Drone Camera Found Around Sri Kalahasti Temple(AP latest news) : తిరుపతి జిల్లాలో ఉన్న శ్రీకాళహస్తీశ్వర ఆలయంపై డ్రోన్ కెమెరాను ఎగురవేసి.. వీడియోలు చిత్రీకరించడం కలకలం రేపింది. ఆలయ పరిసరాలను డ్రోన్ కెమెరాలతో వీడియోలను చిత్రీకరించడం గుర్తించిన ఆలయ సెక్యూరిటీ.. ఐదుగురు యువకులను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. చెన్నైకి చెందిన విఘ్నేష్, అజిత్ కన్నన్, శంకర్ శర్మ, అరవింద్, పోర్చే జీఎన్ అనే ఐదుగురు యువకులు తిరుమలలో శ్రీవారిని దర్శించుకుని.. శనివారం శ్రీకాళహస్తికి వచ్చారు. ముక్కంటీశ్వరుడి ఆలయానికి సమీపంలోనే ఒక ప్రైవేట్ గెస్ట్ హౌస్ లో ఒక గదిని అద్దెకు తీసుకుని బస చేశారు.
Read More : మహాశివరాత్రి స్పెషల్, తెలంగాణలో ప్రముఖ శైవక్షేత్రాలివే
మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో.. ఆలయానికి, ఆలయ పరిసరాల్లో విద్యుత్ దీపాలంకరణ చేశారు ఆలయ నిర్వాహకులు. దీంతో.. వాటన్నింటినీ చిత్రీకరించాలని భావించిన యువకులు.. గెస్ట్ హౌస్ పై నుంచి డ్రోన్ కెమెరాతో అర్థరాత్రి వేళ ప్రధాన ఆలయం, పరిసరాలను చిత్రీకరించారు. గమనించిన సెక్యూరిటీ.. ఆ డ్రోన్ ను వెంబడించి యువకుల్ని గుర్తించారు. శ్రీకాళహస్తి వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. యువకులను అదుపులోకి తీసుకున్నారు.
కాగా.. మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాల ప్రారంభోత్సవం సందర్భంగా భక్తకన్నప్ప కొండపై ఆయన నేతృత్వంలో కైలాస నాథుడి ఆలయం వద్ద ధ్వజారోహణ ఘట్టాన్ని విశేషంగా నిర్వహించారు. హరహర మహాదేవ శంభోశంకర, ఓం నమఃశివాయ నామస్మరణల మధ్య అర్చకులు దవళవస్త్రాన్ని ధ్వజస్తంభంపై అధిరోహించారు. 14 రోజులపాటు నిర్వహించే ఈ ఉత్సవాల్లో క్షేత్ర సంప్రదాయం ప్రకారం తొలిపూజను పరమశివభక్తుడైన కన్నప్పే అందుకున్నాడు.