7 Killed in Nepal Bus Accident : నేపాల్ బాగ్మతి ప్రావిన్స్ లో జరిగిన బస్సు ప్రమాదంలో ఒక మహిళ సహా ఏడుగురు మరణించగా.. మరో 30 మంది గాయపడ్డారు. ఘట్ బేసి నుంచి నేపాల్ రాజధాని ఖాట్మండుకు వెళ్తున్న ప్యాసింజర్ బస్సుపై డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో.. బస్సు త్రిశూలి నదిలో పడిపోయింది. ధాడింగ్ జిల్లా పోలీస్ కార్యాలయానికి చెందిన సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్పీ) గౌతమ్ కెసి తెలిపిన వివరాల ప్రకారం.. ప్రమాదంలో మహిళ సహా కనీసం ఏడుగురు మరణించారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వగా.. హుటాహుటిన పోలీసులు, నేపాల్ సైన్యం, సాయుధ పోలీస్ దళం ప్రమాద స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
గాయపడిన వారిని రెస్క్యూ చేసి.. స్థానిక ఆరోగ్య కేంద్రానికి తరలించి చికిత్స చేశారు. అనంతరం ఖాట్మండుకు తరలించినట్లు ఎస్పీ గౌతమ్ తెలిపారు. మృతుల వివరాలు ఇంకా తెలియాల్సి ఉందన్నారు. ప్రమాదానికి కారణమైన బస్సు డ్రైవర్ ను అరెస్ట్ చేశారు. బస్సులో నదిలో పడి ప్రయాణికులకు తీవ్రగాయాలు కావడంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈ ప్రమాదంపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.