Dehydration Symptoms : ప్రతి జీవికి పీల్చేగాలి తర్వాత అత్యంతగా అవసరమైంది నీరు. మనిషి ఏమీ తినకుండా ఎనిమిదివారాల పాటు బతుకగలడు. కానీ అన్ని రోజుల పాటు క్రమం తప్పకుండా వేళకు నీళ్లు ఖచ్చితంగా తాగాలి.. లేదంటే ప్రాణాలే పోతాయి. సాధారణంగా మనకు దాహం వేసినప్పుడు నీళ్లు తాగుతాం. చెమట ఎక్కువగా పట్టినప్పుడు, మూత్రవిసర్జన చేసినప్పుడు దాహం వేయడం కామన్. అయితే సాధారణ దాహానికి, డీహైడ్రేషన్కు తేడా ఉంటుంది. శరీరం ఎండాకాలంలో ఎక్కువగా ద్రవాలను కోల్పోతుంది. దీనివల్ల మన శరీరం డీహైడ్రేషన్కు గురవుతుంది. ఆ సమయంలో ఎటువంటి లక్షణాలు ఉంటాయో తెలుసుకుందాం..
ప్రస్తుతం ఎండకాలం ప్రారంభమైంది. ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరుగుతున్నాయి. దీని కారణంగా చాలా మంది డీహైడ్రేషన్కు గురయ్యే ప్రమాదం ఉంది. బయట పనిచేసే భవన నిర్మాణ కార్మికులు, మెకానిక్స్, వెల్డర్లు, దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతున్న వాళ్లు, క్రీడాకారులు, రన్నర్లు, సైక్లిస్టులు, సాకర్ ప్లేయర్స్ , శిశువులు, చిన్న పిల్లలు, ఎత్తైన ప్రదేశాలలో నివసించే వారు త్వరగా డీహైడ్రేషన్కు బారినపడే అవకాశం ఉంది.
READ MORE : కొబ్బరి నీళ్లు తాగితే బోలెడు ప్రయోజనాలు
ఎక్కువగా చెమట
శరీరానికి ఎక్కువ చెమట పట్టడం వల్ల హైడ్రేషన్కు గురయ్యే అవకాశం ఉంది. చెమట, మూత్రవిసర్జన వల్ల శరీరంలో నీటిశాతం తగ్గుతుంది. కాబట్టి ఆ సమయంలో నీటిని అందించాలి. శరీరం సాధారణం కంటే ఎక్కువ నీటిని కోల్పోతే డీహైడ్రేషన్ బారీన పడాల్సివస్తుంది.
శరీరంలోని నీరు ఇతర అవయవాల పనితీరును మెరుగుపరుస్తుంది. అలానే న్యూట్రిషన్స్ను సరఫరా చేస్తుంది. మన శరీరం నుంచి నీరు ఎక్కువగా బయటకు వెళ్తే ప్రమాదం. శరీరంలో ఉండాల్సిన దానికంటే తక్కువగా నీటిశాతం ఉంటే డీహైడ్రేషన్కు గురైనట్లే.
శరీరంలో నీటి శాతం
మన శరీరంలో 60 శాతం నీరు ఉంటుంది. శరీరంలో నీటి శాతం తగ్గితే డీహైడ్రేషన్ సమస్య వస్తుంది. శరీరంలో 2 శాతం నీరు తగ్గితే వెంటనే దాహం వేస్తుంది. ఇది 3 శాతానికి చేరితే బాడీలో బర్నింగ్ మొదలై.. అది మెల్లగా ఆకలి స్థాయిని మందగింపజేస్తుంది. సదరు వ్యక్తి చర్మం ఎర్రగా మారి, శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది.
శరీరంలో నీటి శాతం 4 లేదా 5 శాతానికి పడిపోతే జ్వరంతో పాటు తలనొప్పి ప్రారంభమవుతుంది. నీటి కొరత 5 నుంచి 8 శాతానికి చేరితే మూర్ఛ పోయే ప్రమాదం ఉంది. అదే 20 శాతానికి చేరితే ఆ వ్యక్తి ప్రాణాలకే ముప్పు. నీటిని తాగడం ప్రతీ ఒక్కరూ బాధ్యతగా భావించాలి.
READ MORE : సమ్మర్.. ఈ జాగ్రత్తలు కచ్చితంగా పాటించాలి!
మూత్రవిసర్జన
డీహైడ్రేషన్ కారణంగా మూత్రవిసర్జన తగ్గుతుంది. తలనొప్పి, నిద్ర వచ్చినట్లు అనిపించడం , నీరసంగా ఉంటుంది. చర్మం సహజ గుణాన్ని కోల్పోతుంది. అంటే చర్మం సాగదు. నోరు,పెదవులు, చిగుళ్లు పొడిబారిపోతాయి. మూత్రం ముదురు పసుపు లేదా కాషాయం రంగులోకి మారుతుంది. దుర్వాసన కూడా వస్తుంది. కొందరిలో అసలు వాసన లేకుండా ఉంటుంది. ఇది శరీరం హైడ్రేషన్కు గురైందని చెప్పడానికి సంకేతం.
తిమ్మిర్లు
నీటి నిల్వలు తక్కువైనప్పుడు.. కండరాల్లో ఉన్న ద్రవాలు, ఎలక్ట్రోలైట్లను మీ శరీరం సేకరిస్తుంది. దీనివల్ల కండరాల్లో ద్రవాల స్థాయి తగ్గుతుంది. ఫలితంగా కండరాల్లో నొప్పితో కూడిన తిమ్మిర్లు వస్తాయి. ఒంట్లో సోడియం మోతాదు తగ్గినప్పుడు ఇలా జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. ఎలక్ట్రోలైట్లు ఎక్కువగా ఉన్న ద్రవాలు తీసుకోవడం, లేదంటే ఉప్పు ఎక్కువగా ఉన్న పదార్థాలను నీటితో సహా తీసుకోవడం వంటివి చేస్తే.. ఈ సమస్య నుంచి బయటపడొచ్చు.
Disclaimer : ఈ సమాచారాన్ని వైద్య నిపుణుల సలహాల మేరకు పలు అధ్యయనాల ఆధారంగా అందిస్తున్నాం. దీనిని కేవలం సమాచారంగా భావించండి.