ED Raids: వంద, రెండు వందలు కాదు.. ఏకంగా 750 కోట్ల స్కాం. గ్రానైట్ కేసులో సంచలన విషయాలు బయటకి వస్తున్నాయి. ఈడీ దాడులతో గ్రానైట్ మోసాల గుట్టు రట్టవుతోంది. ఎలాంటి లెక్కాపత్రం లేకుండా విదేశాలకు పెద్ద ఎత్తున గ్రానైట్ ఎగుమతి చేశారని తేల్చింది. ఈ దందాలో చైనా కంపెనీలదే కీ రోల్ కావడంతో మరింత లోతుగా దర్యాప్తు చేస్తోంది ఈడీ.
తెలంగాణలో కలకలం రేపిన గ్రానైట్ కంపెనీలపై ఈడీ దాడుల కేసులో.. కోటి 8 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు అధికారులు. రాష్ట్రంలో వివిధ గ్రానైట్ కంపెనీల్లో రెండు రోజుల పాటు తనిఖీలు జరిగాయి. శ్వేత గ్రానైట్స్, శ్వేత ఏజెన్సీస్, శ్రీవెంకటేశ్వర గ్రానైట్స్ ప్రైవేటు లిమిటెడ్, పీఎస్ఆర్ గ్రానైట్స్, అరవింద్ గ్రానైట్స్, గిరిరాజ్ షిప్పింగ్ ఏజెన్సీలలో సోదాలు జరిగాయి. గడిచిన పదేళ్లలో ఆయా కంపెనీల గ్రానైట్ ఎగుమతి, విదేశీ మారకం తదితర వివరాలను పరిశీలించారు. పెద్ద ఎత్తున హవాలా లావాదేవీలు జరిగినట్టు గుర్తించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన ఈ గ్రానైట్ కంపెనీలు రాయల్టీ, సీనరేజీ ఫీజు, పెనాల్టీని ఎగవేసినట్టు ఈడీ గుర్తించింది. దాదాపు 750 కోట్ల మేర ఫ్రాడ్ జరిగినట్టు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ఆ మేరకు కొన్ని రికార్డులు సీజ్ చేశారు.
గ్రానైట్ కంపెనీలు.. చైనా, హాంకాంగ్ దేశాల కంపెనీలతో భారీ బిజినెస్ చేసినట్టు తెలుస్తోంది. కరీంనగర్ నుంచి విశాఖ, కాకినాడ మీదుగా ఓడరేవులు, రైళ్ల ద్వారా ఆ రెండు దేశాలకు భారీగా ఎగుమతులు చేశారని.. రికార్డుల్లో మాత్రం తక్కువ చూపించారని ఈడీ గుర్తించింది. పనామా లీక్స్ లో ప్రమేయం ఉన్న చైనాకు చెందిన లీవెన్ హ్యూ అనే వ్యాపారి నుంచి ఇక్కడి గ్రానైట్ కంపెనీలకు పెద్ద ఎత్తున నగదు బదిలీ జరిగిందని ఈడీ తెలిపింది. అయితే, చైనా నుంచి వచ్చే నగదును నేరుగా కంపెనీ ఖాతాల్లోకి కాకుండా.. ఉద్యోగుల పేర్లతో బినామీ అకౌంట్లు క్రియేట్ చేసి అందులో డిపాజిట్ చేయించారని ఈడీ తనిఖీల్లో వెల్లడైంది. గ్రానైట్ కంపెనీలు ఫెమా నిబంధనలను ఉల్లంఘించినట్టు ప్రాథమికంగా గుర్తించామని.. దర్యాప్తు ఇంకా కొనసాగుతోందని ఈడీ తెలిపింది. ఇప్పటికే పీఎస్ఆర్ గ్రానైట్స్ అధినేత పాలకుర్తి శ్రీధర్ను ఈడీ ప్రశ్నించగా.. ఈ నెల 18న మిగతా కంపెనీల యజమానులు రావాల్సిందిగా నోటీసులు జారీ చేశారు ఈడీ అధికారులు.