Folk Singer Vaddepalli Srinivas Passed away: ప్రముఖ సినీ నేపథ్య గాయకుడు వడ్డేపల్లి శ్రీనివాస్ ఇకలేరు. గురువారం ఉదయం హైదరాబాద్ లో కన్నుమూశారు. సికింద్రాబాద్ పద్మారావు నగర్ లోని తన ఇంట్లోనే తుదిశ్వాస విడిచారు. వడ్డేపల్లి శ్రీనివాస్ మరణవార్తను ఆయన కుటుంబ సభ్యులు ప్రకటించారు.
కొన్నాళ్లుగా వడ్డేపల్లి శ్రీనివాస్ అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ క్రమంలోనే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. ఆయన మృతి సినీ పరిశ్రమ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. శ్రీనివాస్ మృతి చిత్రపరిశ్రమకు తీరని లోటని పలువురు సినీప్రముఖులు సంతాపం ప్రకటించారు.
Read More: క్యాన్సర్తో మాజీ మిస్ ఇండియా మృతి
వడ్డేపల్లి శ్రీనివాస్ జానపద గాయకుడిగానూ ఎంతో పేరు తెచ్చుకున్నారు. ఆ తర్వాత సినిమా పరిశ్రమలోకి అడుగుపెట్టి తన ప్రతిభను చాటుకున్నారు. స్టార్ హీరోల సినిమాల్లోనూ పాటలు పాడే అవకాశం అందుకున్నారు. 2012లో వచ్చిన పవర్ స్టార్ పవన్ కల్యాణ్ బ్లాక్ బస్టర్ హిట్ గబ్బర్ సింగ్ సినిమా శ్రీనివాస్ ను గాయకుడిగా మరో మైలురాయికి చేర్చింది. ఈ సినిమాలో గన్నులాంటి పిల్ల.. పాటతో ఎంతో పాపులారిటీ తెచ్చుకున్నారు. ఆ పాటకి శ్రీనివాస్ ఫిల్మ్ఫేర్ అవార్డు అందుకున్నారు.
ఆ తర్వాత ఆయన కెరీర్ లో చాలా అవకాశాలు అందుకున్నారు. మొత్తంగా 100పైగా సినిమా పాటలు పాడారు. ప్రైవేట్ గా ఎన్నో గీతాలు ఆలపించారు. ఫోక్ గాయకుడిగానూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. జానపద గీతాలే ఆయనలో గాయకుడిని ప్రపంచానికి బాగా పరిచయం చేశాయి.