Maha shivaratri special story: సకల లోకాలకు గురువు, శోకాలను తొలగించి శుభాలను అందించే అమృతమూర్తి, ఈ చరాచర జగత్తును తనయందు లీనం చేసుకునే శక్తిమయుడు, ‘శివా’ అని పిలిస్తే చాలు.. ప్రత్యక్షమై వరాలిచ్చే అపార కరుణా స్వరూపుడు… పరమశివుడు. ఆ మహాదేవుడు లింగాకృతిలో ఈ భూమ్మీద అవతరించిన రోజే మహాశివరాత్రి. శివ అంటే శంకరుడు అని, రాత్రి అంటే పార్వతి అని అర్థం. శివ, శక్తి స్వరూపాలు ఏకకాలంలో, ఏకరూపంలో దర్శనమిచ్చే ఈ దివ్యమైన రోజే మహాశివరాత్రి. ఈ రోజున స్వామిని అర్చించే భక్తులకు కైలాసప్రాప్తి కలుగుతుందని పురాణాలు చెబుతున్నాయి.
మహాదేవుడిని రోజూ పూజించటాన్ని నిత్య శివరాత్రిగా, ప్రతి పక్షంలో చతుర్దశి రోజు రాత్రి పూజించటాన్ని పక్షశివరాత్రిగా చెబుతారు. ఈశ్వరుడికి అత్యంత ప్రియమైన తిథి చతుర్దశి. అయితే కృష్ణపక్షంలోని చతుర్దశి (అమావాస్యకు ముందు వచ్చేది) మరింత ఇష్టమైనది. దీనినే మనం ‘మాసశివరాత్రి’ అంటున్నాము. సంవత్సరంలో 12 మాస శివరాత్రులు ఉండగా, వాటిలో మాఘ మాసంలోని వచ్చే కృష్ట పక్ష చతుర్దశికి మహా శివరాత్రి అని పేరు.
read more: మహాశివరాత్రి .. ఈ మంత్రాన్ని పఠిస్తే వ్యాధులు నయం..!
శివపురాణం ప్రకారం.. బ్రహ్మ, విష్ణువుల మధ్య ఎవరు గొప్ప అనే ప్రశ్న ఉదయించింది. దీంతో పరమేశ్వరుడు తేజోమూర్తిగా వారి మధ్య లింగరూపంలో ఉద్భవించి తన ఆది, అంతము ఎక్కడో కనుక్కోమన్నాడు. వారు ఎంత ప్రయత్నించినా ఆ శివలింగం యొక్క మొదలు, చివర కనిపెట్టలేక పరమశివుని శరణువేడగా, ఆయన బ్రహ్మ, విష్ణువులకు జ్ఞానోపదేశం చేశాడు. ఆ రోజే మహాశివరాత్రి. అందుకే మాఘ బహుళ చతుర్దశి అర్థరాత్రి లింగోద్భవ కాలంలో శివాభిషేకం, శివార్చన చేయటం సంప్రదాయం.
ఈ పండుగ రోజు చేయాల్సిన మూడు ప్రధాన విధులు.. అభిషేకం, ఉపవాసం, జాగరణ. ఈ రోజున ఎవరైనా చెంబుడు నీళ్లు శివలింగం మీద పోసి, చిటికెడు విభూదిని వేసి, ఒక్క మారేడు దళం అర్పిస్తే సకల దేవతలనూ ప్రార్థించిన ఫలితం లభిస్తుంది. అలాగే, శివరాత్రి ముందురోజు ఒంటిపూట భోజనంచేసి, మర్నాడంతా ఉపవాసముండి, రాత్రి స్వామి అభిషేకంలో పాల్గొంటారు. ఈరోజు రాత్రి మొదటి జాములో పాలు, పుష్పాలతో అభిషేకం చేసి పులగాన్ని నివేదిస్తారు. రెండవ జాములో పెరుగుతో అభిషేకం, పాయస నివేదన, మూడవ జామున నెయ్యితో అభిషేకం, మారేడు దళాల్చన నువ్వులపొడి నివేదన, నాల్గవ జామున తేనెతో అభిషేకం, నల్లకలువలతో అర్చన, అన్న నివేదన చేస్తారు.
ఈ మహాశివరాత్రి రోజునే క్షీరసాగర మథనంలో పుట్టిన విషాన్ని మహాదేవుడు స్వీకరించి, స్పృహ కోల్పోయాడనీ, ఆ సమయంలో ఆయన తలను ఒడిలో పెట్టుకుని పార్వతీ దేవి విలపిస్తుండగా, దేవదానవులు ఆయనకు తిరిగి స్పృహలోకి వచ్చేంతవరకు జాగరణ చేశారనీ, నాటి నుంచి ఈ రాత్రి జాగరణ చేయటం ఆచారంగా మారిందని పురాణాలు చెబుతున్నాయి. యోగ సాధకులకు అత్యంత ప్రభావశీలమైన ఫలితాలను అందించే రాత్రిగా దీనికి పేరుంది. ఏ యోగ సాధనా చేయని వారు కూడా ఈ రాత్రి వెన్నుముకను భూమికి నిటారుగా ఉంచటం వల్ల వారిలో అనంతమైన శక్తి ఉప్పొంగుతుంది. అందుకే ఈ రాత్రి నిద్రించరాదని చెబుతారు. ఈ విధంగా ఈ రోజు చేసే ఉపవాస, జాగరణల వల్ల అహంకారం తొలగి నిగ్రహశక్తి పెరుగుతుందని చెబుతారు.
సకల లోకాలను నడిపించే అమృతమయుడైన ఆ ముక్కంటి ఆవిర్భవించిన ఈ మహాశివరాత్రి పుణ్యదినాన చేతనైన మేర శివారాధన చేసి సకల శుభాలను పొందుదాం. ఆ కరుణా సముద్రుడి కృపకు పాత్రులమవుదాం.