BRS-BSP Alliance In Telangana Ahead of Lok Sabha Polls: తెలంగాణ రాజకీయాల్లో కొత్త పొత్తు పొడిచింది. రానున్న పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్, బీఎస్పీ పార్టీలు కలిసి పోటీ చేయాలని నిర్ణయించుకున్నాయి. మంగళవారం హైదరాబాద్లోని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, బీఎస్పీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ మధ్య జరిగిన భేటీలో ఈ విషయం ఖరారైంది. తమ పార్టీ అధినేత్రి మాయావతితో మాట్లాడిన తర్వాత సీట్ల పంపకాలపై మరింత స్పష్టత వస్తుందని ప్రవీణ్ కుమార్ ప్రకటించారు. తమ పొత్తును తెలంగాణ ప్రజలు స్వాగతిస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. కాంగ్రెస్, బీజేపీలతో దేశంలోని వ్యవస్థలకు ముప్పు ఏర్పడిందని, వాటిని నిరోధించేందుకే బీఎస్సీ, బీఆర్ఎస్ పొత్తు అవసరమైందని ఆయన వివరించారు.
అటు కేసీఆర్ దీనిపై మాట్లాడుతూ ప్రవీణ్ కుమార్ రాష్ట్రంలో ఎక్కడైనా పోటీ చేయొచ్చని తెలిపారు. అవసరమైతే ఆయనను జనరల్ సీటు నుంచి కూడా బరిలో దించుతామని సంకేతాలిచ్చారు. నాగర్ కర్నూల్ లోక్సభ సీటు పరిధిలోని ఆలంపూర్ ప్రవీణ్ స్వస్థలం. దీంతో ఆయన నాగర్ కర్నూలు నుంచి పోటీకి దిగుతారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవల అక్కడ సిట్టింగ్ బీఆర్ఎస్ ఎంపీ రాములు, కమల తీర్థం పుచ్చుకోగా, ఆయన కుమారుడు భరత్కు బీజేపీ సీటిచ్చింది. దీంతో ప్రవీణ్ అక్కడి నుంచే బరిలో దిగొచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి.
Read More: కేసీఆర్తో ప్రవీణ్ కుమార్ భేటీ.. ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్, బీఎస్పీ పొత్తు..
తాజా తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 39.4% ఓట్లు, బీఆర్ఎస్కి 37.35% ఓట్లు, బీజేపీకి 13.9% ఓట్లు, ఎంఐఎంకి 2.22% ఓట్లు రాగా బీఎస్పీకి 1.37% ఓట్లు వచ్చాయి. విపక్షానికి పరిమితమైన నాటి నుంచి గులాబీ పార్టీ నుంచి కాంగ్రెస్లోకి వలసలు భారీగా పెరిగాయి. కేవలం 3 నెలలు పూర్తి కాకముందే.. నేతలంతా కారు దిగి పోవటంతో లోక్సభ ఎన్నికల నాటికి తెలంగాణలో కాంగ్రెస్ – బీజేపీల మధ్యే పోరు అన్నట్లుగా పరిస్థితి తలెత్తే వాతావరణం నెలకొంది. ఈ పరిస్థితిని నివారించటానికి కేసీఆర్ ఒక మెట్టు దిగి బీఎస్పీతో చేయి కలిపారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.
అయితే, వీరి మధ్య ముందునుంచే అవగాహన ఉందనేది మరికొందరి వాదన. గతంలో ఉద్యోగ బాధ్యతల నుంచి తప్పుకునే క్రమంలో ఆయన చేసిన రాజీనామాను నాటి కేసీఆర్ ప్రభుత్వం వెంటనే ఆమోదించటం, ఎన్నికల ప్రచారంలో ప్రవీణ్ కుమార్ మీద ఎలాంటి వ్యాఖ్యలూ చేయకపోవటమే దీనికి ఉదాహరణ అనీ, గత అసెంబ్లీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ విజయాన్ని అడ్డుకునేందుకే బీఎస్పీ రాష్ట్ర వ్యాప్తంగా అభ్యర్థులను బరిలో దించిందని వారు గుర్తు చేస్తున్నారు. ఏది ఏమైనా ఈ పొత్తును రెండు పార్టీలూ ఎలా ముందుకు పోతాయో వేచి చూడాల్సిందే.