Telangana Weather Alert : మార్చి మొదలైందో లేదో.. ఎండలు మంట పుట్టిస్తున్నాయి. మార్చి మొదటి వారంలోనే వేడి, ఉక్కపోత పెరిగాయి. ఏసీలు, కూలర్లకు డిమాండ్ పెరిగింది. ఇళ్లల్లో ఏసీలు, కూలర్లు, సీలింగ్ ఫ్యాన్లు నిర్విరామంగా తిరుగుతూనే ఉంటున్నాయి. ఫలితంగా విద్యుత్ వినియోగం పెరిగింది. వేసవి వస్తుందంటేనే ప్రజల గుండెల్లో దడ పుడుతోంది. మున్ముందు వేసవి తీవ్రతను తలుచుకుంటేనే చెమటలు పడుతున్నాయి. అధిక వేడి, ఉక్కపోతతో ఎలా వేసవిని దాటాలా అని కంగారు పడుతున్నారు. మార్చి మొదలై మూడ్రోజులైనా కాకుండానే.. రాష్ట్రంలోని సగం జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 37 డిగ్రీల సెల్సియస్ దాటగా.. అత్యధికంగా సిద్ధిపేట, ములుగు, వనపర్తి జిల్లాల్లో 39 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.
Read More : ముక్కు, గొంతు, చెవులు.. ఆరోగ్యంగా ఉండాలంటే ఇవి పాటించండి!
ఇక జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రం, సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్, ఖమ్మం జిల్లా మధిర, నిజామాబాద్ జిల్లా జక్రాన్ పల్లి, ములుగు జిల్లా తాడ్వాయి మండలాల్లో 38.9, భద్రాద్రి జిల్లా పాల్వంచ మండలంలో 38.7 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదైనట్లు తెలిపారు. పగటి ఉష్ణోగ్రతలు అధికంగా ఉన్నా.. రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణంగా నమోదవుతున్నాయి. అయినప్పటికీ ఇంట్లో ఫ్యాన్ లేకపోతే ఇప్పుడు కునుకు పట్టని పరిస్థితి ఉంది. ఇక మున్ముందు ఈ ఎండల తీవ్రత ఎలా ఉంటుందో చూడాలి.
వేసవి తాపం దృష్ట్యా ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు కోరారు. పిల్లలు, వృద్ధులను అత్యవసరమైతే తప్ప బయటకు తీసుకెళ్లొద్దని సూచించారు. అలాగే రోజుకు 5-6 లీటర్ల నీరు తాగాలి. ముఖ్యంగా శీతల పానీయాల జోలికి వెళ్లొద్దు. పిల్లలకు కూడా కూల్ డ్రింక్స్ అలవాటు చేయకపోవడం మంచిది. వీలైనంత వరకూ మట్టికుండలో నీటిని తాగండి. చలువ చేసే కూరగాయలు, ఇతర పండ్లు, ఆహార పదార్థాలను తీసుకోండి.