BRS party Latest News: తెలంగాణలో మాజీ సీఎం కేసీఆర్ ప్రాభవం తగ్గిపోతోంది. ఇన్నాళ్లూ కనుసైగతోనే గులాబీ దళాన్ని శాసించిన ఆయన.. ఇప్పుడు వెళ్లొద్దు మొర్రో అని అంటున్నా నేతలు ఉండడం లేదు. ఒకరి తర్వాత ఒకరు జంప్ అయిపోతున్నారు. ఏదో ఒక కారణం వెతుక్కొని మరీ పార్టీకి గుడ్ బై చెప్తున్నారు. సారు వద్దు.. కారు వద్దు అంటూ దిగిపోతున్నారు. పార్లమెంట్ ఎన్నికల వేళ ఈ వలసలు కేసీఆర్కు పెద్ద తలనొప్పిగా తయారయ్యాయి. అసలే, అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన బాధ ఇంకా వదలడం లేదు. పార్లమెంట్ ఎన్నికల్లోన్నైనా సత్తా చాటి పరువు నిలుపుకోవాలని చూస్తుంటే.. ఉన్న లీడర్లు జంప్ అవుతుండడం భవిష్యత్తు ఆశలపై నీళ్లు జల్లినట్టు అవుతోంది.
బీఎస్పీతో పొత్తు చిచ్చు
పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా తెలంగాణ రాజకీయాల్లో పెద్ద ట్విస్ట్ ఏదన్నా ఉందంటే అది బీఆర్ఎస్, బీఎస్పీ కలవడమే. ఇన్నాళ్లూ ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకున్న నేతలు ఇప్పుడు సడెన్గా అలయ్ బలయ్ చెప్పుకున్నారు. కానీ, ఈ పొత్తు బీఆర్ఎస్లో చిచ్చుకు కారణమైంది. మరిన్ని వలసలకు దారి తీసింది. లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్, బీఎస్పీ కలిసి పోటీ చేస్తున్నాయని కేసీఆర్, ఆర్ఎస్పీ ప్రకటించారు. ఈ ప్రకటన వచ్చిన మరుసటి రోజే ఉమ్మడి ఆదిలాబాద్ బీఆర్ఎస్లో చిచ్చు రాజుకుంది. గత ఎన్నికల్లో సిర్పూర్లో కోనప్పపై ఆర్ఎస్ ప్రవీణ్ పోటీ చేశారు.
Read More: గ్రూప్ 1, 2,3 పరీక్షల షెడ్యూల్ విడుదల..
దీంతో ఓట్లు చీలడం వల్లే ఓడిపోయానని కోనప్ప భావిస్తున్నారు. పైగా, బీఎస్పీతో పొత్తు విషయంలో తనతో ఓ మాటైనా చెప్పకుండా నిర్ణయం తీసుకోవడంపై ఆయన అలిగారు. ఇదే క్రమంలో సీఎం రేవంత్ రెడ్డిని కూడా కలిశారు. దీంతో పార్టీ మార్పు కన్ఫామ్ అయిపోయింది. ఇటు, మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి సైతం బీఆర్ఎస్ను వీడేందుకు సిద్ధమైనట్టు ప్రచారం జరుగుతోంది. వీరిద్దరూ ఇప్పటికే కాంగ్రెస్ పెద్దలతో టచ్లోకి వెళ్లినట్టు సమాచారం. ఇదే నిజమైతే అసెంబ్లీలో ఘోర పరాజయం పాలైన బీఆర్ఎస్కు పార్లమెంట్ ఎన్నికల్లో చేదు అనుభవం తప్పదని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
గ్రేటర్లోనూ మొదలైందా..?
మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో గ్రేటర్ పరిధిలో అత్యధిక సీట్లు గెలుచుకుని సత్తా చాటింది బీఆర్ఎస్. నిజానికి, ఇక్కడ గెలవకపోయి ఉంటే ప్రతిపక్ష హోదా కూడా దక్కేది కాదు. అయితే, లోక్ సభ ఎన్నికల్లో ఈ పరిస్థితి కనిపించడం లేదనే టాక్ వినిపిస్తోంది. ఎల్ఆర్ఎస్ విషయంలో ఎంతో ఆర్భాటంగా ధర్నాకు పిలుపునిచ్చింది బీఆర్ఎస్. కానీ, ఈ ధర్నాకు పిలుపునిచ్చిన కేటీఆర్ కూడా కార్యక్రమానికి హాజరుకాలేదు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 18 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉండగా కేవలం నలుగురు మాత్రమే నిరసనల్లో పాల్గొన్నారు. ధర్నాలు కూడా చప్పగా సాగడంతో పార్టీ శ్రేణులు షాకయ్యాయి. దీంతో ఆయా ఎమ్మెల్యేల తీరుపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పార్టీలో ఉంటారా? జంప్ అవుతారా? అనే చర్చ జరుగుతోంది.
పోటీకి అభ్యర్థుల కరువు
లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్కు అభ్యర్థులే దొరకడం లేదనే ప్రచారం ఉంది. ఎంపీగా పోటీ చేస్తే కనీసం వంద కోట్లు ఖర్చు చేయాల్సిందే. కాంగ్రెస్, బీజేపీ దూకుడు మీద ఉండటంతో ఓడిపోయి వంద కోట్లు పోగొట్టుకోవడం కంటే సైడ్ అయిపోవడం బెటర్ అని చాలామంది గులాబీ లీడర్లు భావిస్తున్నారట. ఇప్పటికే ముగ్గురు సిట్టింగ్ ఎంపీలు వేరే పార్టీలోకి వెళ్లిపోయారు. చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి పోటీకి సుముఖతగా ఉన్నారు. దక్షిణ తెలంగాణ ఖమ్మం, నల్గొండ, భువనగిరి సీట్లలో కాంగ్రెస్ హవా గ్యారెంటీ. అక్కడ బీఆర్ఎస్ సోదిలో కూడా లేదు.
ఖమ్మం జిల్లాలో ఉన్న ఒక్కగానొక్క ఎమ్మెల్యే కూడా కాంగ్రెస్ బాట పట్టారు. సిటీ సహా ఉత్తర తెలంగాణలో బీజేపీ దూకుడు మీదుంది. మహబూబ్ నగర్ సీటు, వరంగల్, మహబూబాబాద్లోనూ బీఆర్ఎస్ ఇబ్బందికర పరిస్థితిలో ఉంది. తలసాని కుమారుడు సాయి ఈసారి సికింద్రాబాద్లో నిలబడ్డా గెలిచే అవకాశాలు కనిపించడం లేదంటున్నారు. మొత్తంగా బీఆర్ఎస్ కిస్సా ఖలాస్ అనే చర్చ జోరుగా సాగుతోంది.