Hyderabad Metro : ఈ మధ్యకాలంలో హైదరాబాద్ మెట్రో రైళ్లు తరచూ మొరాయిస్తున్నాయి. తాజాగా మియాపూర్-ఎల్బీ నగర్, ఎల్బీనగర్-మియాపూర్ మార్గాల్లో సుమారు 30 నిమిషాలపాటు సేవలు నిలిచిపోయాయి. దీంతో ఆ సమయంలో ఆయా మార్గాల్లో వెళ్లే రైళ్లను వివిధ స్టేషన్లలో నిలిపేశారు. ఖైరతాబాద్, లక్డీకపూల్, అమీర్పేట్ స్టేషన్లలో రైళ్లు ఆగిపోయాయి. ఆ తర్వాత పునరుద్ధరణ చర్యలు చేపట్టడంతో రైళ్లు తిరిగి బయల్దేరాయి. 30 నిమిషాలపాటు రైళ్లు ఆగిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రెండు రోజుల క్రితం అమీర్ పేట్ -రాయదుర్గం మార్గంలో సర్వీసులకు కాసేపు అంతరాయం కలిగింది. జూబ్లీహిల్స్ రోడ్డు నెంబర్ 5 వద్ద ఉన్న స్టేషన్ లో ఉదయం 10 గంటల సమయంలో 10 నిమిషాలపాటు రైలు నిచిపోయింది. ఆ సమయంలో ప్రతి రెండు నిమిషాలకు ఒక సర్వీసు ఉంటుంది. దీంతో 5 సర్వీసులు ఆగిపోయాయి. ఉద్యోగులు కార్యాలయాలకు వెళ్లే సమయం కావడంతో చాలా మంది ఇబ్బందులు పడ్డారు.
ఎందుకు మొరాయిస్తున్నాయి?
మెట్రో సర్వీసులు ప్రారంభించిన కొత్తలో ఇలాంటి ఇబ్బందులు పెద్దగా రాలేదు. గత 6 నెలలుగా అనేక సార్లు సర్వీసులకు తరచూ అంతరాయం కలుగుతోంది. ఆధునిక టెక్నాలజీతో అందుబాటులోకి తీసుకొచ్చిన మెట్రో రైళ్లు ఎందుకు మొరాయిస్తున్నాయనే ప్రశ్న తలెత్తుతోంది. కానీ ఇప్పుటి వరకు మెట్రో రైలు యాజమాన్యం స్పష్టమైన ప్రకటన చేయలేదు. ఎప్పుడూ రైళ్లు నిలిచిపోయినా సాంకేతిక కారణాలతో నిలిచిపోతున్నాయని చెబుతోంది.
వేగం పెంపు
మెట్రో రైలు ప్రారంభించిన కొత్తలో రైళ్ల గరిష్ట వేగం గంటకు 60 కిలోమీటర్లు. కానీ కొన్నినెలల క్రితం గరిష్ట వేగాన్ని 90 కిలోమీటర్లకు పెంచారు. గతంలో ఎల్బీనగర్ నుంచి మియాపూర్ చేరుకోవడానికి 52 నిమిషాల సమయం పట్టేది. వేగం పెంపు తర్వాత 46 నిమిషాలే పడుతోంది.
పెరిగిన రద్దీ
కరోనాకు ముందు మెట్రో రైళ్లలో రోజూ గరిష్టంగా 4 లక్షల మంది ప్రయాణించేవారు. కరోనా వల్ల కొన్నాళ్లు సర్వీసులు నిలిచిపోయాయి. తిరిగి ప్రారంభమైన తర్వాత మెట్రోకు పెద్దగా ఆదరణ లభించలేదు. ఐటీ ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోంలో ఉండటం మెట్రోపై ప్రభావం చూపించింది. అయితే ఐటీ కంపెనీలకు తిరిగి ఉద్యోగులు రావడం ప్రారంభమైన తర్వాత మెట్రోలో రద్దీ మళ్లీ పెరిగింది. ఇటీవల రోజువారీ ప్రయాణికుల సంఖ్య 4 లక్షలకు చేరుకుంది. మెట్రో స్టేషన్లలో వాణిజ్య కార్యకలాపాలు ఊపందుకుంటున్నాయి. ఆర్థిక కష్టాల్లో ఉన్న మెట్రోకు ఆదాయం పెరుగుతున్న సమయంలో సర్వీసులు తరచూ నిలిచిపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఈ సమస్య పరిష్కారంపై మెట్రో యాజమాన్యం దృష్టి పెట్టాల్సి ఉంది.