Project War In Telangana(Telangana politics): తెలంగాణలో అధికార విపక్షాల మధ్య వార్ కాస్తా ప్రాజెక్ట్ వార్ గా తయారైంది. మేడిగడ్డకు ఒకరు, పాలమూరు రంగారెడ్డికి మరొకరు వెళ్లడం పొలిటికల్ గా హీటెక్కించింది. కాళేశ్వరం కుంగడంతో డిఫెన్స్ లో పడ్డ బీఆర్ఎస్ ఎదురుదాడికే సిద్ధమైంది. చిన్న రిపేర్లు చేస్తే ఉపయోగపడే ప్రాజెక్ట్ ను కావాలనే నిర్లక్ష్యం చేస్తున్నారని గులాబీ నేతలు ఆరోపిస్తే.. పాలమూరుపై కేసీఆర్ పగ పెంచుకుని ప్రాజెక్టులు పెండింగ్ పెట్టారని కాంగ్రెస్ ఫైర్ అయింది.
పార్టీల మధ్య వార్ కాస్తా ప్రాజెక్ట్ వార్ గా మారిపోయింది. తగ్గేదేలేదంటూ అధికార విపక్షాలు పోటాపోటీగా ప్రాజెక్టుల పర్యటనలకు వెళ్లాయి. కాళేశ్వరం ప్రాజెక్ట్ కుంగడంపై పదే పదే అధికార కాంగ్రెస్ విమర్శలు చేయడం, పలు దఫాలుగా మేడిగడ్డ వెళ్లి పవర్ పాయింట్ ప్రెజంటేషన్లు ఇవ్వడం, ప్రెస్ మీట్లు పెట్టడంతో ప్రతిపక్ష బీఆర్ఎస్ పూర్తిగా డిఫెన్స్ లో పడింది.
ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల్లో కాళేశ్వరం ఎఫెక్ట్ పూర్తిస్థాయిలో కనిపించింది. ఓటమి కారణాల్లో ఇదీ ఒకటిగా నిలిచింది. ఇప్పుడు వచ్చేవి పార్లమెంట్ ఎన్నికలు. ఇప్పుడు కూడా సైలెంట్ గా ఉంటే కాంగ్రెస్ తో మరింత డ్యామేజ్ తప్పదనుకున్నారో ఏమోగానీ.. చలో మేడిగడ్డ అంటూ బీఆర్ఎస్ బృందం అక్కడికి బయల్దేరి వెళ్లింది. దారి మధ్యలో అన్నీ అపశకునాలే అన్నట్లుగా మధ్యలో ఎమ్మెల్యేలు వెళ్తున్న బస్సు టైరు పేలింది. ప్రమాదం తప్పింది.
రాజకీయం కోసం రైతుల్ని గాలికొదిలేశారని మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపణలు చేశారు. చిన్న చిన్న రిపేర్లు చేస్తే కంప్లీట్ అయ్యే మేడిగడ్డను ప్రభుత్వం కావాలనే పక్కన పెడుతోందని విమర్శించారు. వర్షాకాలం వస్తే బ్యారేజ్ కొట్టుకుపోవాలని కాంగ్రెస్ సర్కార్ అనుకుంటోందని కూడా ఫైర్ అయ్యారు కేటీఆర్. బూతద్దంలో పెట్టి రాద్దాంతం చేస్తున్నారంటున్నారు.
మేడిగడ్డ బొందల గడ్డ అని చెప్పి.. బీఆర్ఎస్ నేతలు ఇప్పుడెందుకు వెళ్లారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. బస్సు టైర్లు పగిలిపోయాయని, ఇక కారు టైర్లు మిగిలిపోయాయని, ఆ కారు కూడా షెడ్డుకు పోవాల్సిందే అంటూ సెటైర్ వేశారు. ఎన్టీఎస్ఏ నిపుణుల కమిటీ వేయాలని కోరామని, కమిటీ ఏర్పాటును స్వాగతిస్తున్నామన్నారు. విజిలెన్స్ రిపోర్ట్ పై లీగల్ ఒపీనియన్ తీసుకుని చట్ట ప్రకారం కేసులు నమోదు చేస్తామంటున్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి.
కాళేశ్వరం, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పేరుతో తెలంగాణ ప్రజలను కేసీఆర్ నిలువు దోపిడీ చేశారని కాంగ్రెస్ మహబూబ్నగర్ ఎంపీ అభ్యర్థి వంశీచంద్ రెడ్డి ఆరోపిస్తున్నారు. కేసీఆర్ ధన దాహానికి కాళేశ్వరం కుంగిందన్నారు. మాజీ సీఎం బండారం బయట పెట్టేందుకే పాలమూరు ఎత్తిపోతలను సందర్శించామన్నారు. కృష్ణా జలాలను ఏపీకి ధారాదత్తం చేసి దక్షిణ తెలంగాణకు తీరని ద్రోహం చేశారని ఫైర్ అయ్యారు. ముఖ్యంగా కేసీఆర్ పాలమూరుపై పగ పెంచుకున్నారని విమర్శిస్తున్నారు.
Read More: సిరిసిల్లలో తేల్చుకుందాం.. కేటీఆర్కు మంత్రి కోమటిరెడ్డి సవాల్..
మరోవైపు కాళేశ్వరం కుంగుబాటుపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ప్రత్యేకంగా కమిటీని నియమించింది. రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తితో ఈ కమిటీ ఏర్పాటైంది. త్వరలోనే పూర్తిస్థాయి విచారణ జరపనుంది. 2023 అక్టోబరు 21న కుంగితే 25లోపు కేంద్రం ఏర్పాటు చేసిన కమిటీ క్షేత్రస్థాయిలో పర్యటించి 20 రకాల డేటా ఇవ్వాలని రాష్ట్రాన్ని కోరినా అసమగ్ర సమాచారం ఇచ్చారని, కేంద్ర జలశక్తి శాఖ సలహాదారు, నదుల అనుసంధాన టాస్క్ఫోర్స్ ఛైర్మన్ వెదిరె శ్రీరామ్ అన్నారు.
మేడిగడ్డ బ్యారేజీలో అన్ని రకాల లోపాలు ఉన్నట్లు అధ్యయనం సందర్భంగా ఎన్డీఎస్ఏ గుర్తించిందని చెప్పుకొచ్చారు. తెలంగాణలో నీటి అవసరాలు ఎక్కువగా ఉన్నా 2015లో కృష్ణా జలాల పంపకం సందర్భంగా నాటి కేసీఆర్ సర్కార్ 299 టీఎంసీలే ఎందుకు అడిగిందని ప్రశ్నించారు శ్రీరామ్. మేడిగడ్డ కట్టేటప్పుడు సర్వేలు చేయలేదని, థర్డ్ పార్టీ చెకింగ్స్ లేవని, అంతా గందరగోళమని అన్నారు.
మరోవైపు కనీసం నమూనాలు కూడా తీసుకోకుండా NDSA ఇచ్చిన రిపోర్ట్ రాజకీయ ప్రేరేపితమని బీఆర్ఎస్ కొట్టి పారేస్తోంది. మేడిగడ్డ గురించి వెదిరె శ్రీరామ్ కు ఏం తెలుసని ప్రశ్నిస్తున్నారు కేటీఆర్. ప్రాజెక్టుకు అనుమతి ఇచ్చిన వాళ్లు తెలివి తక్కువ వాళ్లా అని రివర్స్ లో వచ్చారు. మొత్తంగా ఈ జల వివాదాలు, ప్రాజెక్టుల నష్టాలపై పోరాటాలు ఇప్పట్లో సద్దుమణిగేలా కనిపించడం లేదు.