Learn Here Sri Aditya Hrudayam: రామ రావణ సంగ్రామం అత్యంత భీకరంగా జరుగుతోంది. కానీ.. ఎంత ప్రయత్నించినా రామచంద్రుడు రావణాసురుడిని ఓడించలేకపోతున్నాడు. ఒకవైపు శరీరం అలసి పోతోంది. మరోవైపు తనను నమ్ముకుని వచ్చిన వానర సేనలు రావణుడి సేనల చేతిలో అన్యాయంగా బలి అయిపోతున్నాయనే అపరాధ భావన ఆయన మనసును కుదిపేస్తోంది. ఇక.. రాముడు వేసిన అస్త్రాలన్నీ రావణుడిని ఏమీచేయలేక నేలరాలిపోతున్నాయి. నాటి వరకు ఏనాడూ ఇలాంటి పరిస్థితి ఎదురుకాని రామచంద్రుడు దీనికి కారణమేమిటో అర్థంకాక సతమతమైపోతున్నాడు. రాముడి మనసులో క్రమంగా యుద్ధం పట్ల విముఖత ఏర్పడుతోంది.
మరోవైపు తన శిష్యుడైన రామచంద్రుడు చేస్తున్న అద్భుతమైన యుద్ధాన్ని ప్రత్యక్షంగా చూసేందుకు కుల గురువైన వశిష్టుడు, దేవతా గణాలతో సహా యుద్ధభూమికి వచ్చి ఇదంతా గమనించాడు. అప్పటి వరకు తనను తాను కేవలం మానవుడినే అనుకుంటున్న తన శిష్యుడైన రాముడిలో ఉన్న విష్ణు చైతన్యాన్ని తట్టి లేపితే తప్ప రావణ వధ సాధ్యం కాదని వశిష్టుడికి అర్థమైంది.
ఆ రోజు యుద్ధం పూర్తికాగానే.. వశిష్టుడు రాముడి వద్దకు వచ్చి.. ‘రామా..! నీకు మహిమాన్వితమైన ఆదిత్య హ ఒక మంత్రాన్ని నేను ఉపదేశిస్తాను. దీనిని 3 సార్లు పఠిస్తే.. అత్యంత సులభంగా నీవు రావణుడిని సంహరించగలవు’ అని ఆదిత్య హృదయాన్ని బోధించాడు. తర్వాత గురువు సూచించిన ప్రకారమే.. రాముడు.. దానిని పఠించటం, వెంటనే సూర్యభగవానుడు ప్రత్యక్షమై రాముడికి దివ్యశక్తిని ప్రసాదించటం, ఆ ద్విగుణీకృతమైన శక్తితో రాముడు రావణుడిని అనాయాసంగా వధించటం జరిగిపోయాయి.
Read more: ‘గోవిందా’ అనే పేరు వెనక కథ తెలుసా?
నాటి నుంచి ఆరోగ్యం, విజయం కోరుకునే వారికి ఆదిత్య హృదయం నిత్య పారాయణా స్త్రోత్రంగా మారిపోయింది. రోజూ దీనిని పారాయణ చేయలేని వారు కనీసం ఆదివారం రోజునైనా దీనిని పారాయణ చేయాలని, ముఖ్యంగా జాతకంలో రవి బలహీనంగా ఉన్నవారు దీనిని పారాయణం చేయటం వల్ల జాతకదోషాలు తొలగిపోతాయి.
ఎవరి జాతకంలోనైనా రవి బలహీనంగా ఉంటే.. వారు తరచూ అనారోగ్యం పాలవటం, ఉద్యోగులైతే పై అధికారుల వేధింపులకు గురికావటం, కంటి రోగాలు, గుండె జబ్బుల బారిన పడుతుంటారు. వీరు ఆదిత్య హృదయ పారాయణ చేయటం వల్ల ఈ సమస్యలు తగ్గిపోతాయి. అలాగే.. తరచూ తండ్రి తరపు బంధువులతో వివాదాలతో విసిగిపోయిన వారు, ఏదైనా సాధించాలనే పట్టుదల, కసి లేనివారు, ఆత్మ విశ్వాసాన్ని కోల్పోయి నిరంతరం భయపడుతూ ఉండేవారు రోజూ దీనిని పారాయణం చేయటం వల్ల అద్భుతమైన ఫలితాలను పొందుతారు.
ముఖ్యంగా ఆదివారం రోజున వేకువనే లేచి, తలస్నానం చేసి, సూర్యోదయ సమయానికి తూర్పు ముఖంగా నిలిచి నమస్కరించి, ఆదిత్య హృదయం పారాయణ చేసి, గోధుమ రవ్వతో చేసిన పాయసాన్ని స్వామికి నివేదన చేస్తే.. అఖండమైన విజయాలు, మంచి ఆరోగ్యం సిద్ధిస్తాయి.