CTET Notification 2024 Latest News: సీబీఎస్ఈ దేశవ్యాప్తంగా నిర్వహించే కేంద్రీయ ఉపాధ్యాయ అర్హత పరీక్ష CTET కు నోటిఫికేషన్ విడుదలైంది. 19వ ఎడిషన్ సీటెట్ పరీక్షను ఈ ఏడాది జూలై 7న నిర్వహించనున్నట్లు సీబీఎస్ఈ వెల్లడించింది. 136 నగరాలలో 20 లాంగ్వేజీల్లో నిర్వహించనున్న ఈ పరీక్షకు మార్చి 7వ తేదీ నుంచి ఏప్రిల్ 2 రాత్రి 11.59 గంటల వరకూ ఆన్లైన్ లో దరఖాస్తులు స్వీకరించనున్నారు.
ప్రతి ఏటా రెండుసార్లు సీటెట్ పరీక్షను నిర్వహిస్తారు. 19వ ఎడిషన్ సీటెట్ కు రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యాయి. జనరల్, ఓబీసీ అభ్యర్థులు పేపర్ కు రూ.1000, 2 పేపర్లకు రూ.1200 దరఖాస్తు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులైతే పేపర్ కు రూ.500, 2 పేపర్లకు రూ.600 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది.
సీటెట్ పరీక్షలో అభ్యర్థులు సాధించిన స్కోరును.. కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న పాఠశాలల ఉపాధ్యాయ నియామకాల్లో పరిగణలోకి తీసుకుంటారు. ఇక్కడ సాధించిన స్కోర్ కు లైఫ్ టైమ్ వ్యాలిడిటీ ఉంటుంది. రెండు పేపర్లుగా నిర్వహించే పరీక్షలో.. మొదటి పేపర్ 1-5 తరగతులకు, రెండో పేపర్ 6-9 తరగతులకు పాఠాలు చెప్పాలనుకునేవారు రాయవచ్చు.
పేపర్ -2 పరీక్ష ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ, పేపర్ -1 పరీక్ష మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకూ జరుగుతుంది. తెలుగు రాష్ట్రాల్లో గుంటూరు, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్, వరంగల్ నగరాల్లో సీటెట్ పరీక్షను నిర్వహిస్తారు. అభ్యర్థులు మరింత సమాచారానికై https://cdnbbsr.s3waas.gov.in/s3443dec3062d0286986e21dc0631734c9/uploads/2024/03/2024030749.pdf ఈ లింక్ ను క్లిక్ చేయండి.