PM Modi Speech In Sangareddy : తెలంగాణలో బీఆర్ఎస్ కుంభకోణాలపై ఆగ్రహంతోనే ప్రజలు కాంగ్రెస్ కు ఛాన్స్ ఇచ్చారని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. సంగారెడ్డిలో వివిధ అభివృద్ధి పనులను ప్రారంభించిన మోదీ.. ఆ తర్వాత బహిరంగ సభలో పాల్గొన్నారు. బీఆర్ఎస్ , కాంగ్రెస్ పార్టీలపై విమర్శలు గుప్పించారు. ఆ రెండు పార్టీలది స్కాముల బంధం అని విమర్శించారు. కాళేశ్వరం పేరుతో బీఆర్ఎస్ దోచుకుందని ఆరోపించారు.
కుటుంబ పార్టీలకు వ్యతిరేకంగా తాను పోరాడుతున్నానని ప్రధాని మోదీ అన్నారు. జమ్మూకాశ్మీర్ నుంచి తమిళనాడు వరకు కుటుంబ పార్టీలున్నాయి. ఆయా రాష్ట్రాల్లో ఆ కుటుంబాలే బాగుపడుతున్నాయని విమర్శించారు. ఫ్యామిలీ పార్టీలను ప్రజాస్వామ్యానికి శత్రులుగా పేర్కొన్నారు. ఆ పార్టీలకు కుటుంబమే ఫస్ట్ అని విమర్శించారు. తనకు మాత్రం దేశమే ఫస్ట్ అని స్పష్టం చేశారు.
కుటుంబ పార్టీల నాయకులు సొంత ఖజానాను నింపుకున్నారని మోదీ విమర్శించారు. తాను మాత్రం దేశ ఖజానాను నింపానన్నారు. తాను ఎవరిపైనా వ్యక్తిగతంగా విమర్శలు చేయలేదన్నారు. తనపై మాత్రం కుటుంబ పార్టీల నాయకులు విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. దేశంలోని ప్రతి ఒక్కరూ మోదీ కుటుంబమేనని స్పష్టం చేశారు.
Read More: ఉజ్జయిని మహంకాళిని దర్శించుకున్న ప్రధాని.. NH-161 జాతికి అంకితం
గత పదేళ్లలో దేశంలో ఎంతో అభివృద్ధి జరిగిందని మోదీ చెప్పుకొచ్చారు. గత 70 ఏళ్లలో ఇలాంటి అభివృద్ధి జరగలేదన్నారు. ప్రజల అభివృద్ధికి తాను గ్యారెంటీ అని హామీ ఇచ్చారు. ఎస్సీ వర్గీకరణపై ఉన్నతస్థాయి కమిటీ వేశామన్నారు. తెలంగాణ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందని భరోసా ఇచ్చారు.
మోదీ తెలంగాణలో రెండురోజుల పర్యటించారు. తొలిరోజు ఆదిలాబాద్ లో అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. రెండోరోజు సంగారెడ్డిలో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. తెలంగాణ పర్యటన పూర్తి చేసుకుని బేగంపేట ఎయిర్ పోర్టుకు చేరుకున్న మోదీకి గవర్నర్ తమిళిసై , సీఎం రేవంత్ రెడ్డి వీడ్కోలు పలికారు.