New Difficulties : ద్రవ్యోల్బణం, వడ్డీ రేట్ల పెంపు కారణంగా స్టాక్ మార్కెట్లలో షేర్లు పతనమవడం, కొత్త కంపెనీల టేకోవర్ల కారణంగా అసలు కంపెనీల షేర్లు కుంగిపోవడం… కుబేరుల సంపదను ఓ రేంజ్ లో కరిగించేస్తున్నాయి. టెస్లా, అమెజాన్, మైక్టోసాఫ్ట్ సంస్థల సంపద ఏకంగా లక్షల కోట్లలో ఆవిరి కావడం… భారీగా ఉద్యోగాల కోతకు ఎక్కడ దారి తీస్తుందో అని… తీవ్ర ఆందోళ వ్యక్తమవుతోంది.
స్టాక్ మార్కెట్లలో లిస్టైన సంస్థల్లో, ప్రపంచంలోనే ఒక ట్రిలియన్ డాలర్ల మేర.. అంటే సుమారు రూ.82 లక్షల కోట్ల మార్కెట్ విలువను కోల్పోయిన సంస్థగా అమెజాన్ రికార్డు నెలకొల్పింది. 2021 జులైలో అమెజాన్ మార్కెట్ విలువ రికార్డు స్థాయిలో 1.88 లక్షల కోట్ల డాలర్లు… అంటే మన కరెన్సీలో సుమారు రూ.154 లక్షల కోట్లుగా నమోదైంది. ఏడాది కాలంగా వడ్డీ రేట్లు, ద్రవ్యోల్బణం బాగా పెరగడంతో పాటు త్రైమాసిక ఫలితాలు నిరాశాజనకంగా ఉండటంతో… ఇన్వెస్టర్లు అమెజాన్ షేర్లను భారీగా అమ్మేశారు. దీంతో అమెజాన్ మార్కెట్ విలువ 879 బిలియన్ డాలర్లకు… అంటే సుమారు రూ.72 లక్షల కోట్లకు తగ్గింది. అంటే 16 నెలల కాలంలో ఏకంగా 53 శాతానికి పైగా పతనమైంది. ఓ వైపు మార్కెట్ విలువ తగ్గడం, మరోవైపు ఆదాయం పడిపోవడంతో… కొత్త ఉద్యోగ నియామకాలు చేపట్టబోమని… ఉన్న ఉద్యోగుల సంఖ్యనే తగ్గించుకుంటామని అమెజాన్ యజమాని జెఫ్ బెజోస్ ప్రకటించడంతో… సంస్థలో ఎన్ని వందల ఉద్యోగాలు ఊడతాయోనని సిబ్బంది తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఇక విండోస్ సాఫ్ట్వేర్ తయారీ సంస్థ మైక్రోసాఫ్ట్ కూడా 2021 నవంబరు గరిష్ఠ స్థాయి నుంచి రూ.73 లక్షల కోట్ల మేర మార్కెట్ విలువను కోల్పోయింది. మార్కెట్ విలువను అత్యధికంగా కోల్పోయిన సంస్థల్లో అమెజాన్ తర్వాతి స్థానం మైక్రోసాఫ్ట్ దే.
మరోవైపు… ట్విట్టర్ టేకోవర్ తర్వాత ప్రపంచ అగ్ర కుబేరుడు ఎలాన్ మస్క్ సంపద కూడా 200 బిలియన్ డాలర్ల దిగువకు పడిపోయింది. ఫోర్బ్స్ నివేదిక ప్రకారం.. ఎలాన్ మస్క్ ప్రస్తుత సంపద 194.8 బిలియన్ డాలర్లు. 44 బిలియన్ డాలర్ల భారీ మొత్తానికి ట్విట్టను కొనడంతో… మస్క్ కే చెందిన మరో కంపెనీ టెస్లా దాదాపు సగం మార్కెట్ విలువను కోల్పోయింది. అయినా ఇప్పటికీ ప్రపంచ కుబేరుల జాబితాలో ఎలాన్ మస్కే మొదటి స్థానంలో ఉండటం విశేషం.