Arvind Kejriwal : ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఎట్టికేలకు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఈడీ ఎదుట హాజరయ్యేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారు. కానీ ఈరోజు మాత్రం ఈడీ విచారణకు డుమ్మా కొట్టారు. ఇటీవల ఈడీ అధికారులు ఢిల్లీ ముఖ్యమంత్రికి విచారణకు రావాలని 8వ సారి నోటీసులు ఇచ్చారు. మార్చి 4న విచారణకు రావాలని కోరారు.
ఈసారి కూడా కేజ్రీవాల్ ఈడీ ఎదుట హాజరుకాలేదు. కానీ ఈడీ అధికారులకు మాత్రం నోటీసులకు సమాధానం పంపించారు. ఈడీ తనకు చట్ట విరుద్ధంగా నోటీసులు ఇచ్చిందని మండిపడ్డారు. కానీ ఈడీ ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి సిద్ధమేనని స్పష్టం చేశారు.
విచారణకు నేరుగా హాజరుకాలేని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఈడీకి తెలియజేశారు. మార్చి 12 తర్వాత విచారణకు అందుబాటులో ఉంటానని తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణకు హాజరవుతానని షరతు పెట్టారు.
Read More: జన్ విశ్వాస్ మహా ర్యాలీ.. ఎన్నికల సమరశంఖాన్ని పూరించిన ఇండియా కూటమి నేతలు..
ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు ఈడీ 2023 నవంబర్ 2న తొలిసారిగా నోటీసులు ఇచ్చింది. కానీ ఆయన విచారణకు హాజరుకాలేదు. ఆ తర్వాత వరుసగా సమన్లు జారీ చేసింది. ఇలా మొత్తం 8 సార్లు కేజ్రీవాల్ కు ఈడీ నోటీసులు పంపింది. కానీ తొలి ఏడు నోటీసులకు హాజరుకావడానికి విముఖత చూపించారు. ఈడీ సమన్లకు సమాధానం కూడా ఇవ్వలేదు.
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ విచారణకు రాకపోవడంతో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ కోర్టులో పిటిషన్ కూడా వేసింది. ఈ పిటిషన్ పై కోర్టు నోటీసులు ఇవ్వడంతో కేజ్రీవాల్ వీడియో కాన్ఫెరన్స్ ద్వారా విచారణకు హాజరయ్యారు. ఆయన విజ్ఞప్తితో తుదిపరి విచారణ మార్చి 16కి వాయిదా పడింది. ఆ రోజు ఢిల్లీ సీఎం స్వయంగా కోర్టుకు హాజరుకానున్నారు.