Supreme court on Udhayanidhi(Today news paper telugu): తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ కుమారుడు, మంత్రి ఉదయనిధి స్టాలిన్ కొన్నాళ్ల క్రితం సనాతన ధర్మంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సనాతన ధర్మాన్ని నిర్మూలించాలంటూ పిలుపునిచ్చారు. ఉదయనిధి కామెంట్స్ పై దేశవ్యాప్తంగా దుమారం రేగింది. బీజేపీ నేతలు, హిందూ సంఘాలు ఆయన మాటలను తప్పుపట్టాయి. వెంటనే ఆ వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలని కోరాయి. అయినా సరే ఉదయనిధి స్టాలిన్ వెనక్కి తగ్గలేదు.
అప్పట్లో ఉదయనిధి సనాతన ధర్మంపై చేసిన వ్యాఖ్యలపై హిందూ సంఘాలు, బీజేపీ నేతలు పోలీసు స్టేషన్లలోనూ ఫిర్యాదులు చేశారు. అనేక రాష్ట్రాల్లో ఉదయనిధిపై కేసులు పెట్టారు. దీంతో ఆయనపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఆ కేసులే ఇప్పుడు ఉదయనిధికి తలనొప్పిగా మారాయి. ఈ నేపథ్యంలో తనపై నమోదైన ఎఫ్ఐఆర్ లు అన్ని కలిపి విచారించాలని ఉదయనిధి సుప్రీంకోర్టుకు వెళ్లారు. ఆయన దాఖలు చేసిన పిటిషన్ పై సర్వోన్నత న్యాయస్థానం విచారణ జరిపింది. సనాతన ధర్మంపై ఉదయనిధి చేసిన వ్యాఖ్యలను తప్పుపట్టింది.
వాదనల సమయంలో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. వాక్ స్వతంత్రం, మత స్వేచ్ఛ, భావ ప్రకటనా స్వేచ్ఛ హక్కులను దుర్వినియోగం చేశారని పేర్కొంది. రక్షణ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించడాన్ని ప్రస్తావించింది. ఉదయనిధి సామాన్య పౌరుడు కాదని మంత్రి పదవిలో ఉన్న విషయాన్ని గుర్తు చేసింది. సనాతన ధర్మంపై చేసిన వ్యాఖ్యల వల్ల ఎలాంటి వివాదాలు రేగుతాయో తెలియదా ? అని ప్రశ్నించింది.
ఈ కేసు విచారణను సర్వోన్నత న్యాయస్థానం మార్చి 15కి వాయిదా వేసింది.
Read More: లంచం కేసులు.. ఎంపీ, ఎమ్మెల్యేలకు మినహాయింపు లేదు.. సుప్రీంకోర్టు కీలక తీర్పు..
2023 సెప్టెంబర్ లో తమిళనాడులో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఉదయనిధి సంచలన వ్యాఖ్యలు చేశారు. సనాతన ధర్మాన్ని నిర్మూలించాలని పిలుపునిచ్చారు. ఈ ధర్మంపై తీవ్ర విమర్శలు చేశారు. సనాతన ధర్మం సామాజిక న్యాయానికి వ్యతిరేకమైనదిగా పేర్కొన్నారు. ఆయన చేసి ఈ కామెంట్స్ పై దేశవ్యాప్తంగా వివాదంగా మారాయి. ఉదయనిధిపై చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టులో కూడా పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం డీఎంకే నేత, తమిళనాడు మంత్రి ఉదయనిధికి నోటీసులు ఇచ్చింది.