CM Revanth Reddy Media Chit Chat: బీఆర్ఎస్ పాలనలో వందేళ్ల విధ్వంసం సృష్టించారని సీఎం రేవంత్రెడ్డి ఆరోపించారు. మేడిగడ్డ సహా ఇతర అంశాలపై ఆయన చిట్చాట్ నిర్వహించారు. బీజేపీ, బీఆర్ఎస్పై విమర్శలు చేశారు. తాము అధికారంలోకి రాగానే కాళేశ్వరం ప్రాజెక్టుపై జాతీయ డ్యాం సేఫ్టీ అథారిటీతో విచారణకు ఆదేశించగా.. ఆరుగురు సభ్యులతో నిపుణుల కమిటీని నియమించిందని తెలిపారు. నాలుగు నెలల్లో కమిటీ నివేదిక ఇస్తుందని సీఎం పేర్కొన్నారు. రిపోర్ట్ ఆధారంగా.. బాధ్యులపై చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. కేసీఆర్లా తానేమీ 80 వేల పుస్తకాలు చదవలేదన్న సీఎం రేవంత్ రెడ్డి మోదీలా విశ్వగురువునూ కాదన్నారు.
సాంకేతిక నిపుణుల నివేదిక ఆధారంగా న్యాయవిచారణ చేపట్టి కాళేశ్వరం అవినీతిలో భాగస్వాములపై చర్యలు తీసుకుంటామన్నారు. ఇప్పటికే ప్రజలు BRSను ఇంట్లో కూర్చోబెట్టారన్న సీఎం.. కేసీఆర్, కేటీఆర్, హరీశ్లు మేడిగడ్డ బ్యారేజీకి మరమ్మతులు చేసి నీరివ్వాలంటున్నారని తెలిపారు. మేడిగడ్డ నుంచి నీళ్లు ఎత్తిపోస్తే.. అన్నారంలోకి వస్తాయనే విషయాన్ని గ్రహించాలన్నారు. అన్నారం కూడా లీకవుతుంటే నీరు వదిలిపెట్టామని.. మేడిగడ్డలో నీళ్లు నింపినపుడు పిల్లర్లు తెగిపోయి గ్రామాలు కొట్టుకుపోతే ఎవరు బాధ్యత వహిస్తారని సీఎం అన్నారు. ఒకవేళ నష్టం జరిగితే BRS నేతలు తమదే బాధ్యత అంటూ అఫిడవిట్ రాసిస్తారా అని ప్రశ్నించారు.
మేడిగడ్డపై విచారణకు అధికారులను నియమించాలంటే.. ఆ ప్రాజెక్టు అవినీతిలో భాగస్వాములైన వారే 99 శాతం మంది ఉన్నారు. మళ్లీ వాళ్లతోనే ఎలా విచారణ చేయిస్తామని సీఎం రేవంత్ పేర్కొన్నారు. కాళేశ్వరం, విద్యుత్ ఒప్పందాలపై విచారణ జరపడానికి సిటింగ్ జడ్జిని కేటాయించాలని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాసినట్లు ఆయన చెప్పారు. దీనిపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి స్పందించారని.. సిట్టింగ్ జడ్జిని ఇవ్వడం సాధ్యం కాదని.. రిటైర్డ్ జడ్జితో విచారణ చేయించాలని సూచించినట్లు ముఖ్యమంత్రి తెలిపారు.
భారతదేశం సమాఖ్య దేశమన్న రేవంత్రెడ్డి.. అన్ని రాష్ట్రాలకూ ప్రధాని పెద్దన్న లాంటివారని పునరుద్ఘాటించారు. మోదీని పెద్దన్న అనడంలో తప్పేముందన్న ఆయన.. రాహుల్ తమ నాయకుడని, మోదీని తానెందుకు పొగుడుతానని ప్రశ్నించారు. ప్రధాని రాష్ట్రానికి వచ్చినప్పుడు సీఎంగా ప్రజల తరఫున కావాల్సిన పనుల గురించి బహిరంగసభలోనే చెప్పానన్నారు. తామేమీ కేసీఆర్లా చెవిలో గుసగుసలాడలేదని స్పష్టత ఇచ్చారు. తమ కుటుంబంలో ఎవరికీ ఎన్నికల్లో పోటీచేసే ఆలోచన లేదన్న సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ అభివృద్ధికి సహకరిస్తామని ప్రధాని చెప్పినట్లు మీడియాకు తెలిపారు. గుజరాత్లోని సబర్మతి నది మాదిరిగా మూసీ అభివృద్ధి, హైదరాబాద్లో మెట్రో రైలు పనులకు సహకరించాలని తాను ప్రధానిని కోరినట్లు సీఎం వెల్లడించారు.
Read More: గొర్రెలు, చేపల పంపిణీ పథకాల్లో అక్రమాలపై సీఎం సీరియస్.. విజిలెన్స్ విచారణకు ఆదేశం..
తమ ప్రభుత్వం పారదర్శక పాలన అందిస్తోందన్న రేవంత్ ప్రతి ఒక్కరి సమస్యను అర్థం చేసుకొని పరిష్కరిస్తున్నట్లు వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టినప్పటి నుంచి పార్లమెంటు ఎన్నికల పోలింగ్ తేదీ నాటికి తమ ప్రభుత్వ పాలనను కొలమానంగా పెట్టుకొని ఓట్లు వేయాలని ప్రజలను కోరనున్నట్లు చెప్పారు. లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలో 14 స్థానాలను గెలవడమే లక్ష్యంగా పెట్టుకున్నామని సీఎం పేర్కొన్నారు.