Aroori Ramesh Likely to Join BJP(Political news today telangana): తెలంగాణలో గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ పార్టీకి మరో షాక్ తగలనుంది. ఇప్పటికే పలువురు మాజీ ఎమ్మెల్యేలు, సిట్టింగ్ ఎంపీలు పార్టీకి గుడ్ బై చెప్పారు. తాజాగా వర్థన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ కారు పార్టీకి గుడ్ బై చెప్పనున్నట్లు సమాచారం. త్వరలో కమలం గూటికి చేరనున్నట్లు తెలుస్తోంది. వరంగల్ ఎంపీ టికెట్ కోసం కాషాయ కండువా కప్పుకోనున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి.
గత అసెంబ్లీ ఎన్నికల్లో వర్థన్నపేట నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ తరఫున పోటీ చేసిన ఆరూరి రమేశ్.. కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి కే ఆర్ నాగరాజు చేతిలో ఓటమి చవి చూశారు. 2014, 2018 ఎన్నికల్లో వర్థన్నపేట నుంచి పోటీ చేసిన ఆరూరి రమేశ్ రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 2018 ఎన్నికల్లో తెలంగాణ జన సమితి అభ్యర్ధిపై 99 వేల 240 ఓట్ల రికార్డు మెజార్టీతో ఘనవిజయం సాధించారు.
కాగా మొన్నటి ఎన్నికల్లో ఓటమి చవిచూసిన రమేశ్ వరంగల్ ఎంపీ సీటును ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ నుంచి తనకు ఆ సీటు రాదేమోనని కాషాయ గూటికి చేరనున్నట్లు సమాచారం. వరంగల్ ఎంపీ స్థానం ఎస్సీ రిజర్వుడు కావడంతో బీజేపీ తనకు ఆ సీటు ఇస్తుందనే ఆశాభావంతో పార్టీ మారతారని తెలుస్తోంది.
Read More: బీఆర్ఎస్ అభ్యర్థుల తొలి జాబితా విడుదల.. ఇద్దరు పేర్లు ప్రకటించిన కేసీఆర్..
పార్టీ మారుతున్న సమాచారం రావడంతో గులాబీ నేతలు అలెర్టయ్యారు. రమేశ్ను బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారు. ముందుగా ఆ పనిని స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరికి ఇచ్చినట్లు సమాచారం. కడియం అందుకు సుముఖంగా లేకపోవడంతో రమేశ్ను బుజ్జగించడానికి కారు పార్టీ.. ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్యను రంగంలోకి దించిందని తెలుస్తోంది.
సారయ్య బుజ్జగించినా ఫలితం దక్కలేదని సమాచారం. పార్టీలో తగిన ప్రాధాన్యత లేదని, పార్టీని వీడేందుకే రమేశ్ మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. తాజాగా వర్దన్నపేట మున్సిపాలిటీకి చెందిన 15 మంది బీఆర్ఎస్ కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీలో చేరారు. దీంతో వర్థన్నపేటతో పాటు ఉమ్మడి వరంగల్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి వరుస షాక్లు తగులుతున్నాయి.