ఈ తలపాగాను చీరాల మండలం దేవాంగపురి గ్రామ పంచాయతీ, హస్తినాపు రంలోని చేనేత కుటుంబానికి చెందిన ‘పృథ్వీ’ వంశస్తులు మూడు తరాలుగా అందిస్తున్నారు. ఈ వస్త్రాన్ని ఆలయానికి అందించే సమయంలో దానిని అందించే భక్తులు ఒంటిపై నూలు పోగు లేకుండా ఉండాలన్నది ఆచారం. ప్రస్తుతం పృథ్వీ వెంకటేశ్వర్లు నలభై ఏళ్లుగా మల్లన్న వస్త్రాన్ని నేస్తున్నారు. నియమ, నిష్టలతో వీరు 365 రోజుల పాటు రోజూ ఒక మూర చొప్పున ఈ వస్త్రాన్ని నేస్తారు. తలపాగాను తీసుకొని పృథ్వీ వెంకటేశ్వర్లు కుటుంబం ఊరేగింపుగా వేటపాలెం మండలం పందిళ్ళపల్లిలోని పునుగు రామలింగేశ్వరస్వామి ఆలయంలో నిద్రచేసి.. ప్రత్యేక పూజలు చేసి అక్కడ నుంచి శ్రీశైలం చేరుకుంటారు.
మహాశివరాత్రి పర్వదినం నాటికి శ్రీశైలం చేరిన సదరు కుటుంబానికి దేవస్థానం ఆలయ లాంఛనాలతో స్వాగతం పలికి ఆతిథ్యం ఇస్తుంది. వెంకటేశ్వర్లు శివరాత్రి రోజున చిమ్మచీకట్లో దిగంబరుడై స్వామివారి గర్భాలయ విమాన కలశాలు, ముఖమండప నవనందులను కలుపుతూ పాగాలను అలంకరిస్తారు. ఆ సందర్భంగా ఒంటిపై నూలు పోగు లేకుండా, చిమ్మచీకటిలో పాగా అలంకరణ చేయడం ఇక్కడ విశిష్టత.
Read more: మహాశివరాత్రి.. శివనామస్మరణతో మారుమ్రోగిన ఆలయాలు
శ్రీశైలం వెళ్లి, పది రోజుల పాటు అక్కడే ఉండి లింగోద్భవ సమయంలో రాత్రి 11 గంటల సమయంలో ఒంటిపై నూలుపోగు లేకుండా గర్భగుడి నుంచి నవనందులను కలుపుతూ శిఖరం చుట్టూ ఈ పాగాతో చుడతారు. ఈ భాగ్యం తమకు దక్కడం పూర్వ జన్మ సుకృతమని వెంకటేశ్వర్లు చెబుతారు. లింగోద్భవ కాలంలో ఆనంద స్వరూపుడైన పరమశివుని తేజస్సు విశ్వమంతా వ్యాపిస్తుందని, ఆ సమయంలో ఆలయ శిఖారాన్ని స్వామి శరీరంగా భావించి శివనామాలున్న ధవళ వస్ర్తాన్ని ఆలయ శిఖరం నలుమూలలూ కలిసేలా అలంకరిస్తామని, ఆ తర్వాత ఆలయానికి ఒక కొత్త శోభ చేకూరుతుందని అర్చకులు చెబుతున్నారు.
శివరాత్రి తర్వాత ఆలయ శిఖరం నుంచి విప్పిన ఈ వస్త్రాన్ని ముక్కలుగా చేసి పంచముఖ రుద్రాక్షలతో కలిపి నామమాత్ర ధరకు సామాన్య భక్తులకు విక్రయించే ఏర్పాటు కూడా దేవస్థానం చేసింది. ఈ వస్త్రాన్ని పూజా మందిరంలో ఉంచుకుంటూ తమకు శుభం కలుగుతుందని భక్తుల విశ్వాసం. మహాశివరాత్రి రోజున మల్లన్న స్వామి వారికి నిర్వహించే పాగాలంకరణను చూసినా పరమేశ్వరుడి అనుగ్రహం కలిగి ఆ సంవత్సరం అంతా శుభాలు చేకూరుతాయని భక్తుల నమ్మకం.