Private Sector Specialists In Key Posts(Today’s news in telugu): ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం మరో కీలక నిర్ణయాన్ని అమలు చేసేందుకు సిద్ధమైంది. కేంద్ర ప్రభుత్వంలో ముఖ్యమైన పదవుల్లో ప్రైవేట్ రంగ నిపుణులకు మరోసారి అవకాశం కల్పించనుంది. ఈ సారి 25 మందికి ఆ అవకాశం కల్పిస్తుంది. ఇప్పటికే పీఎం మోదీ నేతృత్వంలోని కేబినెట్ అపాయింట్ మెంట్స్ కమిటీ ఈ నిర్ణయానికి ఆమోద ముద్ర వేసింది. ముగ్గురికి జాయింట్ సెక్రటరీలుగా అవకాశం కల్పించాలని నిర్ణయించింది. అలాగే మరో 22 మందికి డైరెక్టర్లు, డిప్యూటీ సెక్రటరీలుగా అవకాశం ఇవ్వాలని తీర్మానించింది.
పాలనలో వేగం పెంచేందుకే ప్రైవేట్ నిపుణులకు ఛాన్స్ ఇవ్వాలనే ఈ విధానాన్ని తీసుకొస్తున్నామని మోదీ ప్రభుత్వం చెబుతోంది. గతంలో జాయింట్ సెక్రటరీ, డిప్యూటీ సెక్రటరీ, డైరెక్టర్ పోస్టులను సివిల్ సర్వీసు ఆఫీసర్లకు ఇచ్చేవారు. ఐఏఎస్, ఐపీఎస్, ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్, గ్రూప్-ఏ సర్వీసుల అధికారులకు ఆయాఆయా పదవుల్లో అవకాశాలు కల్పించేవారు.
పీఎం నరేంద్ర మోదీ ప్రభుత్వం వినూత్న విధానాన్ని మరోసారి అమలు చేసేందుకు సిద్ధమైంది. 25 మంది ప్రైవేట్ నిపుణుల నియామకానికి ఆమోదముద్ర వేసింది. లేటరల్ ఎంట్రీగా ఈ స్కీమ్ను పేర్కొంటారు. కేంద్ర ప్రభుత్వం విధాన నిర్ణయాల్లో ప్రైవేట్ నిపుణులు కీలకంగా వ్యవహరించనున్నారు.
Read More: సందేశ్ఖాలీ కేసు వివాదం.. టీఎంసీపై పీఎం మోదీ ఫైర్..
2018లో తొలిసారిగా ఈ విధానాన్ని కేంద్రం అమల్లోకి తీసుకొచ్చింది. 10 జాయింట్ సెక్రటరీ ర్యాంకు పోస్టులు నోటిఫికేషన్ ఇచ్చింది. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరింది. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఈ పోస్టుల భర్తీకి నియామకాలు చేపట్టింది. 2021 అక్టోబర్లో మరోసారి యూపీపీఎస్సీ 31 మంది ప్రైవేట్ నిపుణులను ఎంపిక చేసింది.
ఇప్పటివరకు 10 మంది జాయింట్ సెక్రటరీలు విధుల్లో చేరారు. అలాగే 28 మంది డైరెక్టర్లు, డిప్యూటీ సెకట్రరీలు కూడా బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం 33 మంది ప్రైవేట్ నిపుణులు వివిధ శాఖల్లో పనిచేస్తున్నారు. లేటరల్ ఎంట్రీ విధానం ద్వారా ప్రైవేట్ రంగ వ్యక్తులు నియమిస్తారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం, స్వతంత్ర వ్యవస్థలు, పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్కు చెందిన వ్యక్తులను ఎంపిక చేసే వెసులుబాటు ఉంది.