T20 World Cup: టీ 20 వరల్డ్ కప్ లో శ్రేయాస్, ఇషాన్ ఆడుతున్నారా ? లేదా? అనే ప్రశ్న అందరిలో ఉదయిస్తోంది. చాలామంది రకరకాలుగా మాట్లాడుతున్నారు. బీసీసీఐ కాంట్రాక్టు నుంచి పక్కన పెట్టాక ఇండియాకి ఆడగలరా? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. బీసీసీఐ కాంట్రాక్టులో ఉండటం వల్ల అనేక ఉపయోగాలున్నాయని అంటున్నారు. ఇది కోల్పోతే ఆర్థికంగా, ఆట పరంగా సవాళ్లు ఎదుర్కోవాల్సి ఉంటుందని అంటున్నారు.
కాంట్రాక్ట్ పొందిన ఆటగాళ్లు ఆడినా, ఆడకపోయినా బీసీసీఐ నుంచి ఏడాదికి ఇంత మొత్తమని ఇస్తారు. ఏ+ గ్రేడ్ ఆటగాళ్లకు ఏడాదికి రూ. 7 కోట్లు వస్తాయి. ఇప్పుడు శ్రేయాస్, ఇషాన్ కి ఏడాదికి కోటి రూపాయలు వచ్చేవి. అవి పోయాయి. అంతేకాదు వీరికి ఎలాంటి గాయమైనా ఆ ఖర్చంతా బీసీసీఐ భరిస్తుంది. వీరు నేరుగా ఎన్సీఏకు వెళ్లి చికిత్స తీసుకోవచ్చు.విదేశాల్లో ఆపరేషన్లు చేయాల్సి వచ్చినా బీసీసీఐ భరిస్తుంది.వీరికి భారీ మొత్తంలో ఇన్సూరెన్స్ చేయిస్తుంది. ఆ డబ్బులన్నీ బీసీసీఐ కడుతుంది.
ఇక ఆట పరంగా చూస్తే ఇషాన్, శ్రేయస్లకు ఇది కోలుకోలేని దెబ్బ. టీమిండియా జట్టు ఎంపికలో సెంట్రల్ కాంట్రాక్ట్ ప్లేయర్లకే పెద్దపీట వేస్తారు. అందువల్ల వీరిద్దరూ అవకాశాలను చేజేతులారా పోగొట్టుకున్నారనే అంటున్నారు.
బీసీసీఐ కాంట్రాక్టులో లేనంత మాత్రాన, దేశం తరఫున ఆడకూడదనేం లేదు. వాళ్లు తిరిగి ఆడవచ్చు. సెంట్రల్ కాంట్రాక్ట్ ప్లేయర్లు మాత్రమే ఆడాలనే రూల్ ఎక్కడా లేదు. ఉన్న 15 మందిలో 11మందిని ఆడించడానికే తలప్రాణం తోకకి వస్తుంటే, కాంట్రాక్టులో లేకుండా వీళ్లకి అవకాశాలెలా వస్తాయని కొందరు ప్రశ్నిస్తున్నారు.
Read More: ఆటగాళ్లపై పనిభారం.. బీసీసీఐ పట్టించుకోవడం లేదా?
జూన్ లో జరగబోయే టీ 20 ప్రపంచకప్ లో ఆడాలంటే వీరిద్దరూ ఐపీఎల్ లో అద్బుతమైన ప్రదర్శన చేయాల్సి ఉంటుంది. అలా చేస్తే, అక్కడ జట్టు అవసరాల రీత్యా బీసీసీఐ ఎంపిక చేసే అవకాశం ఉంది. ఇది కాకుండా మరో మార్గం కూడా ఉంది.
బీసీసీఐ కార్యదర్శిగా ఉన్న జైషా పదవిలోంచి దిగి, వేరొకరు వస్తే, వారు అంగీకరిస్తే మళ్లీ బీసీసీఐ కాంట్రాక్టు ఇచ్చే అవకాశం ఉంది. అక్కడ కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉన్నంత కాలం జైషా పదవికి వచ్చిన ఢోకా లేదని, ఏదొక రూపంలో తన ప్రభావం ఉంటుందని అంటున్నారు.
ఇవన్నీ కాదు, తన మనసు మారినా పని జరుగుతుందని చెబుతున్నారు. లేదంటే ఈ ఏడాదంతా వీరు బ్రహ్మాండంగా ఆడితే వచ్చే ఏడాది బీసీసీఐ కాంట్రాక్టు ఇవ్వవచ్చునని అంటున్నారు. మొత్తానికి సమస్యని జఠిలం చేసుకున్న యువ క్రికెటర్లపై కొందరు జాలి పడుతున్నారు.
సందీప్ పాటిల్ లాంటి వాళ్లు బీసీసీఐపై సీరియస్ అవుతున్నారు. వీళ్లిద్దరూ ఏ పాపం చేశారు? అలాగైతే రోహిత్ శర్మ, విరాట్ కొహ్లీ కూడా రంజీలు ఆడాలని పేర్కొన్నాడు. రూల్ అంటే రూలే.. అందరికీ వర్తించాలి. అని చెబుతున్నాడు.