Tirupati SP Malika Garg Transfered as Vijayawada CID SP(AP updates): తిరుపతి ఎస్పీ మలికాగార్గ్ను రాష్ట్ర ప్రభుత్వం విజయవాడ సీఐడీ ఎస్పీగా బదిలీ చేసింది. ఆమె ప్లేస్ లో విజయవాడ శాంతి భద్రతల విభాగం డీసీపీ కృష్ణకాంత్ పటేల్ ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే.. తిరుపతి జిల్లా ఎస్పీగా బాధ్యతలు తీసుకున్న మూడు వారాల వ్యవధిలోనే ఆమెను మరో చోటికి బదిలీ చేయడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. కాగా, ఇటీవల బదిలీల్లో ప్రకాశం జిల్లా ఎస్పీగా ఉన్న మల్లికా గార్గ్ ను తిరుపతికి పంపించారు. తిరుపతి జిల్లాకు తొలి మహిళా ఎస్పీ వచ్చిందనుకున్నారు. ఆమె కూడా.. సంఘ వ్యతిరేక శక్తులపై ఉక్కుపాదం మోపుతానని అన్నారు. రాబోయే ఎన్నికల నిర్వహణలో సమర్థవంతంగా సేవలు అందిస్తానని ప్రకటించారు. కానీ ఆమె తన పోస్టులో కుదురుకునే లోపే బదిలీ చేయడం అనుమానాలకు తావిస్తోంది.
అధికారంలో ఉన్న వైసీపీకి చెందిన ముగ్గురు ప్రజాప్రతినిధుల నుంచి ఒత్తిడులు రావడంతోనే మల్లికా గార్గ్ ను బదిలీ చేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అంతకుముందు ప్రకాశం ఎస్పీగా ఉన్న మలికాగార్గ్.. ఫిబ్రవరి 1వ తేదీన తిరుపతి ఎస్పీగా బదిలీ అయ్యారు. ఆమెను తిరుపతి రానివ్వకుండానే బదిలీ చేయించాలని అధికార పార్టీ నాయకులు ప్రయత్నించినా సఫలం కాలేదు. ఆఖరికి ఫిబ్రవరి 12న తిరుపతి ఎస్పీగా మలికాగార్గ్ బాధ్యతలు చేపట్టారు. విధుల్లో నిక్కచ్చిగా, తటస్థంగా, చట్ట ప్రకారం వ్యవహరించారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఏ రాజకీయ పక్షానికి అనుకూలంగా పనిచేయొద్దని, నిబంధనల ప్రకారం ముందుకెళ్లాలని సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు.
Read More : బంగారం చోరీ కేసు.. విశాఖలో సినీ నటి అరెస్ట్
తిరుపతి లోక్సభ ఉపఎన్నికల సందర్భంగా చోటుచేసుకున్న అక్రమాలు, నమోదైన కేసులపైనా దృష్టి సారించారు. ఆ కేసులను పక్కదారి పట్టించిన వ్యవహారంపై ఆమె ఎన్నికల సంఘానికి ఏదైనా నివేదిక సమర్పిస్తే.. సార్వత్రిక ఎన్నికల వేళ తమకు మరింత ఇబ్బందిగా మారుతుందని వైకాపా నాయకులు భావించినట్టు సమాచారం. దీనికితోడు వచ్చే ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడే అవకాశం ఉండదనే ఉద్దేశంతో బదిలీ చేయించినట్లు పోలీసు వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
మలికాగార్గ్ 2015 క్యాడర్ ఐపీఎస్ అధికారిణి. అంతర్ క్యాడర్ బదిలీల్లో భాగంగా ఆమె పశ్చిమ బెంగాల్ నుంచి ఆంధ్రప్రదేశ్ కు వచ్చారు. తొలుత కృష్ణా జిల్లా అడిషనల్ ఎస్పీగా పనిచేశారు. 2021 జులైలో ప్రకాశం జిల్లా ఎస్పీగా వచ్చారు. నిజాయతీగా వ్యవహరిస్తారని, నేరస్తుల పాలిట కఠినంగా వ్యవహరిస్తారని ఆమెకు పేరుంది.