PM Narendra Modi Telangana Visit (current news from India) : ప్రధాని నరేంద్రమోదీ రెండు రోజులు తెలంగాణలో పర్యటించనున్నారు. ఈ మేరకు బీజేపీ ప్రధాని పర్యటన షెడ్యూల్ ను విడుదల చేసింది. సోమవారం ఉదయం తెలంగాణకు విచ్చేయనున్నారు. ఉదయం 10.30 గంటల నుంచి 11 గంటల వరకూ ఆదిలాబాద్ లో పలు కేంద్రప్రభుత్వ ప్రాజెక్టులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ఉదయం 11.15 గంటల నుంచి 12 గంటల వరకూ బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు.
మధ్యాహ్నం తమిళనాడుకు వెళ్లి.. రాత్రికి తిరిగి హైదరాబాద్ కు చేరుకుంటారు. సోమవారం రాత్రి రాజ్ భవన్ లో బస చేస్తారు మోదీ. మంగళవారం ఉదయం రాజ్ భవన్ నుంచి బయల్దేరి సంగారెడ్డికి చేరుకుంటారు. 10.45 గంటల నుంచి 11.15 గంటల వరకూ సంగారెడ్డిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. 11.30 గంటల నుంచి 12.15 గంటల వరకూ బీజేపీ బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. తెలంగాణలో పర్యటన ముగిసిన అనంతరం ఒడిశాకు వెళ్తారు. రెండ్రోజుల రాష్ట్ర పర్యటనలో ప్రధాని మొత్తం రూ.15,718 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు.
Read More : వనపర్తిలో ఘోరరోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి
ప్రధాని నరేంద్రమోదీ పర్యటన నేపథ్యంలో.. పలు ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. భారీగా పోలీసు బలగాలు మోహరించాయి. అధికారిక కార్యక్రమాలకు, పార్టీ కార్యక్రమాలకు ఏర్పాట్లు పూర్తిచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలిసారి.. ప్రధాని వస్తుండటంతో ఆయనకు ఘనంగా స్వాగతం పలికేందుకు రేవంత్ సర్కార్ సిద్ధమైంది. కేంద్రానికి చెల్లించాల్సినవి చెల్లిస్తూనే.. రాష్ట్రానికి రావాలసిన నిధుల గురించి కొట్లాడుతామని మంత్రి సీతక్క తెలిపారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో ప్రోటోకాల్ ప్రకారం సీఎం స్వాగతం పలుకుతారని వెల్లడించారామె.
కాగా.. మొత్తం 10 రోజుల్లో 12 రాష్ట్రాల్లో ప్రధాని మోదీ సుడిగాలి పర్యటన చేయనున్నారు. మార్చి4,5 తేదీల్లో తెలంగాణలో పర్యటిస్తారు. తర్వాత ఒడిశాలో చండీఖోలేలో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొంటారు. మార్చి6న కోల్ కతాలోపలు అభివృద్ధి కార్యక్రమాలో పాల్గొని.. బరాసత్ లో జరిగే బహిరంగ సభలో ప్రసంగిస్తారు. అదేరోజున బీహార్ లోని బెట్టియాలో వివిధ అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించి, శంకుస్థాపన చేస్తారు. మార్చి 7న జమ్మూకశ్మీర్ లో పర్యటించి, సాయంత్రం తిరిగి ఢిల్లీకి చేరుకుంటారు. అక్కడ ఒక మీడియా ఈవెంట్ లో పాల్గొంటారు. మార్చి 8న ఢిల్లీలో తొలిసారి జరిగే నేషనల్ క్రియేటర్స్ అవార్డుల కార్యక్రమంలో పాల్గొంటారు.
మార్చి8 సాయంత్రం అసోంలోని జోర్హాట్ లో లెజెండరీ అహోం ఆర్మీ కమాండర్ లచిత్ బోర్ఫుకాన్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. అనంతరం జోర్హాట్ లో వివిధ అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించి, శంకుస్థాపనలు చేస్తారు. అనంతరం అరుణాచల్ ప్రదేశ్ లోని వెస్ట్ కమెంగ్ లో సెలా టన్నెల్ ను ప్రారంభిస్తారు. ఇటానగర్ లో వివిధ అభివృద్ధి ప్రాజెక్టులను ఆవిష్కరిస్తారు. ఆ తర్వాత బెంగాల్ లోని సిలిగుఢిలోనూ అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించి.. బహిరంగ సభల్లో పాల్గొని ప్రసంగిస్తారు.
మార్చి 10న ఉత్తరప్రదేశ్ లో పర్యటిస్తారు. అజాంగఢ్ లో పలు ప్రాజెక్టులను ప్రారంభించి.. జాతికి అంకితం చేస్తారు. 11న ఢిల్లీలో పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. ద్వారకా ఎక్స్ ప్రెస్ వే లోని హరియాణా సెక్షన్ ను ప్రారంభిస్తారు. 11న సాయంత్రం డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ ఆర్గనైజేషన్ కార్యక్రమంలో పాల్గొంటారు. మార్చి 12న గుజరాత్ లోని సబర్మతి, రాజస్థాన్ లోని పోఖ్రాన్ లలో పలు కార్యక్రమాల్లో ప్రధాని పాల్గొంటారు. మార్చి 13న గుజరాత్, అసోంలో 3 ముఖ్యమైన సెమీకండక్టర్ల ప్రాజెక్టులకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శంకుస్థాపన చేస్తారు.