azharuddin hyderabad mp ring congress(Political news in telangana): రానున్న లోక్సభ ఎన్నికల వేళ, హైదరాబాద్ సీటు కేంద్రంగా మారుతున్న రాజకీయ సమీకరణాలు మజ్లిస్ పార్టీకి చుక్కలు చూపిస్తున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్, బీజేపీల దూకుడుతో మజ్లిస్ కంచుకోటగా ఉన్న హైదరాబాద్ ఎంపీ సీటులో పరిస్థితులు వేగంగా మారుతున్నాయి. దీంతో ఈసారి అక్కడ ఊహించని ఫలితాలు రాబోతున్నాయనే విశ్లేషణలు వెల్లువెత్తుతున్నాయి.
హైదరాబాద్ పార్లమెంటు సీటు పరిధిలో మలక్పేట్, కార్వాన్, గోషామహల్, చార్మినార్, చాంద్రాయణగుట్ట, యాకుత్పురా, బహదూర్పురా అసెంబ్లీ నియోజక వర్గాలున్నా
యి. 1984 నుంచి 1999 వరకు ఇక్కడ ఎంఐఎం నాటి అధినేత సలావుద్దీన్ ఒవైసీ గెలవగా, నాటి నుంచి నేటి వరకు అసదుద్దీన్ విజయం సాధిస్తూ వచ్చారు. కానీ, ఈ 40 ఏళ్లలో ఎంఐఎం రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీతో అనధికార పొత్తు కుదుర్చుకోవటం వల్లనే ఈ విజయాలన్నీ సాధ్యమయ్యాయని అందరికీ తెలిసిన విషయమే. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సీట్ల జోలికి తాను రాననీ, అందుకు బదులుగా పాతబస్తీని తమకు వదిలేయాలనే షరతు మీద ఆ పార్టీ ఇన్నాళ్లూ అక్కడ తిరుగులేని హవాను కొనసాగించింది.
Read more: మేడారం హుండీ లెక్కింపు పూర్తి.. ఆదాయం ఎంత వచ్చిందంటే..
ఈ ఎంపీ స్థానం పరిధిలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో, గత శాసన సభఎన్నికల్లో గోషామహల్ స్థానాన్ని బీజేపీ గెలుచుకోగా, యాకుత్పురాలో ఎంబీటీ కేవలం 878 ఓట్ల తేడాతో ఓడిపోయింది. ఇక మలక్ పేట స్థానంలో కాంగ్రెస్కు చెప్పుకోదగ్గ ఓట్లు వచ్చాయి. ఆ పొరుగునే ఉన్న నాంపల్లి సీటును కాంగ్రెస్ కేవలం 2037 ఓట్లతో చేజార్చుకుంది. గత అసెంబ్లీ ఎన్నికల వేళ అధికారంలో ఉన్న బీఆర్ఎస్ వీటిలో ప్రతిచోటా తన అభ్యర్థిని నిలిపి విపక్ష ఓట్లను చీల్చినా, హైదరాబాద్ ఎంపీసీటు పరిధిలోని ఏడు స్థానాల్లో కేవలం అయిదింటిలోనే ఎంఐఎం హవా కనిపించింది.
గత ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రావటం, పాత బస్తీలో ఉన్న బీఆర్ఎస్ నేతలంతా కాంగ్రెస్ కండువా కప్పుకోవటం మొదలు కావటంతో ఇప్పుడు ఒవైసీ వచ్చే ఎంపీ ఎన్నికల్లో గెలుపుకోసం కొత్త దారులు వెతకాల్సి వస్తోంది. ఎన్నికల ఫలితాలు వచ్చిన వారానికే ఎన్నడూ లేని విధంగా, అసదుద్దీన్ ఒవైసీ తన నియోజక వర్గంలో వరుసగా అభివృద్ధి పనులను ప్రారంభించటం, పనుల పురోగతిని సమీక్షించడానికి తనిఖీలకు దిగారు. ఈ క్రమంలోనే మార్చి 2న జరిగిన పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని గతంలో కంటే బాగా జరిపే ప్రయత్నం చేయటం, పాతబస్తీ నలుమూలల నుంచి ర్యాలీలు తలపెట్టి పెద్దసంఖ్యలో కార్యకర్తలు పార్టీ కేంద్ర కార్యాలయానికి తరలివచ్చేలా కార్యక్రమాలు రూపొందించారు.
మరోవైపు కాంగ్రెస్ పార్టీ పాతబస్తీలోని ఇతర పార్టీల్లోని కార్యకర్తలను చేర్చుకోవటంలో బిజీగా ఉంది. ఇప్పటికే బీఆర్ఎస్ నేతలంతా కాంగ్రెస్ పంచన చేరగా, బీజేపీలోని అసంతృప్తులు కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. అదే సమయంలో ఎంబీటీతో పొత్తుకు కాంగ్రెస్ సిద్ధపడుతోంది. ఇక్కడ ఒవైసీని ఓడించగలిగితే పాతబస్తీకి బయటి ముస్లిం మైనారిటీలంతా తనవైపు మళ్లే అవకాశం ఉందనేది కాంగ్రెస్ అంచనా. ఫిరోజ్ ఖాన్, అజారుద్దీన్ వంటి నేతల ప్రచారంతో మైనారిటీల మనసు గెలిచేందుకు ఆ పార్టీ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోంది. పాతబస్తీలో అనాదిగా ఎంఐఎం నేతలుగా ఉన్న వారి పిల్లలు, విద్యాధికులు ఇప్పుడు కాంగ్రెస్ వైపు చూడటం ఆ పార్టీకి ఊరట కలిగించే విషయం.
ఇక, ఆది నుంచి ఈ సీటులో ఎంఐఎంకు ప్రధాన ప్రత్యర్థిగా ఉన్న కమలనాథులు ఈసారి మాధవీలత అనే కొత్త ముఖాన్ని తెరమీదికి తెచ్చారు. సేవ, ఆధ్యాత్మిక కార్యక్రమాలతో హిందీలో మాట్లాడుతూ, స్థానికులతో మమేకమవుతూ హిందూ ఓట్లను ఒక్కటి చేయగలిగితే తమ గెలుపు సాధ్యమేనని బీజేపీ నమ్ముతోంది. దీనికి తోడు కాంగ్రెస్- ఎంబీటీల కారణంగా మైనారిటీ ఓట్లు భారీగా చీలతాయని, అది తమకు లాభిస్తుందని బీజేపీ లెక్కలు వేసుకుంటోంది. పైగా, హైదరాబాద్ ఎంపీ ఎన్నికలో స్థానిక అంశాలేవీ చర్చకు రావని, ఇక్కడ కేవలం ముస్లింల ప్రతినిధిగా ఒవైసీ, హిందువుల తరపున బీజేపీ పార్టీ గుర్తు, మోదీ మాత్రమే నిలుస్తారని, అదే జరిగితే పాతబస్తీలోని 8 లక్షల ఓట్లలో మెజారిటీ తనకే వస్తుందని వారి అంచనా.
Read more: 14 ఎంపీ సీట్లు గెలవాలి.. పాలమూరు సభలో సీఎం రేవంత్ రెడ్డి పిలుపు..
ఇక అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిన బీఆర్ఎస్ ఎంఐఎంతో తన దోస్తీని కొనసాగించేందుకు సిద్ధంగా ఉన్నప్పటికీ, గతంలో మాదిరి స్పందన ఎంఐఎం నుంచి కనిపించటం లేదు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ కొత్త అసెంబ్లీలో ప్రొటెం స్పీకరుగా అక్బరుద్దీన్ ఒవైసీకి అవకాశం కల్పించటం, సీఎం రేవంత్ రెడ్డి అక్బరుద్దీన్తో కలిసి మూసీ తీర ప్రాంతం అభివృద్ధిపై చర్చించటం, హైదరాబాద్ నగర అభివృద్ధిపై జరిగిన సమీక్షలో అక్బరుద్దీన్ మాటకు సీఎం ఇచ్చిన ప్రాధాన్యం కూడా బీఆర్ఎస్కు గుబులు పుట్టిస్తున్నాయి.
గత పదేళ్లుగా బీఆర్ఎస్ అండ చూసుకుని ఎంఐఎం పార్టీ స్థానికంగా ఉన్న మరో ముస్లిం పార్టీ అయిన ఎంబీటీ కార్యకలాపాలను పూర్తిగా అణచివేసింది. ఆ పార్టీ నేతల వ్యాపారాలను, ఆస్తుల మీద దాడికి దిగుతూ వారిని భయభ్రాంతులకు గురిచేస్తూ ఎన్నికల్లో వారు నిలబడకుండా చేయటంలో విజయవంతమైంది. అయితే, అంతటి అణచివేతనూ అధిగమించి, మొన్నటి ఎన్నికల్లో ఆ పార్టీ యాకుత్పురాలో సత్తాచాటగలిగింది. మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ గనుక స్నేహ హస్తం అందిస్తే పాతబస్తీ రాజకీయాల మీద ఎంబీటీ, కాంగ్రెస్లు పైచేయి సాధిస్తాయనీ, అది తమ రాజకీయ భవిష్యత్తుకు చరమగీతం పాడుతుందని ఎంఐఎం కంగారు పడుతోంది. అందుకే ఆ పార్టీ బీఆర్ఎస్కు కాస్త దూరం జరిగి, కాంగ్రెస్తో సత్సంబంధాలు కొనసాగిస్తూ, ఈ ఎంపీ ఎన్నికల పరీక్షలో గెలవాలనే ప్రయత్నంలో ఉందనే వార్తలూ వినిపిస్తున్నాయి.