Malkajgiri Parliament Constituency: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఊహించని ఫలితాలు వచ్చిన నియోజకవర్గాల్లో హుజూరాబాద్ ఒకటి. ఓటమి ఎరుగని ఈటల రాజేందర్ పాడి కౌశిక్రెడ్డి చేతిలో ఓటమిపాలయ్యారు. గజ్వేల్లో కేసీఆర్పై పోటీ చేసి అక్కడా అపజయం పొందారు. అలాంటి నేతకు బీజేపీ మళ్లీ ఛాన్స్ ఇచ్చింది. అది కూడా మల్కాజ్గిరి లాంటి తనకు సంబంధం లేని నియోజకవర్గం. మల్కాజ్గిరి నియోజకవర్గం దేశంలోనే అతిపెద్ద సెగ్మెంట్. అక్కడి నుంచి పోటీకి చాలామంది క్యూలైన్లో ఉన్నా.. వారందరినీ కాదని.. ఈటలకు ఎందుకు ఇచ్చారు? ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకునే ముందు.. రేసులో ఈటల కాకుండా ఎవరెవ్వరూ ఉన్నారో చూద్దాం.
మల్కాజ్గిరి టికెట్కు బీజేపీలో తొలినుంచి భారీ పోటీ ఉంది. ఆ రేసులో ఫస్ట్ ఉన్నారు జాతీయ నేత మురళీధర్రావు. ఆ తర్వాత మాజీ ఎమ్మెల్సీ రాంచంద్రరావు, విద్యాసంస్థల అధినేత మల్క కొమరయ్య. మల్కాజ్గిరి ఎంపీ సీటు ఆశించే మల్క కొమరయ్య బీజేపీలో చేరారు. కొద్దిరోజుల ముందు వరకు ఈటల పోటీలో ఉంటారనే ప్రచారమే లేదు. అనూహ్యంగా మల్కాజ్గిరి సీటులో ఈటల పేరును ఫస్ట్ లిస్ట్లోనే ప్రకటించింది జాతీయ నాయకత్వం.
Read More : తెలంగాణ నుంచి బీజేపీ అభ్యర్థులు వీరే..
ఈటల రాజేందర్.. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో రెండు చోట్ల ఓడిపోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ముదిరాజ్ సామాజికవర్గానికి చెందిన ఈటల 2014, 2019లోనూ మంత్రిగా పనిచేశారు. అందరికీ తెలిసిన వ్యక్తి.. పైగా వివాదరహితుడుగా పేరు ఉంది. అందుకే ఆయన్ను మల్కాజ్గిరి సీటుకు ఎంపిక చేశారు. రెండు చోట్ల ఓటమిపాలైన వ్యక్తికి కాస్తో కూస్తో సింపతి ఉంటుందనేది బీజేపీ ప్లాన్గా తెలుస్తోంది.
మల్కాజ్గిరి సీటు కాంగ్రెస్ కంచుకోట అని చెప్పుకోవచ్చు. 2009 డీలిమిటేషన్లో భాగంగా ఏర్పాటైన నియోజకవర్గంలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. 2009లో కాంగ్రెస్ అభ్యర్థి సర్వే సత్యనారాయణ, 2019 రేవంత్రెడ్డి ఇక్కడి నుంచే విజయఢంకా మోగించారు. తెలంగాణ ఏర్పాటైన 2014లో మాత్రం టీడీపీ నుంచి మల్లారెడ్డి గెలిచారు. ఆతర్వాత ఆయన బీఆర్ఎస్లోకి జంప్ అయ్యాడు.
ఈసారి మల్కాజ్ గిరి సెగ్మెంట్ లో పోటీ మాములుగా ఉండదు. ఎందుకంటే ఈటల బలమైన వ్యక్తి కావడంతో ఇతర పార్టీలు కూడా అంతే రేంజ్ ఉన్న క్యాండిడేట్స్ ను బరిలోకి దింపుతాయి. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ సిట్టింగ్ సీటును ఎట్టిపరిస్థితుల్లో చేజారిపోకుండా చూసుకుంటుంది. అదే టైంలో కనీసం పోటీలో నిలిచేందుకు బీఆర్ఎస్ కూడా గట్టి అభ్యర్థి కోసం వెతుకులాట ప్రారంభించిదట.
Read More : మేడిగడ్డ పాపం.. కాళేశ్వరం తెలంగాణకు వరమా? శాపమా?
మరోవైపు మల్కాజ్ గిరి సీటు తర్వాత ఎక్కువగా డిమాండ్లు వచ్చిన సెగ్మెంట్లు జహీరాబాద్, భువనగిరి. ఈ స్థానాల్లో పోటీకి బీజేపీ నుంచి పోటీలో ప్రముఖులు నిలుస్తారని అంతా ఊహించారు. భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి జలవనరుల శాఖలో సలహాదారునిగా పనిచేస్తున్న వెదిరె శ్రీరామ్ పేరు బాగానే వినిపించింది. కానీ అతన్ని కాదని.. గతంలో ఎంపీగా పనిచేసిన బూర నర్సయ్యగౌడ్ కే కమలం పార్టీ టికెట్ కేటాయించింది.
జహీరాబాద్ సెగ్మెంటులో మాత్రం సిట్టింగ్ ఎంపీగా ఉన్న బీబీ పాటిల్ బీజేపీలో చేరడంతో టికెట్ అతన్నే వరించింది. 2014, 2019లో రెండు సార్లు ఆయన జహీరాబాద్ నుంచి విజయం సాధించాడు. జహీరాబాద్ సీటు కోసం గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ తో పాటు ప్రముఖ నిర్మాత దిల్ రాజు ప్రయత్నించినట్టు తెలుస్తోంది. సర్వే రిపోర్టు ఆధారంగానే వారిద్దరినీ కాదని.. బీబీ పాటిల్ కు సీటు ఇచ్చినట్టు అర్థమవుతోంది.