Psycho Lover Attack on Woman(ap news today telugu): మహిళలపై దారుణాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఒంటరి మహిళ కనిపించడమే పాపమైపోతుంది. అంతులేని కోరికలతో.. మగాళ్ల రూపంలో తిరుగుతున్న కామాంధులు రెచ్చిపోతున్నారు. తాజాగా తిరుపతిలో నిన్న అర్థరాత్రి ఓ ప్రేమోన్మాది రెచ్చిపోయాడు.
తన ప్రేమను అంగీకరించలేదని ఒక యువతిపై కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు. చంద్రగిరిలోని ఆర్ఎఫ్ రోడ్ లో కలకలం సృష్టించిన ఈ ఘటనలో గాయపడిన యువతి.. తిరుపతి రుయా ఆస్పత్రిలో ప్రాణాలతో పోరాడుతోంది. అర్థరాత్రి ఇంట్లోకి ప్రవేశించిన మహేష్ అనే ప్రేమోన్మాది ఆ యువతిపై కత్తితో దాడి చేశాడు. ఆమె ఛాతి, ఎడమ చేతిపై కత్తిగాయాలు కావడంతో తీవ్రంగా రక్తస్రావమైంది. స్థానికులు అప్రమత్తం కావడంతో నిందితుడు అక్కడ నుంచి పారిపోయాడు. బాధితురాలిని 108 అంబులెన్సులో వెంటనే రుయా ఆస్పత్రికి తరలించి పోలీసులకు సమాచారం ఇచ్చారు.
Read More : తెలుగు రాష్ట్రాల్లో పెరగనున్న ఉష్టోగ్రతలు.. ఐఎండీ హెచ్చరిక..
నర్సింగ్ కోర్స్ పూర్తి చేసిన యువతి ఏడాది క్రితం తిరుపతిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరింది. ఈ క్రమంలో పక్కింట్లో అద్దెకు ఉండే పిడతల కృష్ణయ్య కుమారుడు మహేష్తో పరిచయం ఏర్పడింది. ఇద్దరి మధ్య కొన్నాళ్లు ఫోన్ లో సంభాషణలు నడిచాయి. మహేష్ చెడు వ్యసనాల గురించి తెలుసుకున్న ఆ యువతి అతిడిని దూరం పెట్టింది. దీంతో ఆమెపై కక్ష పెంచుకున్న మహేష్ ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు.
చిన్నప్పుడే తల్లిదండ్రులను కోల్పోయిన యువతి అమ్మమ్మ మంగమ్మ వద్ద ఉంటోంది. నెలన్నర క్రితం కూడా మహేష్ యువతి ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించి యువతితోపాటు ఆమె అమ్మమ్మపై కూడా దాడిచేసి కొట్టాడు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ ఘటన అనంతరం యువతి పెద్దమ్మ వచ్చి ఆమెను చెన్నై తీసుకెళ్ళింది. గురువారం రాత్రి చంద్రగిరి చేరుకున్న యువతి గురించి ఆరా తీసిన మహేష్ ఈ దాడికి పాల్పడ్డాడు. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.