Kantakapalli Train Accident : గతేడాది విజయనగరం జిల్లా కంటకాపల్లి జంక్షన్ వద్ద రెండు రైళ్లు ఢీ కొన్న ప్రమాద ఘటనకు అసలు కారణమేంటో రైల్వే మంత్రి అశ్వనీ వైష్ణవ్ శనివారం వెల్లడించారు. లోకో పైలట్, అసిస్టెంట్ లోకో పైలట్ కలిసి మొబైల్ లో క్రికెట్ చూస్తూ రైలును నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని తెలిపారాయన. రైల్వేశాఖలో ప్రయాణికుల భద్రత కోసం తీసుకుంటున్న చర్యలను గురించి వివరించిన అశ్వినీ వైష్ణవ్.. కంటకాపల్లి రైలు ప్రమాద ఘటన గురించి ప్రస్తావించారు. ఈ సందర్భంగా ప్రమాదానికి గల కారణాలను ఆయన వెల్లడించారు.
లోకోపైలట్ల నిర్లక్ష్యమే 14 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోవడానికి కారణమైందన్నారు. ట్రైన్ డ్రైవింగ్ పై దృష్టి పెట్టకుండా.. మొబైల్ లో క్రికెట్ చూస్తూ ఉండిపోవడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు తెలిపారు. ఈ ప్రమాదానికి కారణమైన వారిద్దరిపై చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు.
Read More : తిరుపతిలో దారుణం.. యువతిపై ప్రేమోన్మాది దాడి..
అక్టోబర్ 29, 2023లో విజయనగరం జిల్లా కంటకాపల్లి వద్ద రాయగడ ప్యాసింజర్ సిగ్నల్ కోసం ఆగి ఉండగా.. వెనుక నుంచి వచ్చిన విశాఖ-పలాస ప్యాసింజర్ రాయగడ ప్యాసింజర్ ను బలంగా ఢీ కొట్టింది. ఈ ఘటనలో 14 మంది మరణించగా 50 మంది వరకూ గాయపడ్డారు. ఈ ప్రమాదానికి కారణం సిగ్నలింగ్ వ్యవస్థ కాదని, మానవ తప్పిదమే కారణమని కమిషన్ ఆఫ్ రైల్వే సేఫ్టీ అధికారులు చేసిన దర్యాప్తులో తేలింది. దీనిపై రైల్వే బోర్డుకు నివేదిక అందజేయగా.. ఇద్దరు లోకో పైలట్లపై చర్యలు తీసుకున్నారు.