Sandeshkhali Incident: సందేశ్ ఖాలీ మహిళల ఆందోళన నిర్లక్ష్యం చేసిన తృణమూల్ కాంగ్రెస్ పై యావత్ దేశం ఆగ్రహంగా ఉందని ప్రధాన మంత్రి నరేంద్రమోదీ అన్నారు. ఈ కేసు నుంచి నిందితుడిని కాపాడేందుకు ఆ పార్టీ ప్రయత్నం చేస్తోందని ఆయన దుయ్యబట్టారు. శుక్రవారం పీఎం మోదీ పశ్చిమ బెంగాల్ లో పర్యటించారు. హుగ్లీ జిల్లాలోని ఆరంగాబాగ్ లో పలు అభివృద్ది పనులకు శంకుస్థాపనలు చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు.
సందేశ్ ఖాళీ మహిళలపై టీఎంసీ నేత పాల్పడిన అఘాయిత్యాలను చూసి యావత్ దేశం ఆగ్రహించిందని పీఎం మోదీ అన్నారు. ఆ ఘటన సిగ్గు చేటన్నారు. అలాంటి దారుణాలను చూసి సంఘ సంస్కర్త రాజారామ్మోహన్ రాయ్ ఆత్మ ఘోషించి ఉంటుందన్నారు. సందేశ్ ఖాళీ ఘటన కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న షేక్ షాజహాన్ అన్ని హద్దులూ దాటాడన్నారు. అయినా అతన్ని రెండు నెలల పాటు అరెస్టు చేయలేదన్నారు. అతన్ని కేసు నుంచి తప్పించేందుకు తృణముల్ తీవ్రంగా ప్రయత్నించిందని మోదీ దుయ్యబట్టారు.
ఈ సందర్భంగా విపక్షాల ” ఇండియా కూటమి” పైనా ప్రధాని విమర్శలు గుప్పించారు. సందేశ్ ఖాలీ దారుణాలపై ప్రతిపక్షాల కూటమి మౌనంగా ఉండడం సిగ్గు చేటన్నారు. అవినీతి పరులకు అండగా ఉండటం, బుజ్జగింపు రాజకీయాలే వారికి ప్రథమ ప్రథమ ప్రాధాన్యం అని ద్వజమెత్తారు.
Read More: లక్షద్వీప్ పై భారత్ వ్యూహాత్మక అడుగులు.. నౌకాదళ స్థావరం ఏర్పాటు..
బెంగాల్ లో కేంద్ర దర్యాప్తు సంస్థలు పని చేయకుండా టీఎంసీ ప్రభుత్వం అడ్డుకుంటోందని ప్రధాని మోదీ మండిపడ్డారు. వారి రాజకీయాల కారణంగానే పేద ప్రజలు అవస్థలు పడుతున్నారని అన్నారు. అవినీతి నేతలకు వ్యతిరేకంగా తాను పోరాడుతున్నందువల్లే టీఎంసీ తనపై ఆగ్రహంగా ఉందన్నారు. అధికారం నుంచి వారికి వీడ్కోలు పలికేందుకు కౌంట్ డౌన్ మొదలయ్యిందన్నారు. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో తృణముల్ ఓటమి ఖాయమని ప్రధాని మోదీ అన్నారు.