Hyderabad – Karimnagar Elevated Carridors(Latest news in telangana): హైదరాబాద్ నుంచి ఉత్తర తెలంగాణ ఎలివేటెడ్ కారిడార్లకు మార్గం సుగమమైంది. హైదరాబాద్ – కరీంనగర్ రాజీవ్ రహదారితో పాటు హైదరాబాద్ – నాగ్ పూర్ జాతీయ రహదారిపై ఎలివేటేడ్ కారిడార్ నిర్మాణానికి కేంద్ర రక్షణ శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. హైదరాబాద్ లోని డిఫెన్స్ భూముల మీదుగా ఎలివేటేడ్ కారిడార్ల నిర్మాణానికి లైన్ క్లియర్ అయింది. జనవరి 5న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ను కలిసి డిఫెన్స్ భూముల మీదుగా ఎలివేటేడ్ కారిడార్ల నిర్మాణానికి అనుమతించాలని కోరారు. స్పందించిన కేంద్ర ప్రభుత్వం ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణానికై మార్చి1, శుక్రవారం అనుమతులు జారీ చేసింది.
హైదరాబాద్ నుంచి కరీంనగర్-రామగుండంను కలిపే రాజీవ్ రహదారిలో ప్యారడైజ్ జంక్షన్ నుంచి ఔటర్ రింగు రోడ్డు జంక్షన్ వరకు ఆరు లేన్ల ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం జరగనుంది. ఎంట్రీ, ఎగ్జిట్ ర్యాంపుల నిర్మాణానికి మొత్తం 11.30 కిలోమీటర్ల కారిడార్ నిర్మాణానికి 83 ఎకరాల భూమి అవసరమవుతుందని రక్షణ శాఖ మంత్రికి సీఎం కోరారు.
Read More : ఊహాగానాలకు స్పందించను.. పార్టీ ఏది చెబితే అది చేస్తా..
అటు.. నాగ్పూర్ హైవే పై కండ్లకోయ సమీపంలోని ప్యారడైజ్ జంక్షన్ నుంచి ఔటర్ రింగ్ రోడ్డు వరకు 18.30 కిలోమీటర్ల మేర ప్రతిపాదించారు. అందులో 12.68 కిలోమీటర్ల మేర ఆరు లేన్ల ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి, నాలుగు ప్రాంతాల్లో ఎగ్జిట్, ఎంట్రీలకు, భవిష్యత్తులో డబుల్ డెక్కర్ కారిడార్, ఇతర నిర్మాణాలకు 56 ఎకరాల రక్షణ శాఖ భూములు బదిలీ చేయాలని సీఎం రక్షణ శాఖ మంత్రిని కోరారు. ఈ కారిడార్లతో హైదరాబాద్ నుంచి శామీర్పేట్.. హైదరాబాద్ నుంచి మేడ్చల్ దిశగా ట్రాఫిక్ ఇబ్బందులు తొలగిపోనున్నాయి.
కేంద్రం ఇచ్చిన అనుమతులతో హైదరాబాద్ నుంచి ఉత్తర తెలంగాణ ప్రాంతాలకు రవాణా మార్గాల అభివృద్ధికి లైన్ క్లియర్ అయింది. అటు నిజామాబాద్, ఆదిలాబాద్.. ఇటు కరీంనగర్, రామగుండం వెళ్లేందుకు సికింద్రాబాద్ లో ఇబ్బందిగా మారుతున్న ట్రాఫిక్ సమస్య ఈ హైవేతో తగ్గనుంది. ఇక హైదరాబాద్ నుంచి శామీర్ పేట, హైదరాబాద్ నుంచి కండ్లకోయ వరకు ఎలివేటేడ్ కారిడార్ల నిర్మాణంతో గ్రేటర్ సిటీ ఉత్తర ప్రాంతంలో అభివృద్ధి పరుగులు తీయనుంది.
Read More : అంబానీ ప్రీ వెడ్డింగ్లో పాప్ సింగర్, రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..
గత ప్రభుత్వం కేంద్రంతో అనుసరించిన అహంకారపూరిత వైఖరితోనే ఎలివేటేడ్ కారిడార్ల అనుమతి ప్రక్రియ నిలిచిపోయింది. ఎనిమిదేండ్లుగా అపరిష్కృతంగా ఉన్న ఈ సమస్యకు పరిష్కారం లభించటం పట్ల ముఖ్యమంత్రి ఆనందం వ్యక్తం చేశారు. కేవలం 80 రోజుల కొత్త ప్రభుత్వం ఈ అనుమతులు సాధించటంపై రాష్ట్ర ప్రభుత్వంపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఢిల్లీకి వెళ్లినప్పుడల్లా రాష్ట్రానికి కావలసిన అవసరాల కోసం కేంద్ర మంత్రులను కలిసి సీఎం లేఖలు అందించిన విషయాన్ని గుర్తు చేశారు.
రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎవరినైనా ఎన్నిసార్లైనా కలిసేందుకు సిద్ధంగా ఉన్నామని సీఎం రేవంత్ అన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్రంతో సన్నిహిత, స్నేహ సంబంధాలను కొనసాగిస్తామని చెప్పారు. రాజకీయ పార్టీలు, వాటి సిద్ధాంతాలు ఏవైనా.. తెలంగాణ ప్రాంత ప్రయోజనాలే తమకు మొదటి ప్రాధాన్యమని సీఎం రేవంత్ రెడ్డి మరోసారి స్పష్టం చేశారు. కేంద్ర రక్షణ శాఖ సూచనల మేరకు అతి త్వరలోనే ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణ పనులను ప్రారంభిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్.. ప్రధాని మోడీ, రక్షణమంత్రి రాజ్నాథ్సింగ్ సహా రక్షణశాఖ అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.