Water Crisis in Bengaluru: వేసవి ఆరంభంలోనే బెంగళూరు తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కొంటోంది. నగరంలోని పలు ప్రాంతాల్లో బోరుబావులు ఎండిపోయాయి. ప్రజలు తమ రోజువారీ అవసరాలకు నీటి ట్యాంకర్లపై ఆధారపడుతున్నారు. ఎక్కడ చూసినా ప్రజలు.. బిందెలు, బక్కెట్లు చేతపట్టుకుని నీటి కోసం క్యూలైన్లలో కనిపిస్తున్నారు.
బెంగళూరులోని RR నగర్లో మాత్రమే RO ప్లాంట్ పనిచేస్తోంది. ఇక్కడ 20 లీటర్ల నీటికి రూ.5 వసూలు చేస్తున్నారు. దీంతో స్నానం చేయడానికి కూడా జనం జంకుతున్నారు. RO ప్లాంట్ ఉదయం 7 గంటలకు తెరిస్తే.. 9 గంటల వరకు నిర్విరామంగా నీటి సరఫరా కొనసాగుతుంది. ఆ తర్వాత నీటి సరఫరా నిలిచిపోతుంది. 9 గంటల తర్వాత నీటి సరఫరా ఉండదు. మళ్లీ సాయంత్రం వరకూ ఉండాల్సిందే. ఎందుకంటే ఆర్ఓ ప్లాంట్ మళ్లీ తెరిచేది సాయంత్రం 5 గంటలకే. ఇది.. కూల్ సిటీ బెంగళూరులో ఉన్న ప్రస్తుత పరిస్థితి.
ఆర్ ఆర్ నగర్ లో నీటి సమస్య బాగా పెరిగిందని స్థానికుడైన చిక్కల్లప్ప తెలిపారు. తమతో మాట్లాడే నాథుడే లేడని, ఒకటి కంటే ఎక్కువ పాత్రలతో ఆర్ఓ ప్లాంట్కు వెళితే అధికారులు వెనక్కి పంపుతున్నారని వాపోయారు. పిల్లలతో కలిసి నీళ్లు తెచ్చేందుకు వెళ్తే.. ఆ చిన్నారి ఎవరని అధికారులు అడుగుతున్నారని తెలిపారు.
Also Read: రామేశ్వరం కేఫ్ నిందితుడి ఆచూకీ కోసం ఎన్ఐఏ భారీ నజరానా
మా బిడ్డ అని చెబితే వెనక్కి పంపేస్తారు. తన కుటుంబంలో 6 మంది ఉంటే.. వారందరికీ సరిపడా నీరు దొరకడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇందుకు ఎక్కడెక్కడి నుంచో ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు తన వయసు 71 సంవత్సరాలని, ఇంటి అవసరాలకై నీళ్ల కోసం లైన్లో నిలబడాల్సి వస్తోందని, పిల్లలు బడికి వెళ్లేలోపు నీళ్లు తెచ్చుకోవాలని చెప్పారు.
ఆర్ఆర్ నగర్లోని పట్టంగెరెకు చెందిన మరో నివాసి మాట్లాడుతూ.. “మాకు స్నానం చేయడానికి, మా ఆవులకు తాగడానికి నీరు లేదు. మాకు 5 మందికి ఒక పాత్ర నీరు ఉంది. ఇది సరిపోదు. కార్పొరేషన్ నీటిని వంటకు వినియోగిస్తున్నామని, ఆ నీటిని ఫిల్టర్ చేసి తాగుతామని, మరో వ్యక్తి చెప్పారు. గంటల తరబడి క్యూ లో నిలబడితే.. ఒక రోజుకి ఒక క్యాన్ మాత్రమే లభిస్తుందని.. 20 లీటర్ల నీరు ఇంటి అవసరాలకు ఏమాత్రం సరిపోవడం లేదని వాపోతున్నారు.
పోని ట్యాంకర్లను తెప్పించుకుందామంటే.. రూ.600 నుంచి రూ.1000 వరకూ ఉండే ప్రైవేట్ ట్యాంకర్ ధర ఇప్పుడు అమాంతం రూ.2000కు పెరిగిపోయిందన్నారు. ప్రయివేటు ట్యాంకర్లను ధరలు తగ్గించాలని ప్రభుత్వం కోరడంతో వారు తమ ప్రాంతానికి రావడం మానేశారని ఆర్ఆర్ నగర్ వాసులు వాపోతున్నారు. నీటి సమస్యపై ప్రభుత్వానికి ప్రతిరోజూ ఈ మెయిల్స్ పంపినా ఫలితం లేదన్నారు.
Also Read: సూసైడ్ అంటూ ‘హనుమాన్ జంక్షన్’ నటి వీడియో.. అతడే నా చావుకి కారణం!
చూడబోతే.. వేసవి తీవ్రత పెరిగేకొద్దీ నీటి కరువు పెరిగే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. బెంగళూరులోనే కాదు. తెలంగాణ లోనూ ఇదే పరిస్థితి రావొచ్చన్న ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రంలోని అన్ని రిజర్వాయర్లలో నీటి మట్టాలు తగ్గుతున్నాయని, ప్రజలు నీటిని జాగ్రత్తగా వాడుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. బుధవారం రైతు నేస్తం కార్యక్రమాన్ని ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు పరిస్థితిని అర్థం చేసుకొని సమస్యను సమిష్టిగా ఎదుర్కొని అధిగమించేందుకు ప్రభుత్వానికి సహకరించాలని ఆయన కోరారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి నీటిని తీసుకురావాలని, హైదరాబాద్ నగరంలో వాటర్ ట్యాంకర్లను సిద్ధంగా ఉంచుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు.
హైదరాబాద్లో తాగునీటి అవసరాల కోసం ప్రస్తుతం ఉన్న 550 ఎంజీడీలకు అదనంగా రోజుకు 50 మిలియన్ గ్యాలన్ల (ఎంజీడీ) నీటి సరఫరా అవసరమవుతుందని అధికారులు తెలిపారు. హైదరాబాద్ నీటి వనరులలో కృష్ణా, గోదావరి, మంజీర, జంట జలాశయాలు ఉస్మాన్సాగర్ & హిమాయత్సాగర్ ఉన్నాయి. కానీ.. నీటి మట్టాలు తగ్గితే తెలంగాణ నీటి సంక్షోభాన్ని ఎదుర్కోక తప్పని పరిస్థితులు వస్తాయి. కాబట్టి ఈ రోజు నుంచే నీటిని మితంగా వాడుకోవడం అలవాటు చేసుకోండి.