PM Modi: ప్రధాని మోదీతో జనసేనాని పవన్ కల్యాణ్ భేటీ అయ్యారు. వాళ్లిద్దరూ ఏం మాట్లాడుకున్నారో బయటకు రాకున్నా.. ఎవరికి తోచింది వారు చెబుతున్నారు. అయితే, తన విశాఖ పర్యటనలో పవన్ కు ప్రధాని హైప్రయారిటీ ఇచ్చినట్టు కనిపిస్తోంది. షెడ్యూల్ ప్రకారం కాకుండా.. బీజేపీ కోర్ కమిటీ మీటింగ్ కంటే ముందే జనసేనానితో మోదీ సమావేశం కావడం ఆసక్తికరం. అదికూడా వాళ్లిద్దరే రహస్య సమావేశం జరపడం రాజకీయంగా కీలక పరిణామం. 10 నిమిషాలే భేటీ ఉంటుందని ముందుగా ప్రకటించినా.. మోదీ, పవన్ ల మీటింగ్ అరగంటకుపైగా కొనసాగడం విశేషం. అంటే, రాష్ట్ర బీజేపీ నేతలకంటే కూడా పవన్ కల్యాణ్ కే మోదీ అధిక ప్రాధాన్యం ఇచ్చారని అంటున్నారు.
బీజేపీ-జనసేన పొత్తు, రోడ్ మ్యాప్ గురించి మోదీ దగ్గర పవన్ ప్రస్తావించారని చెబుతున్నారు. ఏపీలో వైసీపీ ప్రభుత్వ ఆగడాలు, అక్రమాలు, కేసులు, విశాఖ, ఇప్పటం ఘటనలను మోదీకి వివరించినట్టు తెలుస్తోంది. రాష్ట్ర బీజేపీ నేతల తీరుపైనా ఫిర్యాదు చేశారని అంటున్నారు. వైసీపీతో బీజేపీ సంబంధాలపైనా చర్చ జరిగినట్టు.. టీడీపీతో పొత్తు విషయంలో ఓ నిర్ణయం తీసుకునే అంశంపై మోదీ, పవన్ లు సమగ్రంగా చర్చించినట్టు సమాచారం.
అంతకుముందు, మధురైలో వర్షం కారణంగా నిర్ణీత సమయంకంటే గంట ఆలస్యంగా విశాఖకు వచ్చారు పీఎం మోదీ. విమానాశ్రమంలో గవర్నర్ బిశ్వకుమార్, సీఎం జగన్ లు మోదీకి స్వాగతం పలికారు. ఆ తర్వాత బీజేపీ శ్రేణులు భారీ ర్యాలీతో మోదీకి వెల్ కమ్ చెప్పాయి. మారుతి సెంటర్ నుంచి రోడ్ షో చేపట్టారు మోదీ. కారులోంచే చేతులు ఊపుతూ.. రోడ్డు పక్కన నిరీక్షిస్తున్న ప్రజలకు అభివాదం చేస్తూ.. ఐఎన్ఎస్ చోళ గెస్ట్ హౌజ్ కు చేరుకున్నారు. చోళకు చేరుకోగానే పవన్ కల్యాణ్ తో వన్ టు వన్ సమావేశమయ్యారు. వారిద్ధరి సుదీర్ఘ రహస్య భేటీ.. ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.