EX Cricketer Rohit Sharma Died : పొద్దున్నే అందరూ సోషల్ మీడియాలో వార్తలు చూసి హడలిపోయారు. ఎందుకంటే సోషల్ మీడియాలో వార్తను హైప్ చేయాలంటే, ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు క్రియేట్ చేయాలి. ఈ క్రమంలో రోహిత్ శర్మ పేరుతో ఉన్న క్రికెటర్ మరణించాడు. దానిని రోహిత్ శర్మ మృతి అనే పేరుతో రాసి పారేశారు. దీంతో వార్త ఒక్కసారి నెట్టింట వైరల్ అయిపోయింది. ఏం జరిగింది? ఏం జరిగింది? అంటూ అభిమానుల్లో ఆందోళనలు వ్యక్తమయ్యాయి.
మరణించడం విచారించాల్సిన విషయమే కానీ, ఎంతో మంది దేశవాళీల్లో రాణించిన క్రీడాకారులు మరణిస్తుంటారు. వాళ్లకెవరికీ రాని హైప్ తన విషయంలో జరిగింది. అయితే వార్తను మొదలు పెట్టడం కూడా భారత క్రికెట్ జట్టు అభిమానులకు చేదువార్త అంటూ రాసుకెళ్లారు. ఇంతకీ విషయం ఏమిటి? అసలీ రోహిత్ శర్మ ఎవరంటే..
దేశవాళీ క్రికెట్లో రాజస్తాన్ తరఫున ఆడిన మాజీ క్రికెటర్ రోహిత్ శర్మ(40).. తను కొన్ని రోజులుగా కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడు. ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నాడు. ఆదివారం రాత్రి తుదిశ్వాస విడిచాడు.
Read More : గుజరాత్ టైటాన్స్కు షాక్.. రోడ్డు ప్రమాదంలో రూ. 3.60 కోట్ల ఆటగాడికి గాయాలు..
40 ఏళ్ల రోహిత్ శర్మ రైట్ హ్యాండ్ బ్యాటర్, అంతేకాదు లెగ్ స్పిన్ కూడా వేస్తాడు. ఆల్ రౌండర్ అయిన రోహిత్.. రాజస్తాన్ తరఫున 2004 నుంచి 2014 దాకా డొమెస్టిక్ క్రికెట్ ఆడాడు. 2004లో రాజస్తాన్ తరఫున రంజీల్లో అడుగుపెట్టాడు. 2014లో విజయ్హజారే ట్రోఫీలో మ్యాచ్ ఆడి వీడ్కోలు పలికాడు.
ఇకపోతే రాజస్తాన్ తరఫున 7 ఫస్ట్క్లాస్ గేమ్స్, 28 లిస్ట్ ఏ గేమ్స్, నాలుగు టీ 20లు ఆడాడు. దేశవాళీలో 1147 పరుగులు చేశాడు. ఏడు వికెట్లు కూడా పడగొట్టాడు. క్రికెట్ నుంచి రిటైర్మెంట్ అనంతరం కోచింగ్ బాధ్యతలు చేపట్టాడు. జైపూర్లో ఆర్ఎస్ క్రికెట్ అకాడమీని నెలకొల్పాడు. యువ క్రికెటర్లకు క్రికెట్ పాఠాలు చెబుతూ, వారిని తీర్చిదిద్దుతున్నాడు.
హఠాత్తుగా ఇలా జరిగేసరికి రాజస్థాన్ క్రికెట్ అసోసియేషన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. రోహిత్ మృతికి సంతాపం తెలిపింది. సీనియర్ క్రికెటర్లు కూడా తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు.