Congress Himachal Crisis: కనీసం తొమ్మిది మంది పార్టీ శాసనసభ్యులు తమతో సంప్రదింపులు జరుపుతున్నారని అనర్హత వేటు పడిన కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజిందర్ రాణా స్పష్టం చేశారు.
కొంతమంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ శిబిరానికి తిరిగి రావాలనుకుంటున్నారని హిమాచల్ సీఎం సుఖ్విందర్ సింగ్ సుఖూ చేసిన వాదనలను రాణా కొట్టిపారేశారు. సుఖూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రకటనలు చేస్తున్నారని రాణా ఆరోపించారు.
రాజ్యసభ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ చేసిన ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలలో రాజిందర్ రాణా కూడా ఒకరు. ఆ తర్వాత స్పీకర్ రాణాపై అనర్హత వేటు వేశారు. కాంగ్రెస్ సభ్యుల క్రాస్ ఓటింగ్తో ఈ ఎన్నికల్లో బీజేపీ ఒక సీటును కైవసం చేసుకుంది.
క్రాస్ ఓటింగ్ నిర్ణయాన్ని రాణా సమర్థించుకుంటూ తాము హిమాచల్ ప్రదేశ్ ప్రజల గౌరవాన్ని నిలబెట్టడానికే ఈ నిర్ణయం తీసుకున్నామని స్పష్టం చేశారు. హిమాచల్ప్రదేశ్ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించే అభ్యర్థులెవరూ రాష్ట్రంలో కాంగ్రెస్కు లేరా అని రాణా ప్రశ్నించారు.
తమ నిర్ణయం వ్యక్తిగతమైనదని, మరొక బహిష్కృత కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇందర్ దత్ లఖన్పాల్ పేర్కొన్నారు. లఖన్పాల్ మాట్లాడుతూ, “కొందరు ఇప్పుడు మమ్మల్ని తిరుగుబాటుదారులు లేదా దేశద్రోహులు అంటారు. కానీ మేము కాదు. మేము మా మనస్సాక్షి ప్రకారం నడుచుకున్నాము. ఇది మా వ్యక్తిగత నిర్ణయం” అని అన్నారు.
హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం కూలిపోయే ప్రమాదం ఉందని బీజేపీ పేర్కొంది. అయితే ఈ భావనను ముఖ్యమంత్రి సుఖూ తోసిపుచ్చారు.
Read More: ప్రమాదంలో హిమాచల్ సర్కారు..!
మరోవైపు సుఖూ, “కాంగ్రెస్లో 80 శాతం శాసనసభ్యులు కలిసి ఉన్నారు. చిన్న విషయాలకు పార్టీలో అసమ్మతిని ఆపాదించారు. సమన్వయ కమిటీ ఏర్పాటు చేస్తే పరిస్థితి చక్కబడుతుంది” అని అన్నారు. అనర్హత వేటు పడిన ఎమ్మెల్యేలతో చర్చలు జరపాలని ఉద్ఘాటించారు.
రాబోయే లోక్సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని, గత 14 నెలలుగా రాష్ట్రంలో నిజాయితీ, పారదర్శక పాలన అందించడానికి కాంగ్రెస్ కట్టుబడి ఉందని, సమన్వయ కమిటీ ఏర్పాటుతో పరిస్థితి మెరుగుపడుతుందని సుఖూ విశ్వాసం వ్యక్తం చేశారు.
అనర్హత వేటు పడిన ఎమ్మెల్యేలలో సుధీర్ శర్మ, రవి ఠాకూర్, రాజిందర్ రాణా, ఇందర్ దత్ లఖన్పాల్, చైతన్య శర్మ, దేవిందర్ కుమార్ భుట్టో ఉన్నారు.
బడ్జెట్పై ఓటింగ్కు దూరంగా ఉన్న ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ కుల్దీప్ సింగ్ పఠానియా చర్యలు తీసుకున్నారు. పార్టీ విప్ను దిక్కరించినందుకు స్పీకర్ ఈ చర్యను చేపట్టారు. స్పీకర్ నిర్ణయంపై అనర్హత వేటు పడిన ఎమ్మెల్యేలు సుప్రీంకోర్టులో అప్పీల్ చేయనున్నట్టు ప్రకటించారు.