NDSA Committee Visit to Telangana on Kaleshwaram Project Review: కాళేశ్వరం ప్రాజెక్టులో నిర్మించిన మూడు బ్యారేజీలను పరిశీలించడానికి, వాటిలో తలెత్తిన సమస్యలకు కారణాలను తేల్చడానికి నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ(NDSA) నియమించిన నిపుణుల కమిటీ నేటి నుంచి నాలుగు రోజులపాటు పర్యటించనుంది. చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలోని కమిటీ దీనిపై అధ్యయనం చేసి రిపోర్టు ఇవ్వనుంది. మేడిగడ్డ ప్రాజెక్టు కుంగడంతోపాటు.. పియర్స్ దెబ్బతిన్న విషయంపైనా అధ్యయనం చేయనున్నారు. అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను పరిశీలించి.. నీటిపారుదలశాఖ అధికారులు, నిర్మాణంలో పాలుపంచుకొన్న వివిధ సంస్థలతో సమావేశమై ఈ బృందం చర్చించనుంది. మూడు బ్యారేజీలకు సంబంధించి 19 రకాల సమాచారం సిద్ధం చేసి ఇవ్వాలని నిపుణుల కమిటీ కన్వీనర్ తెలంగాణ నీటిపారుదలశాఖ కార్యదర్శికి రాసిన లేఖలో కోరారు.
బ్యారేజీల లేఔట్ ప్లానింగ్, పీజోమీటర్, టోపోగ్రఫిక్ సర్వే, నిర్మాణ స్థలానికి సంబంధించి ప్రత్యామ్నాయ అధ్యయన నివేదికలు, పునాదులకు సంబంధించి జియలాజికల్, జియోటెక్నికల్ వివరాలు, డ్రాయింగ్లు, ఇప్పటి వరకు గుర్తించిన సమస్యలు, వర్షాకాలం ముందు, తర్వాత చేసిన తనిఖీల నివేదికలను కమిటీ పరిశీలించనుంది. థర్డ్ పార్టీ క్వాలిటీ కంట్రోల్, పర్యవేక్షణ నివేదికలు, మోడల్ స్డడీస్ నివేదికలు, డిఫెక్ట్ లయబిలిటీ పీరియడ్కు సంబంధించి కాంట్రాక్టు ఒప్పందంలో ఉన్న వివిధ క్లాజులు, బ్లాకుల వారీగా పని పూర్తయిన నివేదికలపైనా సభ్యులు ఆరా తీయనున్నారు.
బ్యారేజీ అప్స్ట్రీమ్, డౌన్స్ట్రీమ్ ఫోటోలు, స్టాప్లాగ్, గేట్ల పరిస్థితి తదితర వివరాలను చంద్రశేఖర్ అయ్యర్ కమిటీ కోరింది. NDSA కమిటీ కోరిన వివరాలు ఇచ్చే పనిలో నిమగ్నం అయ్యారు నీటిపారుదల శాఖ అధికారులు. గతంలో NDSA అధికారులు అడిగిన సమాచారాన్ని నీటిపారుదల శాఖ అధికారులు ఇవ్వలేదు. మరి తాజా పరిస్థితుల్లో అయ్యర్ కమిటీ అడిగిన సమాచారం ఇస్తారా లేదా అనేది సందిగ్ధంగానే ఉంది.
Read More: బీఆర్ఎస్ పాలనలో వందేళ్ల విధ్వంసం.. మీడియాతో సీఎం రేవంత్ రెడ్డి చిట్చాట్..
చంద్రశేఖర్ అయ్యర్ కమిటీ నాలుగు రోజుల పర్యటనలో భాగంగా బుధవారం(మార్చి 6) రోజున జలసౌధలో నీటిపారుదల శాఖ కార్యదర్శి, ఇతర అధికారులతో సమావేశం నిర్వహించనున్నారు.ఆ తర్వాత మార్చి 7, 8 న కాళేశ్వరంలో భాగమైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజ్లను పరీశీలించనున్నారు. మార్చి 9న హైదరాబాద్లో అధికారులతో మళ్లీ సమావేశం నిర్వహిస్తారు. ఆ తర్వాత ఢిల్లీకి వెళ్లనున్నారు.