ISRO: ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ కు క్యాన్సర్ సోకింది. ఈ విషయాన్ని ఆయనే ఆలస్యంగా బయటపెట్టారు. ఆదిత్య ఎల్1 ప్రయోగం చేపట్టిన సమయంలో తనకు క్యాన్సర్ సోకిందని తేలిందన్నారు. వైద్య పరీక్షల్లో ఈ విషయం నిర్ధారణ అయ్యిందని వెల్లడించారు.
చంద్రయాన్-3 ప్రయోగ సమయంలో తనకు ఆరోగ్య సమస్యలు తలెత్తాయని సోమనాథ్ చెప్పారు. కానీ ఆరోగ్య సమస్యలపై స్పష్టత రాలేదన్నారు. సూర్యుడిపై అధ్యనయం కోసం భారత్ ఆదిత్య ఎల్1 ప్రయోగం చేపట్టిన రోజు హెల్త్ చెకప్ చేయించుకున్నానని తెలిపారు. టెస్టుల్లో అనారోగ్య సమస్యలను వైద్యులు గుర్తించారని పేర్కొన్నారు. ఆదిత్య ఎల్ 1 మిషన్ ప్రయోగం పూర్తైన తర్వాత చెన్నైలో స్కానింగ్ చేయించానని తెలిపారు.
తన కడుపులో కణితిని వైద్యులు గుర్తించారని సోమనాథ్ వెల్లడించారు. ఆ కణితి బాగా పెరిగిందని నిర్ధారించారన్నారు. ఆ తర్వాత క్యాన్సర్ నిర్ధారణ అయ్యిందని వివరించారు. ఇది వంశపారంపర్యంగా వచ్చే క్యాన్సర్ అని పేర్కొన్నారు. తనకు క్యాన్సర్ సోకిందని తెలియగానే ఫ్యామిలీ ఆందోళనకు గురైందని తెలిపారు. ఇస్రో శాస్త్రవేత్తలు, ఉద్యోగులు షాక్ కు గురయ్యారని చెప్పారు.
Read More : విద్యారంగానికి పెద్దపీట.. 16 వేల కోట్లు కేటాయించిన ఢిల్లీ ప్రభుత్వం..
2023 సెప్టెంబర్ 2న ఇస్రో ఆదిత్య ఎల్ 1 ప్రయోగం చేపట్టింది. ఈ ప్రయోగం పూర్తైన తర్వాత వైద్యుల సూచనలో సోమనాథ్ ఆపరేషన్ చేయించుకున్నారు. నాలుగురోజులపాటు ఆస్పత్రిలో ఉన్నారు. ఆపరేషన్ తర్వాత కీమోథెరపీ చేయించుకున్నారు. ఆపరేషన్ పూర్తైన ఐదో రోజు నుంచి ఇస్రో కార్యకలాపాలను పర్యవేక్షిస్తున్నారు. ఈ విషయాలను ఓ మళయాల వెబ్ ఛానల్ ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు.