Vemulawada Rajanna Temple: తెలంగాణలోని విశిష్టమైన శైవ క్షేత్రాల్లో వేములవాడ ఒకటి. దక్షిణ కాశిగా పిలిచే ఈ క్షేత్రంలో మహాదేవుడు ‘రాజరాజేశ్వర స్వామి’గా పూజలందుకుంటున్నాడు. కరీంనగర్కు 37 కి.మీ దూరంలోని ఈ క్షేత్రం పౌరాణికంగానే గాక చారిత్రకంగానూ ఖ్యాతి పొందింది.
నేడు వేములవాడగా పిలుస్తున్న ఈ ఊరి అసలుపేరు.. లేంబుల వాటిక. అదే కాలక్రమంలో వేములవాడ అయింది. క్రీ.శ 750 నుండి 975 వరకు ఈ పట్టణాన్ని చాళుక్యులు, ఇక్ష్వాకులు పాలించారు. జైనం, శైవం గొప్పగా విరాజిల్లిన ఈ క్షేత్రం తర్వాతి రోజుల్లో కాకతీయులు, ఢిల్లీ పాలకుల పాలనలో ఉంది.
స్థలపురాణం ప్రకారం.. కృతయుగంలో దేవేంద్రుడు లోకకంటకుడైన వృత్తాసురుడు అనే రాక్షసుని సంహరించి, దానివల్ల కలిగిన బ్రహ్మహత్యాపాతకాన్ని తొలగించుకోవటం కోసం దేశాటన చేస్తూ నేటి వేములవాడలోని ధర్మగుండంలో స్నానం చేసి, జపం చేశాక.. ఆయనకు ఆ కొలనులో శివలింగం దొరికిందట. దానిని ఆయన ఈ క్షేత్రంలో ప్రతిష్ఠించి ఆరాధించాడనీ, అదే నేటి ఆలయంలోని శివలింగమని స్థలపురాణం చెబుతోంది. వనవాస కాలంలో సీతారాములు ఈ క్షేత్రానికి వచ్చి, స్వామిని సేవించారనే కథనమూ ఉంది.
ఇక ఆలయ విశేషాలకు వస్తే.. ఇక్కడ అమ్మవారి పేరు.. రాజ రాజేశ్వరి కాగా.. స్వామివారి పేరు.. రాజ రాజేశ్వరుడు. భక్తులు స్వామిని ‘రాజన్న’ అని పిలుచుకుంటారు. ఈ ఆలయాన్ని చోళ రాజులలో ప్రముఖుడైన రాజరాజ నరేంద్రుడు నిర్మించినట్లు చారిత్రక ఆధారాలున్నాయి.
Read More: ఆదిత్య హృదయం ఎలా ఆవిర్భవించిందంటే…!
ఈ ఆలయంలో స్వామి వారికి కుడివైపున అమ్మవారు, ఎడమ వైపున లక్ష్మి సమేత గణపతి కొలువై ఉంటారు. ఆలయం చుట్టూ బాల రాజేశ్వర, విఠలేశ్వర, ఉమామహేశ్వర, త్రిపుర సుందరీ దేవి ఆలయాలున్నాయి. జగన్మాత స్వరూపిణి అయిన బద్ది పోచమ్మ ఆలయం కూడా ఇక్కడ ఉంది. దేవాలయం ప్రక్కనే వున్న ధర్మకుండం (పుష్కరిణి)లో స్నానం చేశాక.. దక్షయజ్ఞ సమయంలో వీరభద్రుని దెబ్బకి చేతులు కోల్పోయిన సూర్యుభగవానుడికి చేతులు తిరిగి వచ్చాయనే పురాణ గాథ ఉంది.
ఏ ఆలయంలోలేని సంప్రదాయం ఈ కోవెలలో ఉంది. సంతానం లేని దంపతులు ముందు స్వామి ఆలయానికి వచ్చి, మొక్కుకుని, సంతానం కలిగాక, తమ పిల్లలతో బాటుఒక కోడె దూడనూ ఆలయం చుట్టు తిప్పి ముందున్న స్తంభానికి కడతారు. దీనినే కోడె మొక్కు అంటారు. స్వామివారికి నైవేద్యంగా భక్తులు బెల్లాన్ని సమర్పించడం, గండదీపాన్ని వెలిగించే సంప్రదాయమూ ఇక్కడ కనిపిస్తుంది.
మరెక్కడాలేని మరో ఆచారం ఇక్కడ ఒకటి ఉంది. నయం కాని రోగాల బారిన పడిన, కోలుకోలేని కష్టాల బారిన పడిన కొందరు భక్తులు తమ సమస్య తీరితే.. అన్ని బాధ్యతలను వదిలేసి ఆది బిక్షువైన ఆ శివయ్య మాదిరిగా జీవితాంతం భిక్షాటన చేసుకుంటూ, స్వామి నామస్మరణలో మిగిలిన జీవితాన్ని గడిపేసే సంప్రదాయమూ ఉంది. నేటికీ ఈ విధానంలో జీవించే వేలాది మంది ఈ ప్రాంతంలో కనిపిస్తారు.
ఒక్క శివరాత్రి రోజున 3 లక్షలకు పైగా భక్తులు స్వామిని సేవించుకుంటారు. ఆ రాత్రి లింగోద్భవ కాలంలో 100 మంది అర్చకులు ఏక కంఠంతో చేసే వేద పఠనాలు, చేసే ఏకాదశ రుద్రాభిషేకం చూసి తీరాల్సిందే.