Ayodhya Ram Mandir Devotees(Telugu news live today) : ఈ ఏడాది జనవరి 22న విగ్రహ ప్రాణప్రతిష్ట జరుపుకున్న రామ్ లల్లా ను దర్శించుకునేందుకు అయోధ్యకు భక్తులు పోటెత్తుతున్నారు. విగ్రహ ప్రాణ ప్రతిష్ట జరిగి రెండు నెలలు పూర్తయినా.. ఇప్పటికీ భక్తుల తాకిడి అదే స్థాయిలో ఉంది. నాటి నుంచి నేటి వరకూ సుమారు 75 లక్షల మంది భక్తులు రామ మందిరాన్ని దర్శించుకున్నట్లు రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ తెలిపింది. అయోధ్య రామమందిరం పూర్తి నిర్మాణం ఈ ఏడాది డిసెంబరు నాటికి పూర్తవుతుందని తెలిపింది. ఆలయ సముదాయ నిర్మాణ పనుల్లో 1500 మంది కార్మికులు నిమగ్నమై ఉన్నారని, త్వరలోనే 3500 మందిని నియమించనున్నామని ట్రస్ట్ సభ్యుడు అనిల్ మిశ్రా తెలిపారు. ఇటీవల జరిగిన ఆలయ నిర్మాణ కమిటీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.
విగ్రహాన్ని ప్రతిష్ఠించిన గర్భగుడి ఉన్న మొదటి అంతస్తు నిర్మాణం గతేడాది డిసెంబరు నెలలోనే పూర్తయింది. ఇప్పుడు ఆలయ ప్రధాన గోపురం, ఇతర గోపు నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. 300 రోజుల్లో ప్రధాన గోపురం నిర్మాణం పూర్తవుతుందని తెలిపారు. ఆలయ సముదాయంలో మొత్తం 5 శిఖరాలు ఉండగా.. 161 అడుగుల ఎత్తుతో ఉండే ప్రధాన శిఖరానికి బంగారు తాపడం చేయిస్తామని అనిల్ మిశ్రా పేర్కొన్నారు.
ఇక ఆలయ ప్రహరీ వెంబడి ఆరుగురు దేవతామూర్తుల ఆలయాలు, వాటి పక్కనే సప్తరిషిల ఆలయాలను నిర్మిస్తామని తెలిపారు. వాల్మీకి, విశ్వామిత్ర, వశిష్ఠ, అగస్త్యమునులతో పాటు నిషిద్ధరాజ్, అహల్య వంటి మహారుషులు, పురాణ పురుషుల ఆలయాలను కూడా నిర్మించనున్నట్లు తెలిపారు.
కాగా.. ప్రస్తుతం ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకూ భక్తులకు రామ్ లల్లా దర్శనాన్ని కల్పిస్తున్నారు. మధ్యాహ్నం 12.30 గంటల నుంచి 1.30 గంటల వరకూ దర్శనం ఆపి, ఆలయాన్ని మూసివేస్తారు. ఉదయం 4 గంటల నుంచి 2 గంటల పేరు రాములవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం భక్తులను దర్శనానికి అనుమతిస్తారు.