Zahirabad MP BB Patil Resigns(Political news today telangana): బీఆర్ఎస్ పార్టీకి వరుస షాక్లు తగులుతున్నాయి. రోజుకో నేత అయితే హస్తం లేదంటే కమలం గూటికి చేరుకుంటున్నారు. గురువారం నాగర్ కర్నూల్ ఎంపీ పోతుగంటి రాములు కమలం పార్టీలో చేరిన సంగతి మరువకముందే శుక్రవారం కారు పార్టీకి జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ రాజీనామా చేసి కాషాయ కండువా కప్పుకున్నారు. దీంతో కారు పార్టీకి లోక్ సభ బరిలో నిలిచే అభ్యర్ధులు కరువయ్యారు.
గతకొంతకాలంగా బీఆర్ఎస్ నేతలు ఆ పార్టీ అధిష్టానంపై గుర్రుగా ఉన్నారు. గురువారం నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే పోతుగంటి రాములు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కమలం తీర్థం పుచ్చుకున్నారు. అంతకుముందు పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేత కారు పార్టీకి గుడ్ బై చెప్పి హస్తం గూటికి చేరుకున్నారు. తాజాగా జహీరాబాద్ ఎంపీ బీఆర్ఎస్కి రాజీనామా చేశారు. బీజేపీ నేతలు లక్ష్మణ్, రాష్ట్ర వ్వవహారాల ఇన్ఛార్జి తరుణ్ చుగ్ అధ్వర్యంలో కమలం తీర్థం పుచ్చుకున్నారు. దీంతో కారు పార్టీలో కలవరం మొదలయ్యింది.
గత ఎన్నికల్లో బీఆర్ఎస్ బీఫామ్ మీద పోటీ చేసిన బీబీ పాటిల్ తన సమీప అభ్యర్థి కాంగ్రెస్ పార్టీకి చెందిన మదన్ మోహన్ పై 6,229 ఓట్లతో విజయం సాధించారు. 2014, 2019 రెండు పర్యాయాలు బీఆర్ఎస్ ఎంపీగా గెల్చిన బీబీ పాటిల్ కారును వీడటం ఆ పార్టీకి ఎదురుదెబ్బ అని చెప్పొచ్చు.
ఎంపీలే కాదు మాజీ ఎమ్మెల్యేలు సైతం అయితే కాంగ్రెస్, లేదంటే బీజేపీ గూటికి చేరుకుంటున్నారు. జీహెచ్ఎంసీ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ దంపతులు, పట్నం మహేందర్ రెడ్డి దంపతులు ఇప్పటికే హస్తం గూటికి చేరుకున్నారు. ఇంకా చాలా మంది కారును వీడి ఇతర పార్టీల్లో చేరడానికి సిద్ధంగా ఉన్నారని తెలుస్తోంది.
Read More: Komatireddy Venkat Reddy vs KTR: సిరిసిల్లలో తేల్చుకుందాం.. కేటీఆర్కు మంత్రి కోమటిరెడ్డి సవాల్..
బీఆర్ఎస్ తరఫున గెలిచిన ఎమ్మెల్యేలు కూడా ఆ పార్టీని వీడటానికి సిద్ధంగా ఉన్నట్లు కారు పార్టీ కార్యకర్తలు జోరుగా ప్రచారం చేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీలో నాయకులకు కనీస గౌరవం లేకపోవడంతోనే ఆ పార్టీ నుంచి నేతలు బయటకు వస్తున్నారని ఆ పార్టీ శ్రేణులు తెలిపాయి. అటు ఆ పార్టీలో వర్గపోరు కూడా నేతలు వీడటానికి ప్రధాన కారణమని తెలుస్తోంది.
అటు నాగర్ కర్నూల్ నియోజకవర్గంలో అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ప్రస్థుత ఎంపీ రాములు మధ్య వర్గపోరు తారాస్థాయికి చేరుకున్నట్లు తెలుస్తోంది. అందుకే రాములు బీఆర్ఎస్ను వీడి బీజేపీలో చేరారు. రాములు కుమారునికి నాగర్ కర్నూల్ టికెట్ కన్ఫామ్ చేసినట్లు తెలుస్తోంది.
అటు పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేత బీఆర్ఎస్ పార్టీని వీడటానికి ఆ పార్టీ నేత మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అని పార్టీ వర్గాల్లో చర్చకు దారి తీసింది. పెద్దపల్లి ఎంపీ టికెట్ తనకే దక్కనుందని నియోజకవర్గంలో చెప్పుకోవడంతో బాల్క సుమన్పై వెంకటేష్ నేత అసంతృప్తిగా ఉన్నారని అందుకే పార్టీ మారారని పార్టీ శ్రేణులు పేర్కొన్నాయి.