AP Politics: ఏపీలో అధికార వైసీపీకి వరుస షాక్లు తగులుతున్నాయి. మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు సమక్షంలో పార్టీలో చేరిన కొద్దిసేపటికే రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సైకిలెక్కారు.
వసంత కృష్ణప్రసాద్ శనివారం ఉదయం హైదరాబాద్లోని చంద్రబాబు నివాసానికి చేరుకున్న ఆయనకు పార్టీ అధ్యక్షుడు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అటు వేమిరెడ్డి చేరిక తర్వాత చంద్రబాబు మాట్లాడుతూ నెల్లురు పార్లమెంటు ఇక మనదే అని తేల్చి చెప్పారు. ఆనం, కోటంరెడ్డిని జగన్ వేధించారని తెలిపారు. నెల్లూరు కార్పొరేషన్ ఖాళీ అవుతోందని స్పష్టం చేశారు.
వైసీపీ ఎమ్మెల్యేతో పాటు మైలవరంకు చెందిన ఎంపీపీ, 2 వైస్ ఎంపీపీలు, ఆరుగురు ఎంపీటీసీలు, పన్నెండు మంది సర్పంచ్లు, ఏడుగురు సొసైటీ ప్రెసిడెంట్లు, 4 కౌన్సిలర్లు టీడీపీలో చేరారు. గత కొంత కాలంగా పార్టీపై వసంత కృష్ణప్రసాద్ అసంతృప్తిగా ఉన్నారు.
టీడీపీలో చేరిన తర్వాత వసంత కృష్ణప్రసాద్ ఏపీ సీఎం జగన్పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. వ్యక్తిగత దూషణలు చేస్తేనే ఆ పార్టీలో టికెట్ ఇస్తారని లేదంటే టికెట్ రాదని మండిపడ్డారు. ప్రతిపక్షాలను తిడితే మంత్రి పదవులు ఇస్తారని లేదంటే పట్టించుకోరని అసహనం వ్యక్తం చేశారు. ఈ కారణాల వల్లే వైసీపీని వీడాల్సి వచ్చిందని వసంత కృష్ణప్రసాద్ స్పష్టం చేశారు.
Read More: ముగ్గురు ఇన్ఛార్జి లతో వైసీపీ 9వ లిస్ట్ విడుదల.. మంగళగిరిలో మళ్లీ మార్పు
ఇప్పటికే నెల్లూరు జిల్లా నుంచి ముగ్గురు వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. టీడీపీ ఆవిర్భావం నుంచి నెల్లూరులో సగం సీట్లు గెలిచిన దాఖలాలు లేవు. అయితే.. వీరి చేరికతో నెల్లూరు జిల్లా టీడీపీకి కంచుకోటగా మారే అవకాశాలు ఉన్నాయి. నెల్లూరులో ఎంపీ స్థానానికి ఇప్పటికే వైసీపీ ఇన్ఛార్జిని ప్రకటించింది. దీంతో నెల్లూరు ఎంపీ ఫైట్ విజయసాయిరెడ్డి వర్సెస్ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మధ్యే అని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
పల్నాడులో వైసీపీకి ఆ పార్టీ ముఖ్య నేతలు షాక్ ఇచ్చారు. ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి, మాజీ ఎమ్మెల్యే మల్లికార్జున రావు పసుపు కండువా కప్పుకోనున్నారు. నరసరావుపేట టీడీపీకి కంచుకోట. అయితే.. గత ఎన్నికల్లో జిల్లాలో 7 అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాన్ని వైసీపీ కైవసం చేసుకుంది. ఇప్పుడు కీలక నేతల చేరికతో జిల్లాలో టీడీపీ బలం పెరగనుంది.