనం స్టేషన్ మాస్టర్ ఇంటిముందు వందలాదిగా పోగయ్యారు.
భోజనం తర్వాత వచ్చిన జనాల్ని పలకరించి ‘నేను విజయవాడ వెళ్లాలి’ అన్నారు పంతులు గారు. ఆయన స్థితి తెలిసిన అక్కడి కొచ్చిన పెద్దమనుషులంతా తలా ఐదు రూపాయలు పోగేసి బెజవాడకి రైలు టికెట్ కొని మిగిలిన 72 రూపాయలను ఆయన జేబులో పెట్టి రైలు ఎక్కించారు. రైలు కదలబోతోందనగా నలిగిన, మాసిన బట్టలతో ఉన్న ఒక వ్యక్తి ప్లాట్ ఫామ్ మీద పరిగెత్తుకుంటూ.. పంతులు గారి బోగీ కిటీకీ వద్దకు వచ్చి పెద్దగా ఏడుస్తూ ‘ మీరిక్కడ ఉన్నారని తెలిసి వచ్చానయ్యా. నా భార్య కేన్సర్ రోగి. వైద్యంచేయించలేకపోతున్నా’ అని వేడుకున్నాడు. వెంటనే పంతులు గారు తన జేబులోని 72 రూపాయలు తీసి ఆ మనిషి చేతిలో పెట్టి ‘ ఇప్పటికి ఇవే ఉన్నాయిరా.. తీసుకో’ అంటూ అతనికి ఇచ్చేసాడు.
ఇదంతా చూసిన పంతులు గారి శిష్యుడు ‘ ఓ పది రూపాయలన్నా ఉంచుకోకుండా మొత్తం ఇచ్చేస్తే ఎలా గురువుగారూ. ఓ పదైనా ఉంటే బెజవాడలో కనీసం భోజనానికైనా పనికొచ్చేవి కదా. ఒక్క కేసుకు లక్ష రూపాయలు ఫీజు తీసుకున్న మీకు ఇంతటి దుస్థితి వచ్చింది’ అని భోరుమన్నాడు. దానికి పంతులుగారు ఆయన భుజం మీద ఆప్యాయంగా చేయివేసి ‘ఒరే నా గురించి పట్టించుకునేందుకు మీరంతా ఉన్నార్రా.. పాపం వాడికి ఎవరున్నారు చెప్పు’ అంటూ కళ్లవెంట నీళ్లు పెట్టుకున్నారు. మద్రాసులో ఒక కేసుకు లక్ష ఫీజు తీసుకునే లాయరుగా బతికిన ప్రకాశం గారు మరో ఏడాదిలో కన్నుమూస్తారనగా జరిగిన ఈ యదార్థ సంఘటన విలువలే ప్రాణంగా, సమాజాన్నే కుటుంబంగా భావించిన నాటి నాయకుల నిజాయితీకి ఒక మచ్చుతునక.