Mahashivratri special, famous Shaiva Kshetrali in Telangana: లోకాలన్నింటిని ఏలేవాడు భోళా శంకరుడు. మహాశివుడికి ఎంతో ఇష్టమైన రోజు మహాశివరాత్రి. ఈ పర్వదినాన శివభక్తులు అత్యంత భక్తి శ్రధ్ధలతో రాత్రంతా జాగారం చేస్తూ శివనామాన్ని స్మరిస్తుంటారు. భోళా శంకరుడిని ప్రసన్నం చేసుకునేందుకు, అనుకున్న కోరికలు తీరేందుకు భక్తులు ఉపవాస ధీక్షలు చేస్తుంటారు. అన్ని శైవక్షేత్రాల్లో అంగరంగ వైభవంగా ఉత్సవాలను చేస్తారు. తెలంగాణలో ఎన్నో శైవక్షేత్రాలు ఉన్నాయి. అందులో కొన్నింటి గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.
కీసరగుట్ట
కీసరగుట్ట ఇది హైదరాబాద్కి ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ రామలింగేశ్వర స్వామి భవానీసమేతుడై కొలువుదీరాడు. ఈ క్షేత్రం గురించి ఒక కథ ప్రచారంలో ఉంది. శ్రీరాముడు, సీత, ఆంజనేయుడు పరవశించి పోయి శివలింగాన్ని ప్రతిష్టించాలని అనుకున్నారు. అందుకోసం శ్రీరాముడు వారణాసి నుంచి లింగాన్ని తీసుకురమ్మని ఆంజనేయుడిని ఆజ్ఞాపించాడు.
అయితే ఆంజనేయుడు సరైన లింగాన్ని ఎంచుకోలేక 101 శివలింగాలను తీసుకొచ్చాడని.. కానీ.. అప్పటికే ముహూర్తం దాటిపోవడంతో స్వయంగా శివుడే ప్రత్యక్షమై లింగాన్ని రాముడికి ఇచ్చాడు. హనుమంతుడు వచ్చే సరికి లింగ ప్రతిష్ట పూర్తవుతుంది. తాను తెచ్చిన లింగాలను ప్రతిష్టించలేదన్న కోపంతో లింగాలన్నింటిని చెల్లాచెదురుగా ఆంజనేయుడు విసిరివేశాడు. దాంతో కీసర గుట్ట పరిసరాల్లో లింగాలు అన్ని చెల్లాచెదురుగా పడిపోయాయని ఇక్కడి భక్తులు చెబుతుంటారు.
కాళేశ్వరం
కాళేశ్వరం జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఉంది. హైదరాబాద్కి 200 కి.మీ దూరంలో ఉంది. దేశంలో ఎక్కడాలేని విధంగా ఒకే పానవట్టంపై రెండు లింగాలు ఉండటం కాళేశ్వరం ప్రత్యేకత. పురాణాల్లో కూడా ఈ క్షేత్ర ప్రస్తావన ఉంది. ఆలయంలో మొదట కాళేశ్వరుడిని యముడు పూజించి తర్వాత ముక్తేశ్వరుడిని శివుడు పూజిస్తే స్వర్గలోక ప్రాప్తి కలుగుతుందని భక్తుల నమ్మకం. ముక్తేశ్వర స్వామిని దర్శించుకున్న భక్తులందరికి స్వామి ముక్తిని ప్రసాదించడంతో అందరి పాపాలు తొలగిపోయి యముడికి పని లేకుండా పొయిందని.. దీంతో యముడు శివుడితో మొరపెట్టుకున్నాడంట.
అప్పుడు శివుడు తన పక్కనే యముడిని కూడా లింగాకారంలో కొలువుదీరమని చెప్పాడట. అందుకే లింగాకారంలో ఉన్న యముడిని పూజించకుండా వెళ్లేవారికి ముక్తి కలుగదని చెబుతుంటారు. మరో విశేషం ఏంటంటే ఇక్కడి లింగంలో రెండు రంధ్రాలు ఉంటాయి. వీటిలో నీరు పోస్తే ఆలయానికి దగ్గరలో ఉన్న గోదావరి, ప్రాణహిత సంగమంలో కలుస్తాయట.
కొమురవెల్లి మల్లన్న
కొమురవెల్లి మల్లన్న ఈ మహాక్షేత్రం సిద్దిపేట జిల్లాలో ఉంది. ఇక్కడ ప్రతి శివరాత్రి రోజు ఉత్సవాలును ఘనంగా నిర్వహిస్తారు. ఈ ఆలయంలో మల్లిఖార్జునస్వామి విగ్రహాన్ని పుట్టమన్నుతో చేశారు. అది కూడా 500 ఏళ్ల క్రితం చేసినదిగా ప్రసిద్ది. అయినా నేటికి చెక్కుచెదరకుండా ఉంది. అంతేకాదు స్వామి విగ్రహంలో నాభి వద్ద పుట్టు లింగం ఉందని ఇక్కడికి వచ్చే భక్తులు చెబుతుంటారు. యాదవుల ఆడపడుచు గొల్ల కేతమ్మను లింగ బలిజల ఆడపడుచు బలిజ మేడమ్మను మల్లన్నస్వామి పెళ్లి చేసుకున్నారు.
అందుకే స్వామికి ఇరువైపులా గొల్లకేతమ్మ, బలిజ మేడమ్మ విగ్రహాలు ప్రతిష్టించారని భక్తులు చెబుతుంటారు. ఇక్కడ ఏటా సంక్రాంతికి మొదలయ్యే ఉత్సవాలు ఉగాది వరకూ సాగుతాయి. అందులో భాగంగా నిర్వహించే పట్నంవారు ఉత్సవాలకు లక్షలాది మంది భక్తులు వస్తుంటారు. ఆలయంలో శివరాత్రి రోజు ప్రత్యేక పూజలు జరుగుతాయి. కొమురవెల్లి మల్లన్న స్వామిని దర్శించుకునేందుకు యేటా భక్తులు పోటెత్తుతారు.